Monday 5 November, 2012

జమ్మి (దసరా బేస్డ్ లవ్ స్టొరీ)


అయాల దసరా!
ముందుగాల అనుకున్నట్లుగనె నేను, మా దోస్తు సైదులు అయాల మద్యాన్నానికే ఊరు చేరుకొని ఉంటిమి. పొద్దుగూకాల జమ్మిచెట్టు కాడికి పోతానికి ఎవరి ఇండ్లల్ల వాళ్లం తయారీల ఉన్నం.
షానా ఏండ్లాయె దసరకు ఊరికి రాక. నేను హైద్రాబాద్‌ల, సైదులు వరంగల్ల ఉండిపోటంల దసరకు ఇద్దరం కలుసుకునేది కుదుర్తలె. ఈపాలి ఎట్లన్న కలుద్దమనుకున్నం. ఇంకో ముక్యమెన ముచ్చ మా సైదులు నూనూగు మీసాల వయసుల ఉన్నప్పుడు తను ప్రేమించిన నిర్మలను సూడాలని షానా ఉందని, కనీసం దసరకన్న సూషే అవకాశముంటదని ముందే చెప్పిండు నాతోని. ‘ఇప్పుడు మల్ల సూషి, కలిసి ఏం జేస్తవ్‌రా.. అనవసరపు తలనొప్పులు’ అని సర్దిచెప్దామనుకున్న. గని ఆడు ఊకోలె. ‘షానా ఏండ్లయిపొయ్యింది సూడక.. ఈ మద్య ఎందుకో ఊకె యాదికొస్తుందిరా.. కలలకొస్తుంది.. ఒక్కసారన్న కలిసి మాట్లాడాల్నని షానా ఉందిర.. నువ్వు ఈసారి జరూర్ రావాలె. ను వస్తనంటె నాగ్గూడ జర హుషారు గుంటది’ అని ఆడు ఒక్కతీర్గ చెప్పిండు...

టైమయితుంటె నేను తానం జేసి తెచ్చుకున్న కొత్త జత బట్టలు ఏసుకొని మా అమ్మికి పొయ్యొస్తనని చెప్పి రోడ్డు మీదికి బయల్దేరిన.
టైం సాయంత్రం నాలుగున్నరైంది. రోడ్డు మీదికి ఒక్కొక్కలె చేరుకుంటున్రు. నేను మా సైదులుకు ఫోన్ చేసిన. ‘బట్టలేసుకుంటున్న, రెండు నిమిషాల్ల రోడ్డుమీదుంట’ అన్నడు. రోడ్డు మీదికి వస్తున్నోల్లంత తీరొక్క కొత్త బట్టలేసుకొని పెద్ద పిల్లలు ఎంట రాంగ, చిన్న పిల్లలకు ఏలు అందిచ్చి వస్తున్నరు. ఆడోల్లేమో అందరు రోడ్డు మీదికి చేరుకునె సమయానికొస్తరు.
నేను రోడ్డు మీద యాపచెట్టు కింద దోస్తులతోటి ‘ఖబర్లు’ చెప్పుకుంట నిలబడ్డ. షాన్నాళ్ల సంది కలువని దోస్తులంత కలుస్తుంటె యమ కుషాలుగుంది. నా సుట్టు గుంపైంది. ఒక్కొక్కడు- ‘ఈడు నా కొడుకు’, ‘ఈళ్లు నా పిల్లలు’ అని ములాఖత్ చేస్తుంటె ఆళ్లను పలకరించుకుంట కొత్తగ ఒచ్చి చేరుతున్నోళ్లను నిమ్మలం అడుక్కుంట ఉన్న. షానామంది, ‘పిల్లల్ని గుడ తీస్కరావొద్దా?’ అని అడగబట్టిరి. నాగ్గూడ ‘తీస్కరావల్సుండె’ అనిపించింది. అంతల్నె మా సైదులు రానె ఒచ్చిండు. ‘ఒహో.. దోస్తులిద్దరు షాన్నాల్లకు కల్సిన్రె..’ ‘పదురుకొని ఒచ్చినట్టుందె’, ‘షాన్నాల్లకు ఊరికి కళొచ్చింది’ అని పరాష్కమాడబట్టిన్రు కొందరు. మా సైదులు మంచి కలుపుగోలు మనిషి. ఏ విషయాన్నైన జోకుగా మల్చేసి, ఎసొంటి సందర్భాన్నైన ఉల్లాసంగ మార్చేసి అందర్ని నవ్వించేస్తుంటడు. ఆళ్ల మాటల్ని అందుకొని సైదులు నవ్వులు పూయించబట్టిండు.సరె, మా పలకరింపులు, నవ్వులాటలు, ఖుషీలు అట్ల నడుస్తుండంగనె రోడ్డు నిండ జనాలొచ్చేసిన్రు. ఆళ్లెన్క ఆడోళ్లు గుడ పిల్లప్నూంట బెట్టుకొని కొందరు, సంకనేసుకొని కొందరు, స్నేయితురాండ్లతోని పడచు పొల్లలు... ఓహ్.. మా ఊరి మజ్జెల్నుంచి పోతున్న ఆ రోడ్డంత రంగుల్ రంగుల బట్టలేసుకున్న మనుషులతోని పూల జాతర పొంగుతున్నట్లు కనిపించబట్టింది.

