Friday 3 December, 2010

తెలంగాణ చరిత్రలోనైనా ముస్లింలకు న్యాయం జరగాలి

చిన్నప్పుడు పంద్రాగస్ట్‌కు సంబరంగా ఊరు తిరిగేది. బడి ముందల జెండా ఎగరేసినంక సార్లు, ఊరిపెద్దలు స్వాతంత్య్రం గురించి, పోరాటయోధుల గురించి చెప్తుంటే ఒళ్లంతా ఊగిపోయ్యేది. పెద్దయినంక తెలిసింది, దేశ విభజన పేరుమీద లక్షల మంది బలయ్యన్రని, సరిహద్దుల్లో రక్తం యేరులై పారిందని. ఇట్లనే నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ అని, హైదరాబాద్‌ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన రోజని చెబితే పాల మనసుతోని నిజమే అని నమ్మినం. తీరా చూస్తే - నిజాం పాలనను మించి ఆంధ్ర పాలనను తెచ్చిన్రని తెలిసొచ్చె. ఈడ గుడ నిజాం నిరంకుశ పాలన అని, రజాకార్ల దౌర్జన్యాలు అనే విన్నం గనీ పోలీస్‌ యాక్షన్‌ పేరు మీద లక్షలమంది ముస్లింలను కాల్చి చంపేసిన్రని తెలియకపాయె. ఆ విషయం ఇప్పటోల్లకు అస్సలు తెల్వకుండ ఎందుకు దాచిపెట్టిన్రని ఇవాళ మేం అడుగుతున్నం. అంతమందిని పొట్టనుబెట్టుకోవడం వెనుక హిందూత్వ భావజాలమె పని చేసిందనుకోవాల్నా? అంటే అప్పట్నించే ఆ భావజాలం అంత బలంగా ఉందా? ‘హైదరాబాద్‌ : ఆఫ్టర్‌ ద ఫాల్‌’ అనే సంకలనంలో (సంకలన కర్త ఒమర్‌ ఖాలిదీ) పోలీస్‌ యాక్షన్‌లో రెండు లక్షల మంది ముస్లింలు చంపబడినట్లు ఒక రిపోర్ట్‌ (పండిట్‌ సుందర్‌లాల్‌, ఖాజీ మొహమ్మద్‌ అబ్దుల్‌ గఫార్‌)ఉంది. కాని ఆ సంఖ్య ఆరు లక్షల వరకు ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. అందమైన ముస్లిం ఆడపిల్లల్ని, ఆడోల్లని తెలుగోల్లు మాయం చేసిన్రని, పోలీసులు వారాల తరబడి రేప్‌ చేసిన్రని, లూటీలు, దహనాలకు లెక్కే లేదని తెలిసినప్పుడు మన ప్రజాస్వామ్యం మీద అనుమానమేస్తుంది. పోలీస్‌ యాక్షన్‌ గురించి మాట్లాడడం ఇప్పుడెందుకు అనే తెలంగాణ వాదులున్నారు. వాళ్లను ఎట్ల అర్థం జేసుకోవాలె? లక్షలమందిని చంపడం, ఇండ్లను దోచుకోవడం వల్ల కొన్ని తరాలపాటు ముస్లింలు కోలుకోకుండా చేశారు. ఇవాల్టి తెలంగాణ ముస్లింల వెనుకబాటుకి అది కూడా ఒక కారణం. ఎంతమందిని చంపిన్రనే దగ్గర్నించి ముస్లింల మానసిక హింస దాక అప్పటి ఆ విషయాలన్నీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది.