ఊరి ఆ చివరకు అందరు మెల్లగ కదల బట్టిన్రు. అక్కడ డప్పు సప్పుళ్లు మొదలైనయ్. సూస్తె ఇంక జెండా ఎత్తలేదు..జెండా గురించి అనుకోంగనె ఇంకో ముచ్చట యాదికొచ్చింది నాకు. కొన్నేండ్ల కింద ఒకపాలి ఇట్లనె దసరకు ఒచ్చిన. అందరం ఇట్లనె రోడ్డుమీద కల్సినం. ఇటు ఊరందరి జెండా ఎత్తనె లేదు. అంతల్నె అటు చివర గల్లీల్నుంచి కాషాయం జెండా తీసుకొని ‘భారత్ మాతాకీ జై’ అనుకుంట ఒక గుంపు రోడ్డుమీది కొచ్చింది. నా మనసు వికలమై పొయ్యింది. ఆళ్లు ఈ మద్యల్నె ఊర్లె శాఖ పెట్టి బిజెపి జెండా పాతి హల్చల్ చేస్తున్న పోరగాల్లని తెల్సింది. ఈల్లిట్ల తయారుకావటానికి ఈ మద్యల్నె ఊర్లె మకాం పెట్టిన ఒక ఫుల్‌టైమర్ కారణమని చెప్పిన్రు దోస్తులు. నాకు ఇగ జమ్మిచెట్టు కాడికి పోబుద్ది కాలే. మా దోస్తులు పిలుస్తున్న గుడ ఇనకుంట ఇంటికెల్లిపొయ్‌న. నాతోపాటు అయాల మా ఊర్లోని ముస్లింపూవరు గుడ జమ్మికి పోలేదని అటెంక తెల్సింది. గని ఇచివూతమేందంటె తర్వాత ఏడాది ఆ పోరగాల్లు ఆ జెండా తేలేదంట. ఊర్లె అన్ని కులాలోల్లతోపాటు ముస్లింలు, క్రెస్తవులు గుడ జమ్మి కాడికి వస్తుంటరు.. గిట్లాంటి పనులు చెయ్యొద్దని ఆ పోరగాల్లకు కొందరు గట్టిగనె చెప్పివూనని తెల్సింది..!
సరె, జెండా లేషినట్టుంది, డప్పు సప్పుళ్లు ఎక్కువైనయ్. అటు కదిలినమ్. జనం మద్యల్నె లక్ష్మి బాంబులు, పురుకోస బాంబులు పేలుస్తున్రు పోరగాల్లు. చెవులు గిల్లుమంటున్నయ్. పొగలేస్తున్నది. ప్రతిసారి ఒకలిద్దరియన్న బట్టలు నిప్పు మిరుగులు పడి కాలడం మామూలె.

చేతిల పట్టుకొని లచ్చింబాంబుకు నిప్పంటించి సుర్మనంగనె గాల్లకు ఇసిరేయడం.. అది గాల్లో పేలడం.. ఒక్కోసారి జనం మద్యల పడి పేలడం పోరగాల్లకు సరదా.. తిట్టేటోల్లు తిడుతనె ఉంటరు. నవ్వేటోల్లు నౌతనె ఉంటరు. కాల్చెటోల్లు కాలుస్తనె ఉంటరు..యమ ఇంట్రస్టింగ్ సంగతేందంటె- పడుచు ఆడపిల్లలు అప్పుడే ఏసిన లంగాఓనీల్ల, పండగ కాబట్టి కట్టే చీరల్ల బలె దోరదోరగ ఊరిస్తరు. కాకపోతె ఈ మజ్జె సెల్వార్ కమీజ్లొచ్చి జరంత ఉత్సాహం తగ్గించినయ్‌గని.. లేకుంటె మస్తు మజా ఉండేది..అత్తగారిండ్ల నుంచి పండుగకని తల్లిగారిండ్ల కొచ్చిన ఆడపిల్లలు మరీ ముద్దొస్తుంటరు. పెళ్లయ్యి ఏడాది కానోళ్లు అందుల స్పెషల్. ఒక పిల్లనో పిలగాన్నో ఎత్తుకున్నోల్లు మరింత అట్రాక్షన్. ఇంకా ఇంట్రస్టింగ్ థింగేందంటె- పాత ప్రియురాళ్లను కలుసుకుంటానికి, ఆళ్ల ముందు స్టైల్ కొడ్తానికి పోరగాళ్లు పడే తిప్పలు. ఇరవైల్లో ఉన్నోల్లు ఇటు పెళ్లాల కన్ను గప్పి ప్రియురాళ్ల కళ్లల్లో మెరుపులవడం, కలుసుకొని ముద్దు ముచ్చట్లాడడం మరీ సాహస వీరుల కృత్యాలను పోలి ఉంటయ్. ఈ తీరుదే మా సైదులు కత..! 
మొత్తానికి మా సైదులు మస్తు తయారై ఒచ్చిండు. కటింగ్ కొట్టిచ్చి, కలర్ పట్టిచ్చి, పౌడర్ దట్టిచ్చి, కొత్త బట్టలు టక్ చేసుకొని, షూస్ ఏసుకొని ఒచ్చిన సైదులును చూస్తె జరంత పరాష్కమాడాలనిపిచ్చింది. గనీ ఎక్కువగ తయారైన్నా ఏందని ఆడు ఎక్కడ ఫీలైతడోనని ఊకున్న.సరె, జెండా ముందు నడుస్తుండంగ, జెండా ఎంట మా ఊరి సర్పంచు, పెద్ద మనుషులు నడుస్తుండంగ మేమందరం కదిలినం.. పావు కిలోమీటరంత దూరం రోడ్డు మీద పోవాలె. అటెంక ఎడంపక్క మట్టిరోడ్డు మీదికి మల్లాలె. అటు ముప్పావు కిలోమీటరు నడిస్తె మా ఊరి మరో సగం పల్లె వస్తది. మా సైదులుకు అక్కడికి ఎప్పుడు చేరుకుంటమా అని యమ ఆత్రంగ ఉంది గనీ.. అందరు నడవాలె గదా.. డప్పులు.. డ్యాన్సులు.. ఒక్కొక్కడు ఒక్కో తీర్గ డ్యాన్సు చెయ్యబట్టె. మల్ల అందుల మందు కొట్టినోల్ల గోల మరొకటి.. ఆళ్లు ఎగరరు.. ఎగిరేటోల్లను ఎగరనివ్వరు. అదో గమ్మత్తు.. కని బలె మజా వొస్తదిలె.. అంతల్నె నన్నొకడు డ్యాన్సు చెయ్యనీకి గుంజనె గుంజె. నాకు జర సిగ్గేసి పక్కకొచ్చేసిన..

షాన్నాళ్లకు మా ఊరోళ్లందర్ని ఒక్కతాన సూస్కుంట మస్తు ఖుషీగున్న నేను. అడ్డరోడ్డు దాన్క చేరుకున్నం. ఇగ ఆడోళ్లంత అక్కడికె ఆగిపోతరు. ఒకింత హుషారు తగ్గి మట్టిరోడ్డు దారిపడతం అందరం. ఇయాల గుడ అదే జరిగింది. గనీ మా సైదుల్ల మాత్రం హుషాక్కువైంది. ఎందుకంటె నిర్మలది మేమిప్పుడు పొయ్యే పల్లె..మా కన్న ముందు గుంపుల ఆని చిన్నప్పటి క్లాస్మేట్లతోని మాట్లాడుకుంట నడుస్తుండు సైదులు. నేను నా క్లాస్మేట్లు కలిస్తే ఆళ్లతోని మాట్లాడుకుంట నడుస్తున్న. మాట్లాడుతున్న గనీ.. మా సైదులు సంగతె మదిల మెదుల్తున్నది..సైదులు క్లాస్మేట్ నిర్మల. బలె అందంగ ఉండేది. ఆ పిల్లే సైదులంటె పడి సచ్చేది. సైదులుకు గుడ ఇష్టమె గనీ అంతగ బైటపడక పొయ్యేది. కనీ ఊరంత ఈళ్ల ముచ్చట టామ్‌టామయ్యింది. మా ఊర్లె అంటె రోడ్డు మీద ఓకె. కనీ పక్క పల్లెతోనె పరేశాని. సైదులంటె ఆ ఊరి పోరగాల్లకు గొంతుకాడికి కోపం- ‘మా ఊరి పొల్లను, అందుల అంత అందమెన పోరిని పక్క పల్లె వాడు, మల్లందుల కులం గాని కులపోడు ప్రేమించటమా? ఆని సంగతి సూడాలె!’ అని ఆళ్లకు ఒకటె కచ్చ. దసర ఒచ్చిందంటె ఆ ఊర్లెకు మేం చేరంగనె నిర్మల ఎక్కడో ఒక తాన సైదులు కంట పడేది. తన దోస్తుకత్తెల మధ్య అప్సరస లెక్క వెలిగిపోతుండేది. కొట్టొచ్చే రంగుల లంగా ఓనీలో, పొడవైన జడ నిండా పూలతోటి పెద్ద పెద్ద కళ్లు, ఒకింత పొడ అందమైన ముక్కుతోని.. యమ అందంగ కనిపించేది నిర్మల. సైదులు సూపంత నిర్మల మీదనె. ఆ పిల్ల గుడ సైదుల్నె ఎతుక్కుంటుండేది. ఆ కళ్ల భాష ఆళ్లిద్దరికె ఎరుక. ఆ సూపుల కమ్మదనం ఒదల్లేక, ఒదల్లేక ఒదిలి షనా కష్టంగ సైదులు మాతోటి కలిసి జమ్మిచెట్టు కాడికి ఒచ్చేది. మల్ల తిరిగి ఒచ్చేటప్పుడు ఎట్లన్న నిర్మలను కలిసి జమ్మి ఆకు పెట్టడం సైదులుకు పెద్ద సవాలయ్యేది. ఎందుకంటె ఆ పిల్ల కులపోల్లు, మేనోల్లు- సైదులు ఒంటరిగ దొరికితె తన్నుడే అన్నట్లు కాసుకొని ఉండేది. మేం గుడ ‘సైదులు మీద ఎవడన్న చెయ్యేసిండా, ఆని పని పడతం’ అన్నట్లు గుంపుగ సైదులుకు కాపు కాసేది. నిర్మల సైదులును కలుస్తానికి రెడీగుండేది. మొత్తానికి యాణ్నో ఓ కాడ- ఏ కంపచెట్ల సాటుంగనో, ఏ గోడ సాటుంగనో నిర్మలను కలుసుకొనేది సైదులు. ఇష్టంగ ఇద్దరు ముచ్చట్లాడుకునేది. ఆమె చేతుల్ల జమ్మి ఆకు పెట్టి అవకాశముంటే ముద్దో.. కౌగిలో తీసుకొని ఎనక్కొచ్చేటోడు సైదులు. అప్పుడు అందరం కలిసి మా ఊరిదిక్కు కదిలేది.