అయాల ఉర్దూ రాజభాష. ముస్లింలు-తెలుగోల్లు ఉర్దే చదివేదికదా. ఇండియాల కలపంగనె ఒక్కసారిగ ఉర్దూ తీసిపారేసి కోస్తాంధ్ర తెలుగు అందరి మీద రుద్దిన్రు. ప్రజాస్వామ్యం తెచ్చిన్రు గదా, మరి కనీసం ముస్లింల కోసమన్నా ఉర్దూను ఎందుకు కాపాడాలె? అదే హైదరాబాద్‌ రాష్ట్రం వేరుగానే ఉంటే కనీసం తెలంగాణన్న వేరుగ ఉంటే ఉర్దూ ఇయాల రెండో భాషగా ఉండేది కదా (ఏమో?) ఇయాల ఆంధ్రా పాలకులు ఉర్దూను తొక్కి పారేసి ముస్లింలు గుడ కోస్తాంధ్రంలనే జవాబు చెప్పేటట్టు తమ ఆధిపత్యాన్ని రుద్దుతున్రు. ఉర్దూను ఛీత్కరించడంతో తెలంగాణలో తెలుగు చదివినోళ్లు లేక ఉద్యోగాలన్నింటిలో ఆంధ్రావాళ్లను నింపడం మొదలైంది. అప్పట్నించి మొదలైన ఆంధ్రావలస ఇప్పటికీ ఆగలేదు. ఇక్కడ ముస్లింలకు కూడా పెద్దఎత్తున అన్యాయం జరిగింది. కేవలం ఉర్దూ తెలిసిన అప్పటి ఉద్యోగస్తులకు తెలుగు లేక ఇంగ్లీషు నేర్చుకోవాలని అప్పటి ప్రభుత్వం కొన్ని రోజుల గడువు ఇచ్చింది. మరి నేర్చుకోలేని వాళ్లు ఉద్యోగాల నుంచి తీసే వేయబడ్డారా? లేక ఏం జరిగింది అనే విషయం తెలియదు. అప్పటి దాకా ఉర్దూ మీడియంలో చదువుకున్న యువతరం ఏమయ్యారు? అప్పట్నించి తెలుగు మీడియం ప్రవేశ పెడితె మరో 15 నుండి 20 ఏళ్లకు కదా విద్యావంతులయ్యేది, ఈ మధ్య కాలమంతా ముస్లింలు అన్యాయం పాలయినట్లే కదా? ప్రజాస్వామ్యం పేరుమీద ఇంత దోపిడీ, ఇంత అన్యాయానికి పాల్పడడమేమిటి?
మొత్తం ఇండియాల ఉర్దూ మాట్లాడేవాళ్లు కోట్లమందే ఉంటారు. ఇన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డయి, మరి ఒక్క ఉర్దూ రాష్ట్రమైనా ఎందుకు లేదని ప్రశ్నించుకోవడం దేశద్రోహం ఏం కాదు కదా. దేశ విభజనాభారాన్ని ఇక్కడి ముస్లింల మీద మోపి ఆ విషయం తప్పించడం సరైందా? ఉర్దూ మాట్లాడేవారు ఒక్కతాన లేకుండా దేశవ్యాప్తంగా పరుచుకొని ఉన్నారు కదా అనే సాకు సరైందా? ఎంఐఎం ఉర్దూ రాష్ట్రం కావాలని 1956లో డిమాండ్‌ చేసి ఉంటే ఎంత బాగుండు.
ఇవాళ హైదరాబాద్‌ లోని, తెలంగాణలోని ఉర్దూ మాట్లాడేవారు, సాహిత్యకారులు ఒక వేరే ప్రపంచంగా బతుకుతున్నారు. వాళ్లను మిగతా ప్రపంచంతో కలిపే ప్రయత్నం ఏది జరుగుత లేదు. వాళ్లతోనూ వేరే ప్రపంచం కలవడం లేదు. వాళ్ల సమస్యలు, వాళ్ల బాధలు వేరేగా ఉన్నాయి. ఆ అంతరాన్ని పెరగనివ్వకుండా చూడాల్సి ఉంది.
తెలంగాణ హిస్టరి రికార్డు చేసేప్పుడు విధిగా ఉర్దూ మాట్లాడేవాళ్ల ప్రాతినిధ్యం ఉండేలా చూడాలి. వాళ్ల ఫీలింగ్సుని పరిగణనలోకి తీసుకోవాలి. ఉర్దూను తెలంగాణ ద్వితీయ భాషగా గుర్తించాలి.
తెలంగాణ గురించి కమ్యూనిస్టులు, ఆంధ్రా వలస పాలకులు రాసిన చరిత్రే ఆధారం కావడం (?)తో అసలు విషయాలు ఎన్నో మరుగున పడ్డాయి. వెలుగులోకి రావలసిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన విషయాల్ని ‘ముల్కి’ ముస్లిం ప్రత్యేక సంచికలో సంగిశెట్టి శ్రీనివాస్‌ రాసిండు. ‘నిజాం చరిత్రకు చెదలు’ పేరుతో రాసిన ఈ వ్యాసంలో ముస్లింలు మనసులో అనుకున్నప్పటికీ బయటికి చెప్పలేని కొన్ని విషయాలతో పాటు ఎన్నో కొత్త కోణాల్ని రికార్డు చేసిండు. దానిపట్ల ఎంతో వ్యతిరేకత వ్యక్తం కావడం ఆశ్చర్యం కలిగించింది. రాజరికాన్ని సపోర్టు చేయడంగా కొందరు మాట్లాడిన్రు. నిజాంలది రాజరికమే. (ఆ పేరుమీద రెడ్డి, వెలమ తదితర భూస్వాములు రాజ్యం చేసిన విషయం మరుగున పెడుతున్నారు.) ఇవాల ప్రజాస్వామ్యం పేరుమీద కోస్తాంధ్రులు నియంతృత్వం చెలాయిస్తుంటే, రాజరికం కన్నా ఎక్కువ దౌర్జన్యాలు