పక్క పల్లె రానె ఒచ్చింది. మొదటి సంది మా ఊరి నుంచి జెండా తీసుకొని మేం బయపూల్లి పోతం. ఆళ్లు ఎదురుసూస్తుంటరు. మేం చేరంగనె ఆళ్లూ మేం కలిసి ఆ పల్లెకు అటు పక్కనున్న జమ్మి చెట్టు కాడికి పోతం.మా ఊరి జనం కోసం సూషి సూషి మేం పోంగనె ’ఏందే గింతగనం ఆలస్యం జేస్తిరి’ అని అక్కడోల్లు అనబట్టిరి. ‘పారి! పారి! చీకటి పడతది’ అని కొందరు జల్ది జేస్తిరి. మగోల్లు మా అందరిల కలిసి ముందుకెల్తుంటె ఆడోళ్లంత పక్కన నిలబడి మేం దాటినంక మా ఎనక ఊరి పొలిమెర దాంక ఒస్తరు.ఆ ఆడోల్లల్ల నిర్మలను ఎతుక్కుంటుండు సైదులు.. ఆ గుంపుల కనిపించలె. ఒకింత నిరుత్సాహపడ్డట్టుంది.. నేను ఆని పరేశాని కనిపెడతనె ఉన్న. ఆగి ఎవర్ని అడగాల్నో సమజ్గానట్టుంది.. అటు ఇటు ఎత్కులాడిండు జరసేపు. సరె- జమ్మి కాడ్నించి వచ్చేటప్పుడు కలుస్తదిపూమ్మని మనసుకు సర్దిచెప్పుకొన్నట్లున్నది, మాతోపాటు జమ్మిచెట్టు దిక్కు నడిషిండు.డప్పులు.. పటాకులు.. చిన్నపోరల కేరింతలు.. ఓహ్.. అదొక గొప్ప సంబురం..!
‘షమీ షమీయతె’ శ్లోకం సదువుకుంట అందరు జమ్మి చెట్టు సుట్టు తిరుక్కుంట పూజ చేసిన్రు. పూజ అయిపోంగనె ఇగ సూడు- పోటీపడి చెట్టు ఎక్కబట్టిన్రు పోరగాల్లు. నేను సైదులు ఇంకొందరం జర పక్కన నిలబడ్డం. పాలపిట్ట కోసం ఎతుకుతున్రు కొందరు. ఆశ్చర్యంగ ఓ పాలపిట్ట ఒచ్చి జరంత దూరంల ఉన్న సర్కారు కంపచెట్టు మీద వాలనె వాలింది. దసరనాడు పాలపిట్టను సూడ్డం షానా మంచిదని, శుబం కలుగుతదని చెప్తరు. దాంతోని అందరు ఆ పిట్టను సూడబట్టిన్రు. ఒకలికొకలు చెప్పుకొని మరీ సూస్తున్నరు. అంతల ఎవడొ తీట పోరగాడు దాని దిక్కు ఉరికిండు. దాంతోని అది లేషి బుర్రున ఎగిరిపొయింది.జమ్మి చెట్టు నిండ ఎగబాకిన్రు చిన్నాపెద్దా షానామంది. చెట్టు దిగినవాళ్లు జమ్మాకు పెట్టి అలాయి బలాయి తీసుకుంటున్నరు. మా కాడికొచ్చిన సాకలి మారయ్య జమ్మి పెట్టి అలాయి బలాయి తీసుకుంటుంటె అనిపించింది- ముస్లిం సంస్కృతి గొప్పనైన అలాయి బలాయి నేర్పింది వీళ్లందరికి. గుండెకు గుండెను కలిపే అలాయి బలాయి! ఎంత మంచి విషయమిది!

చీకటి పడుతున్నది. పటాకులు కాల్షి ఆ మసకచీకట్ల చెట్టుమీదికి, మనుషుల మీదికి ఇసురుతున్నరు తీట పోరగాల్లు. ఆళ్లను తిట్టిన తిట్టు తిట్టకుండ తిడుతున్నరు బయపడ్డోల్లు. చెట్టు చుట్టు వాతావరణమంత అలాయి బలాయిలతోని నిండిపొయింది.
ఎంత తృప్తి. ఇట్ల ఊరిల ఇంతమంది ఆత్మీయుల మద్య! హాయిగ హుషారుగ మనసుల్ల ఏ కల్మషం లేని ఈ అలాయి బలాయిల మధ్య.. ఓహ్..!కాని ఇదంత కోల్పోయి.. ఆ పట్నం వలస పోయి.. అంతమంది జనంల గుడ ఎవరికీ చెందక, మనకెవరూ చెందక, ఒంటరిగ బతికేయడం ఎంత నరకం! ప్చ్..! రేపు మల్ల ఈళ్లందర్ని ఒదిలేసి ఎల్లిపోవాలె. దసరను ఎంతగనం ప్రేమించేటోల్లం. బతుకుదెరువు కోసం దసరకు ఎంత దూరమెపొయ్‌నం?! ఎంత అనుకున్నా ప్రతి ఏడాది రావడం కుదరదు. కొన్నేళ్లు పోతె అసలే రాలేకపోవచ్చు. అంటె దసర ఒక అసంపూర్తి ప్రేమగా మిగిలిపోనుందా ఈ జిందగీల? మనసంత చేదైపోతున్నట్టు తోచింది..
ఇగ ఎనక్కు మల్లిన్రు అందరు. అప్పటికె కొంతమంది ఊరి దారిపట్టిన్రు. నేను మా సైదులు గుడ ఆత్మీయంగ అలాయి బలాయి తీసుకున్నం. దోస్తులకు, పెద్దమనుషులకు, సర్పంచ్‌కు గుడ ఆకు పెట్టి అలాయిబలాయిచ్చి ఇగ పల్లె దిక్కు నడిషినం. పల్లెలకు ఒచ్చెసరికి చీకటి పడింది. ఎవరికి తెలిసినవారి ఇండ్లల్లకు వాళ్లు పోయి కలిసి వస్తున్నరు. నేను ఆ పల్లె ఆఖర్న పొడుగుపూల చెట్టున్న ఇంటి కాడ చెట్టు అరుగుమీద ఓ ఇద్దరు దోస్తులతోని కలిసి కూసున్న. మా సైదులు నిర్మలను ఎతుక్కుంట ఎనకనె ఉండిపొయ్యిండు. ఆని కోసమె ఎదురుచూస్తున్నం. 
షానా సేపటికి ఆడు ఏలాడుకుంట ఒచ్చిండు.‘ఏమైందిరా?’ అన్న ఆత్రంగ.‘ఏముంది, కలవనట్టుంది’ అని అననె అన్నడు నా ఎంటున్న ఒగ దోస్తు.‘పోదాం’ అన్నడు నీరసంగ సైదులు.కదిలినం. నేను ఆడు జర ముందు నడవబట్టినం. మిగిలిన ఇద్దరు ఎనక రాబట్టిన్రు. తలా నలుగురైదుగురు, ఇద్దరిద్దరు కలిసి మా ఊరి దిక్కు నడుస్తున్నరు మా ఊరోల్లంత. షానామంది అప్పటికే ఊరు చేరుకున్నరు. సప్పుడు లేకుంట నడుస్తున్న సైదులుతోటి ’ఏమైందిరా?!’ అన్న అనునయంగ.