చెలాయిస్తుంటే ఆ విషయం చెప్పొద్దంటే ఎట్ల? పైగా తమ కులాలకు చెందిన వాళ్లు రాజులుగా ఉన్నా ఆయా కులాల వాళ్లు మీరు రాజులు కదా అనే నిందను మోయడం లేదు. ఇండియాను క్రిస్టియన్లు పరిపాలిస్తే ఇవాళ క్రిస్టియన్లను మీరు పాలకులు కదా అని అడగడం లేదు. కాని ముస్లింల విషయానికొస్తే మాత్రం మీరు 400 ఏండ్లు పాలకులుగా ఉన్నరు కదా అని కొన్ని బీసీ సంఘాలు ముస్లిం రిజర్వేషన్‌ను వ్యతిరేకించాయి. అట్లె ఎంతోమంది అలా వాదిస్తున్నారు. ఆఖరికి తెలంగాణ వాదుల్లో కొందరు గూడ అయ్యే మాటలు మాట్లడడం విన్నప్పుడు చీదరింపు కలిగింది. ఏ కులంగాని, మతంగాని, జాతిగాని ఇట్లా మీరు పాలకులు కదా అనే భారాన్ని మోయడం లేదు. ఒక్క ముస్లింలు తప్ప.
పాలకులు అన్న ఈ భారాన్ని మోస్తున్న ముస్లింలకు సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బిజెపి నిర్వహిస్తున్న తీరు వల్ల కూడ మరింత నష్టం కలుగుతున్నది. ఇట్లాంటి సందర్భంలో సెప్టెంబర్‌ 17ను ఉత్సవంగా టిఆర్‌ఎస్‌ నిర్వహించకుండా ఉండడం సరైందనిపించింది. కాని కొన్ని తెలంగాణ సంఘాలు ఈ విషయాన్ని విస్మరించడం విస్మయం కలిగించింది. కోస్తాంధ్ర వలసవాద పాలన నుంచి తెలంగాణకు విమోచన కలగనంతవరకు సెప్టెంబర్‌ 17ను ఉత్సవంగా జరపడంలో అర్థం లేదు.
ఇవాళ రాజకీయంగా జరుగుతున్న ఉద్యమంపై ముస్లింలకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజకీయ ఉద్యమం సాహిత్యరంగంలోని ఒక వర్గాన్ని ప్రభావితం చేస్తుండడం ఇవాల్టి విషాదం. టిఆర్‌ఎస్‌ మొదలయింతర్వాత బిజెపి నుంచి చీలిపోయి టిఎస్‌ఎస్‌గా ఏర్పడ్డ నరేంద్ర పార్టీ టిఆర్‌ఎస్‌లో కలవడం ముస్లింల పట్ల వివక్ష మొదలు కావడానికి కారణమైంది. (ముస్లింలకు కూడా టిఆర్‌ఎస్‌పై అనుమానం మొదలైంది.) అంతదాకా ముస్లింల జనాభా తెలంగాణలో గణనీయంగా ఉందని భావించి 15 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ప్రకటించిన టిఆర్‌ఎస్‌ ఆ వాయిస్‌ను తగ్గించింది. అట్లే సీట్ల కేటాయింపులోనూ అన్యాయం చేసింది. ఇప్పటికీ ఆరెస్సెస్‌ వాడినే అనే నరేంద్ర రెండవ నాయకుడుగా ఉండడంతో ముస్లింలలో ఒక సందిగ్ధం నెలకొంది. తెలంగాణ వస్తే బిజెపి ప్రాబల్యం పెరుగుతుందని జరిగిన ఒక ప్రచారం కూడా ఇందుకు కారణం. పైగా అసెంబ్లీలో ముస్లింల ప్రతినిధిగా మాట్లాడే ఎం.ఐ.ఎం కూడా తెలంగాణ పట్ల మొదట వ్యతిరేకంగా మాట్లాడడం కూడా మరో కారణం. కాని ఎం.ఐ.ఎం ముస్లింల ప్రతినిధి కాదని ఇక్కడ అందరం గుర్తుంచుకోవాలి. ఒక్క పాతబస్తీలో తప్ప మిగతా తెలంగాణ జిల్లాల్లో ముస్లింలు ఎం.ఐ.ఎం.తో లేరు.
నరేంద్ర తదితర ఆరెస్సెస్‌ వాదుల (రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఆరెస్సెస్‌ వాదులు కూడా) వల్ల ఇవాల ముస్లింల పట్ల ఒక వివక్ష, మౌనం చూస్తున్నాం. చివరికి ఇదే భావజాలం సాహిత్యానికి కూడా పాకి మిగతా ఐడెంటిటీ ఉద్యమాలతో పాటు ఒక ఉద్యమంగా నడుస్తున్న తెలంగాణ వాదం ముస్లిం వాదం పట్ల వివక్ష చూపుతూ వస్తున్నది. వేదికల మీద ముస్లింలు లేకుండానే నడిపిస్తున్నది. ఒక్క తెలంగాణ సాంస్కృతిక వేదిక కాస్త ఇందుకు మినహాయింపుగా కనబడుతున్నది.
సాహిత్య ఉద్యమంతోపాటు తెలంగాణ రాజకీయాలు కూడ ముస్లింల పట్ల స్పష్టమైన ప్రకటనలు (చేయాలి) చేసేలా తెలంగాణ ముస్లింల ప్రాముఖ్యతను రికార్డు చేయవలసిన అవసరం ఉంది.
తెలంగాణ హిస్టరీ రికార్డు చేసే క్రమంలో ముస్లింల కోణం నుంచి లెక్కలోకి తీసుకోవల్సిన అంశాలు క్లుప్తంగా :




  • పోలీస్‌ యాక్షన్‌లో ఎన్ని లక్షలమంది ముస్లింలను హత్యచేశారో, ఎంతమంది ముస్లిం స్త్రీలను, అమ్మాయిల్ని రేప్‌ చేశారో, మాయం చేశారో, ఎన్ని ఇండ్లను దోచుకున్నారో, ధ్వంసం చేశారో విస్తృత అధ్యయనం జరగాలి. అందుకు ప్రతిగా ముస్లింలను ఆదుకోవాలి.



  • తెలంగాణకు సంబంధించి హిస్టరి దగ్గర్నుంచి అన్ని రంగాల్లో ఉర్దూ మాట్లాడేవాళ్ల ప్రాతినిధ్యం ఉండాలి. ముస్లింల ప్రాతినిధ్యం ఉండాలి.



  • ఉర్దూను తెలంగాణ ద్వితీయ భాషగా గుర్తించాలి.



  • తెలంగాణ గురించి కమ్యూనిస్టులు, ఆంధ్రా వలసపాలకులు రాసిన చరిత్ర ఆధారంగా ముస్లింలను చూడొద్దు. తెలంగాణలో ముస్లింలు ఒక భాగం అని నమ్మేవాళ్లు కొత్తగా రాసే చరిత్ర ఆధారంగా చూడాలి.



  • శ్యాంసుందర్‌ అనే దళిత నాయకుడు హైదరాబాద్‌ ప్రత్యేక దేశంగా ఉండాలని యుఎన్‌ఓ తో మాట్లాడిండని, ఇంకో మూడు రోజులు గనుక పోలీస్‌ యాక్షన్‌ జరగకపోయి ఉంటే హైదరాబాద్‌ను ప్రత్యేక దేశంగా యుఎన్‌ఓ ప్రకటించేదని చెప్తున్నరు. అట్లా జరిగి ఉంటే ఇండియా అనే ఒక దేశం మరో దేశమైన హైదరాబాద్‌ మీద దాడి చేసినట్లు అయ్యేది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌ సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో కలపడం వల్ల దళితులకు అన్యాయం జరుగుతుందని ఫీలయిన శ్యాంసుందర్‌ చెప్పిన కారణాలేమిటి? అవి నిజ మయ్యాయా?