‘నిర్మల ఈసారి రాలేదంటరా..!’ వాడి గొంతులో జీర.నేనేం మాట్లాడలేదు. మల్ల ఆడే- ’వరుసగ మూడేళ్లు ఒచ్చిందంట. నేను రాలేదు గదా.. అదే చెప్పిందట ఆమె దోస్తు జానమ్మతోటి- ‘మల్ల నేను ఒస్తె.. సైదులు రాకపొయ్యేసరికి ఆయన యాదిలతోని సచ్చిపోతున్న. దానికన్న, రాకుంట ఉంటమె మంచిగనిపిస్తుంది జానమ్మా.. అందుకనె ఈసారి రాబుద్ది కాక వస్తలేను’ అన్నదంట.ఈపాలి ఆని గొంతు మొత్తమె పూడుకుపొయింది. నాకేం మాట్లాడాల్నో సమజ్ కాలె..
ఊర్లెకు రానె ఒచ్చినం. ఆల్లు ఈల్లు కలుస్తున్నరు. జమ్మి ఆకు బెట్టి అలాయి బలాయి తీసుకుంటున్నరు. ఈ అలాయి బలాయి మీద ఉంటా ఉంటె నాకు ఇష్టం పెరిగిపోబట్టింది. మా సైదుల్నేమొ షానామంది అంటుకోరు. ఆల్లింటికి గుడ సూదరోప్లూవరు రారు. పెద్ద కులపోల్లయితె మల్లే సూడరనుకో! ఈడు నేను కలిసి అందరిండ్లకు ఎల్తుంటం. నాకు ఫస్టుల సమజ్ గాలె. ఈని పెండ్లిల కట్నం సదివించిన్రు గని సూదరోల్లు సుత దావత్కు రాలె. గిదేంద్రా? అంటె ఆడు నవ్వి ఊకుండు. గింత అన్యాలమా?! అని పర్శానైన. మా ఇంటోల్లు గుడ పొద్దంత ఉన్నరు గని దావత్ టైంకు మాయమైన్రు. సంగతేందని తెల్సుకుంటె, యాటను మైసమ్మకు బలిచ్చివూనంట. నేను సాటుంగ దావత్ల షరీకైన. అది వేరే ఖిస్సా!సైదులింటికి బొయ్‌నం. ఆల్ల అమ్మ నాయ్‌నకు జమ్మి ఆకు బెట్టి కల్సిన. ఆళ్ళమ్మ కాళ్ళు ఆడు మొక్కితె నేను గుడ మొక్కబొయ్‌న. ‘హమ్మో! వద్దు కొడ్కా!’ అని అంతెత్తున్న ఎగిరిపడ్డది. పర్శానైన. ఎందుకట్ల అంటె ‘తప్పయ్యా! మాయి మీరు మొక్కొద్దు!’ అన్నది ఆ తల్లి.

మా యింటికి బొయ్‌నం. మా యింట్ల మా అబ్బాకు, తమ్మునికి జమ్మాకు బెట్టి అలాయి బలాయి తీసుకుండు సైదులు. మా అమ్మీకి, చెల్లెండ్లకు జమ్మాకు బెట్టి ఆళ్ల చేతులను కండ్లకు అద్దుకుండు. అటెంక మా దోస్తులిండ్లకు, ఊర్లె మాకిష్టమెన కొందరిండ్లకు ఎల్లి కల్సి బైటపడ్డం.
అంత బాగనె ఉంది గని సైదుల్ల మునుపటి హుషారు లేదు. మాటిమాటికి పరద్యానంల కెల్లిపోతున్నడు. ఇగ లాబం లేదని ఆన్ని తోల్కొని గౌండ్లోల్ల బిక్షం ఇంటికి పొయ్‌నం. నిజానికైతె పండగ పూట కల్లు దొర్కదు. కని పొద్దున రాంగనె పైసలిచ్చి మా అమ్మీని పంపి చెప్పి పెట్టిన.
బిక్షం- ‘ఎట్లున్నరు దోస్తులిద్దరు?’, ‘ఊర్లె లేకుంట బోతిరి’, ‘మీరున్నప్పటి జమాన వేరు, ఇప్పుడు చీప్‌లిక్కర్ల మీద బడ్డరంత’ అని అదొ ఇదొ మాట్లాడుకుంట ఇంటెన్క యాపచెట్టు కింద రెండు కుర్సీలేసి, రెండు గాజు గిలాసులు అందిచ్చి కల్లు లొట్టి దెచ్చి ఒంపిండు. చెరో గ్లాసు తాగినంక మల్ల గ్లాసులు నింపి లొట్టి పొందిచ్చి పెట్టి, ‘జర మీరే ఒంపుకోరి, పిల్లలొచ్చిన్రు గదా.. నేన్ బోత’ అన్జెప్పి తలుపు దగ్గరికేసుకుంట ఇంట్లకు పొయిండు బిక్షం.
మా తమ్మునికి ఫోన్ చేస్తె ఆడు టిఫిన్ బాక్సు నిండ తలాయించిన ఆవుకూర ముక్కలు తెచ్చిచ్చి పొయిండు. బుసబుస పొంగుతున్న కల్లు.. దట్టమెన కారంతోని చవులూరిస్తున్న ఆవుకూర ముక్కలు.. యమ రమ్‌జుగుంది మా పార్టీ.
నాలుగ్లాసులు లోపల పడ్డంక మొదలయ్యిండు సైదులు. ఆ సమయం కోసమె ఎదురుచూస్తున్న నేను. ఆడి మనసుల మెలిదిర్గుతున్న బాదనంత ఇప్పబట్టిండు. అన్ని నాకు తెల్షిన సంగతులె. అయ్‌న ఊ కొడుతున్న. ఇంకింత తాగినంక సైదులు గొంతుల జీర మొదలైంది. ఇంక జరసేపటికి ఆడిల పేరుకున్న దుఖ్కం బైటికి ఎగదన్నింది. ఇగ ఏడ్సుకుంటనె ఆడు మాట్లాడుతున్నడు. ఆన్ని తన్వితీర ఏడ్వనిస్తెనె మంచిదనుకున్న. ఆడు చెప్తున్నడు- ‘నిర్మల అంటె నాకు పానంరా. అది గూడ నేనంటె పడి సచ్చేది. ఆల్లింట్ల షాన కొట్లాడిందంట. ఆల్లు ఎంతకు ఒప్పుకోలేదంట. ఆళ్ల నాయ్‌న నాల్గు దెబ్బలేషిండంట. ‘మల్ల అదే మాటంటె నిన్ను సంపి మేం సస్తం’ అన్నడంట.
పెండ్లి ఖాయమైనంక ఒచ్చి కలిసిందిర.. ఎటన్న ఎల్లిపోదమని నా కాల్లు చేతులు పట్టుకున్నదిర’ ఆడు ఎక్కెక్కి ఏడ్వబట్టిండు. మల్ల సంబాలించుకొని- ‘మా అమ్మనాయ్‌నకు నేనొక్కన్నె కొడుకునైతి. ఆల్లు తట్టుకోలేరు. మేమెల్లిపోతె ఆళ్ళోల్లు ఊకుంటర? మా యింటిమీద బడతరు. గోల గోల జేస్తరు.. అయన్ని సోంచాయించి వద్దన్న. నిర్మల బోరుబోరున ఏడ్షిందిర. ఆఖరికి ‘చేతగానోనివి ఎందుకు ప్రేమించినవ్?’ అని నిలదీసింది. ‘ఆడపిల్ల ఒచ్చి లేషి పోదామన్న కదుల్తపూవ్వే.. ను మొగోనివేనా?!’ అని బూతులు గుడ తిట్టిందిర... తిట్టుకుంట- ‘అటెంక నువ్వే బాదపడతవ్ సైదా! ఇగ నేను ఎల్లిపోతున్న.. మల్ల కనబడ! నీ ఇష్టం!’ అనుకుంట ఎల్లిపొయిందిర.. మల్ల ఇంతదంక కన్పించలె..’ చిన్నపిలగాని లెక్క ఏడ్వబట్టిండు సైదులు.ఆఖరికి సంబాలించుకొని ఒక మాటన్నడు- ‘అదికాదుర బయ్! మా రెండు కులాలను అంటరానోల్లనే అంటరు గదరా! మా రెండు కులాలు ఉండేది ఊరి బైటనె కదరా..! మరి అందుల గుడ నిర్మలని చేసుకుంటాన్కి నాది పనికిరాని కులమెందుకైందిరా? మాలోల్ల కన్నా మాదిగోల్లం తక్కు ఈ తేడాలు ఇంకెప్పుడు పోతయ్‌రా..???’ ఆడు నిలదీస్తున్నడు. నన్నొక్కన్నె కాదు, మొత్తం వ్యవస్థనె ఆడు నిలదీస్తున్నట్లనిపించింది నాకు...
- స్కైబాబ

Friday 12 October, 2012

ఊహ (కథ)


ఊహ ఊరుకోదు కదా.. తన ఇష్టాలకు తగ్గట్టుగా ఒక బొమ్మ గీసుకుంది. తనలోని అసంతృప్తులకు కారణమైన ఖాళీల నన్నింటినీ పూరించుకుంటూ ఆ బొమ్మను రూపొందించుకుంది. తన కిష్టమొచ్చినన్ని ఒంపులు తిప్పుకుంది. తోచినప్పుడల్లా, ఖాళీ దొరికినప్పుడల్లా ఆ బొమ్మను ఎదుట నిలుపుకొని ఎచ్చోట ఏ కాస్త వంక కనిపించినా దానిని సరిదిద్దుతూ, మెరుగులు పెడుతూ తనకు నచ్చే విధంగా మలుచుకుంది.