  • నిజాం రాజుల పాలనను ముస్లింల పాలన అనడాన్ని వ్యతిరేకించాలి. ముస్లింలు 400 ఏండ్ల పాలకులు అనే ప్రచారాన్ని ఖండించాలి.



  • నిజాం రాజ్యంలో ‘నిరంకుశత్వం’ నడిపిన రెడ్లు, వెలమలు తదితర భూస్వాముల గురించిన విషయాలు కూడ చర్చకు రావాలి. ఎవరి నిరంకుశత్వం ఎంత అనేది తెలియాలి.



  • ఉర్దూలో, పార్సీలో ఉండే సోర్సెస్‌ (ఆధారాలు) వెలికి తీయడం ద్వారా అనేక అబద్ధపు ప్రచారాలు, అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి, కనుక ఆ ప్రయత్నం జరగాలి.



  • ఖాసీం రజ్వీ ఆటోబయోగ్రఫీ పాకిస్తాన్‌లో ముద్రణ పొందింది. దాన్ని రిఫర్‌ చేయడం జరిగితే అతను రజాకార్‌ ఉద్యమం చేయడానికి అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం జరగాలి.



  • నిజాం కాలంపై విదేశాలలో సైతం రిసెర్చ్‌లు జరుగుతుంటే ఇక్కడ ఇంతటి వివక్ష, దుష్ప్రచారం జరుగుతుండడాన్ని చర్చకు పెట్టాలి.



  • కోస్తాంధ్రలో దళిత క్రైస్తవులు ఎక్కువగా ఉన్నట్లుగా ఇక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. మరి దళితుల నుంచే ఎక్కువగా ముస్లింలుగా మారిన్రా అనే విషయంలో అధ్యయనం జరగాలి. దీన్ని లెక్కలోకి తీసుకోవాలి.



  • ఆంధ్రుల వలస వల్ల చిల్లర వ్యాపారాల దగ్గర్నుంచి ఉద్యోగాల దాకా ముస్లింలు అన్యాయానికి గురయిన, గురవుతున్న విషయం రికార్డు కావాలి.



  • హైదరాబాద్‌ లాంటి చోట్ల పోలీసు శాఖలో ముస్లింల శాతం మరీ తక్కువగా ఉన్నది. దీనివల్ల ఎంతో వివక్ష కొనసాగుతున్నది. ఇది ఏ భావజాలం వల్ల జరుగుతున్నది? దీని వెనుక రాజకీయాలేమిటి? పోలీసుల భర్తీలో ముస్లింల పట్ల వివక్ష గురించి చర్చ జరగాలి.



  • ముస్లింలకు, తెలుగోల్లకు మధ్య ఏయే కారణాల వల్ల అంతరం పెరుగుతున్నదో చూడాలి.



  •                                                                                  - స్కైబాబ

                                      మే 19th, 2007 by డిస్కవర్ తెలంగాణ

    3 comments:

    1. charitra telusukuni em sadhinchali?? sare meerannattu muslims ki anyayam jarigi unte.. ippudemina cheyyagalama?

      ReplyDelete
    2. okasari kaaloji 'naa sodi' chadavandi. it clearly depicts how muslims exploited hindus during entire nizam regime. no one is a saint.

      the moment you blame someone as a sectarian, u fall under the same trap.

      ReplyDelete
    3. హైదరాబాద్‌లో ముస్లింలు ఎక్కువగా ఉండే బోరబండ, హఫీజ్‌పేట ప్రాంతాలు చూసాను. అక్కడి ముస్లింలలో ఎక్కువ మంది లోయర్ మిడిల్ క్లాస్‌వాళ్లే. హైయర్ మిడిల్ క్లాస్‌వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ముస్లింలు అంతగా కనిపించలేదు.

      ReplyDelete

    మీ అభిప్రాయం తెలియజెయ్యండి