కవ్వించే కళ్లను, ఆకర్షణీయమైన మోమును, మనసు కొల్లగొట్టే నవ్వును, స్వేచ్ఛాయుతమైన నడకను, పసందైన భంగిమను బొమ్మలో పోతపోసి దానితో చెట్టాపట్టాలేసుకొని విహరించసాగింది.
అప్పుడప్పుడు ఈ పాడు లోకంతో విసిగినపుడు- ఒంటరితనాన్ని ఆశ్రయించి తన బొమ్మతో మాట్లాడుకునేది ఊహ. బొమ్మ వారించదు కదా.. కాబట్టి తన ఫీలింగ్స్‌ అన్నీ పూసగుచ్చినట్టు చెప్పుకునేది. లోకం శాడిస్టుదనీ.. ఇది తప్పంటుంది- అది ఒప్పంటుంది- ఫలానా పని చేయనే చేయొద్దంటుందనీ.. చుట్టూ గోడలు కడుతుందనీ.. ఇనుప కంచెలు పాతుతుందనీ.. అవన్నీ తనకు ఇష్టం లేకున్నా రాజీపడిపోవలసివస్తోందనీ బొమ్మతో వాపోయేది..
ఇలా ఎంత కాలమో..! ఏళ్లు గడిచిపోయాయి.
అనుకోకుండా తన బొమ్మలో ఉండాల్సిన జీవం తాలూకు ఆనవాళ్లు తారసపడ్డాయి ఊహకు. అతలాకుతలమైంది ఊహ. అన్వేషణ మొదలుపెట్టింది. ఆ జీవం ఎంతకూ ఎదురుపడలేదు. కాని తన వ్యక్తీకరణల ద్వారా మాత్రం తన ఉనికిని వ్యాపింపజేస్తూ పోతున్నది జీవం. ఆ ఆనవాళ్లను పట్టుకొని ఊహ పరుగులు పెట్టింది. ఎలాగైనా పసిగట్టి జీవాన్ని పట్టుకోవాలనుకుంది. ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎక్కడెక్కడో వాకబు చేసింది. జీవంతో పరిచయమున్న తోలుబొమ్మలన్నింటినీ అడిగి చూసింది. ఊహూ.. ఊహకు జీవం తాలూకు ఆధారం దొరకనే లేదు. ఏ తోలుబొమ్మా జీవం ఆచూకీ చెప్పనేలేదు. జీవాన్ని ఊహకు పరిచయం చేయడానికి వారికి జెలసీ అడ్డుపడింది కాబోలు. కాని జీవం సాహిత్యం మాత్రం అనుకోకుండా అచ్చులో కనబడి కలవరపెట్టేది. ఆ రాతల్లోని భావాలు అచ్చం తన బొమ్మకు ఉండాలనుకున్న లక్షణాలతోనే తొణికిసలాడుతుండేవి. తనతోనే మాట్లాడుతున్నట్లుండేవి. తన గురించే రాసినట్లుండేవి. ఇక తట్టుకోలేకపోయింది ఊహ.
మరింత పట్టుదలతో లోకమంతా వాకబు చేసి అడగరాని కొమ్మనల్లా అడిగి చివరికి ఆ జీవం తాలూకు ఒక తీగ ఆధారాన్ని సంపాయించగలిగింది. కనిపించని తీగ అది. కాని తను ఆ తీగ ద్వారా జీవంతో సంభాషించవచ్చు. ఇప్పటికిది చాలు అనుకుంది ఊహ. తొలి ప్రయత్నంగా తరంగాల ద్వారా జీవాన్ని మీటింది. మేను ఝల్లుమన్నది. విద్యుదయస్కాంత శక్తేదో అతలాకుతలం చేసిన భావన. నిభాయించుకొని మెల్లగా పలకరించింది.
ఓహ్‌.. జీవం తొలి పలుకే తనని పూర్తిగా వశపరచుకున్నట్లు తోచింది ఊహకు. సంభాళించుకొని సంభాషణ మొదలుపెట్టింది. జీవం హాయైన నవ్వు, నిశ్చల సముద్రం మధ్యలో ఉవ్వెత్తున లేచిన కెరటంలా అంతెత్తుకు ఎత్తింది ఊహను. ఆ మాటల్లో ఏదో తెలియని ఆకర్షణ. ఆ గొంతు చిరపరిచితమైనదైనట్లు భావన.
కళవళపడిపోయింది ఊహ. ఆ వెన్నెల చల్లదనపు పలుకు, ఆ జలపాతపు సవ్వడి నవ్వు, ఆ ఏ భావానికీ తడుముకోని వాగ్ధాటి, ఆ దేనికీ వెరవని హుందాతనపు కవ్వింపు... అలా ఎన్నెన్ని విశేషణాలతోనో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జీవం తాలూకు ఆకృతిని ఊహించుకోలేక పరిగెత్తుకు తన బొమ్మను చేరుకుంది ఊహ. అన్ని అసంపూర్తులను పూరించుకొని తయారుచేసుకొన్న బొమ్మను ముందుంచుకొని ఆ బొమ్మకు జీవం పోసుకుంటూ సంభాషించసాగింది.
ఇప్పుడు బొమ్మ మాట్లాడడం మొదలుపెట్టింది! కనిపించని తీగ ఆధారంగా బొమ్మ మాట్లాడసాగింది. తను పోతపోసుకున్న బొమ్మ.. తనకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకున్న బొమ్మ- ఇప్పుడు తనతో సజీవంగా సంభాషించసాగింది. ఓహ్‌.. ఎంత అద్భుతం. తన బొమ్మకు జీవం వచ్చింది. ఇక చాలు.. తన వెతుకులాటకు ఫలితం దక్కింది. ఇక ఈ జన్మకు ఈ జీవాన్ని పొందడమే పరమావధి అనుకుంది ఊహ.
అలా కొన్నాళ్లు జీవంతో గొంతు కలుపుతూ మనసు పూర్తిగా ఆర్పించుకుంటూ మైమరచిపోయింది ఊహ. కాని ఆ ఆనందం, ఆరాటం, మైమరపు ఎన్నాళ్లు? 
బొమ్మ త్వరలోనే ప్రతికూల సంకేతాలివ్వడం మొదలుపెట్టింది.. ఎదురుతిరగడం మొదలుపెట్టింది. మెదలకుండా ఉండడానికి తనేమైనా మైనపు ముద్దనా? అని ప్రశ్నించింది. తనను నీ ఫ్రేములో బంధించడానికి చూడొద్దంది. నీ కిష్టమైన షోకేసులో అలంకరించాలని ఆశ పడొద్దంది. ఏ స్పందనలూ లేకుండా ఉండడానికి నేను కేవలం నీవు తయారుచేసుకొన్న బొమ్మను కాను. సర్వ శక్తులతో ఉరకలెత్తుతున్న జీవాన్ని అంది.
ఊహ హతాశురాలైంది. తను తయారుచేసుకున్న బొమ్మకు జీవం వస్తే అది తను అనుకున్నట్లు నడుచుకుంటుందనుకుంది. కాని జీవం తన ఆధీనంలోకి రాకపోగా తనకు దక్కకపోగా తనను పెద్దగా పట్టించుకోకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది ఊహ. 
తన స్నేహితురాలైన ఓ తోలుబొమ్మతో వాపోయింది ఊహ- 
'నా బొమ్మ నా మాట వినట్లేదే!' అని.
తోలుబొమ్మంది- 'నువ్వు రంగులు సరైన పాళ్లలో వేసినట్లు లేదే.'
'అదసలు ఏ రంగులకూ లొంగదు. ఏ ముద్రల్నీ మొయ్యదు.'
'అంతగా నవనీతమా నీ బొమ్మ!'
'ఎంతగా అంటే- ఆ సూర్యమ్మ స్వయం ప్రకాశం, ఆ చంద్రమ్మ మనసు చల్లదనం, ఈ నేలమ్మ అనంతమైన ఓరిమి కలగలసిన నవనీతమే!' అంది ఊహ తన్మయంగా..
'మరెందుకు నీ మాట వినడం లేదో దానినే అడుగు' అంది తోలుబొమ్మ. సమయం సందర్భం చూసి అదే అడిగింది ఊహ. 
'నువ్వు సృష్టించుకున్న బొమ్మలో నన్ను జీవంగా ఒంపుకొని మాట్లాడుతున్నా నంటున్నావు. సరె, మరి జీవంతో సమానంగానైనా నువ్వు ఉరకలెత్తాలి కదా.. కాని అది నీ వల్ల కాదు. కనీసం జీవాన్ని అనుసరించు. అంతే తప్ప దాని రెక్కలు కూడా కత్తిరించాలని చూడకు' అంది జీవం.
'లేదు, నాకు నా బొమ్మంటే చాలా ఇష్టం. అందులో జీవమైన నువ్వంటే అనంతమైన ఇష్టం. నాకు నువ్వు కావాలి. నాకు జీవం కావాలి' అంది ఊహ ఉద్వేగంగా.
'ఊహ స్థాయిని దాటి జీవాన్ని పుణికిపుచ్చుకున్నాను నేను. చట్రాల్ని విదుల్చుకొని ముందుకెళ్తున్నాను. నీకు అది చేతకాక అన్నింటికీ ఒదిగి కేవలం ఊహగా మిగిలిపోతున్నావు. మరింత ముడుచుకుపోయి ఓ బొమ్మను సృష్టించుకొని కాలం గడుపుతున్నావు. నువ్వు భయస్తురాలివి. చాదస్తురాలివి కూడా!' అంది జీవం.
కోపం ముంచుకొచ్చింది ఊహకు. అయినా తమాయించుకొని- 'మరేం చేయమంటావు నన్ను? నాకూ నీలాగా అవ్వాలని ఉంది' అంది ఊహ.
'నువ్వూ నాలాగా కావాలంటే నిన్ను నువ్వు దాటాలి. అంటే ఊహను దాటాలి. బొమ్మను చెరిపెయ్యాలి. లోకం గీసిన చట్రాల్ని చిత్తు చేయాలి. నువ్వు నువ్వుగా మనగలగాలి. నిత్య చలనంగా సాగాలి. అప్పుడే నీవు జీవంగా గుబాళించగలుగుతావు' నిశ్చయంగా చెప్పింది జీవం.
'ఆ ప్రయత్నమేదో చేస్తాను. ఈలోగా నువ్వు నా నుంచి దూరమవుతావేమోనని భయంగా ఉంది. నువ్వు నాకు కావాలి. నిన్ను పొందాలంటే ఏం చేయాలో చెప్పు.. ప్లీజ్‌!' బతిమిలాడింది ఊహ.
'నన్ను పొందాలంటే నువ్వు ముందు జీవానివి కావాల్సిందే. నీ చుట్టూ అలంకరించడానికి అవకాశమిచ్చిన సకల ఊచల్ని తెంచుకొని స్వేచ్ఛా జీవానివి కావాలి. అప్పుడు మాత్రమే నేను నీకు అందుతాను' అంది జీవం స్థిరంగా. ఆ గొంతులోని స్థిత ప్రజ్ఞతకు ముగ్ధురాలైంది ఊహ.
అది తనకు సాధ్యమేనా అంటూ తరచి చూసుకుంది ఊహ. చూస్తే- అంచెలంచెలుగా తన చుట్టూ పోతుకుపోయిన అన్నన్ని ఊచల్ని తెంచుకోవడం తన వల్ల అవుతుందా? అనే సందేహం ఆవరించింది. దాంతో దుఃఖం ముంచుకొచ్చింది.
నిస్సహాయంగా బావురుమన్నది ఊహ. 
బావురుమంటూనే ఉన్నది. 
లోకం ముసి ముసిగా నవ్వుకుంది. 
నవ్వుకుంటూనే ఉంది!                                                                                                                                                  

('ఊహ'కు)

('పాలపిట్ట' అక్టోబర్ సంచికలో అచ్చయ్యింది)

Thursday 4 October, 2012

మరింత పట్టుదల పెంచిన మార్చ్‌


తెలంగాణ సాధన పట్ల మరింత పట్టుదల పెరిగింది
సీమాంధ్ర ప్రభుత్వంపై - పోలీసు అధికారులపై అసహ్యం కలిగింది
తెలంగాణ మార్చ్‌ సందర్భంగా అటు ప్రభుత్వం, పోలీసులు టెన్షన్‌ పడుతుండగా ఇటు తెలంగాణ వాదులము సమరోత్సాహంతో సన్నద్ధం కావడం తెలిసిందే. సెప్టెంబర్‌ 30న 3 గం.ల నుండి అనుమతి దొరికింది అని తెలిసినా 29 రాత్రి నుంచే తెలంగాణ జిల్లాల నుంచి ప్రజలు హైదరాబాద్‌ చేరుకోవడం మొదలైంది. 30 నాడు ఉదయం నుంచే నెక్లెస్‌ రోడ్‌కి చేరుకోడానికి ప్రజలు తండోప తండాలుగా కదిలి రావడం కనిపించింది. కాని పోలీసులు మాత్రం అతి క్రూరంగా ప్రవర్తించడం మొదలైంది. కేవలం టాంక్‌బండ్‌ ఆ చివర నుండి సంజీవయ్య పార్క్‌ రోడ్‌ నుంచి మాత్రమే మార్చ్‌కు వెళ్లాలని ఒక హుకుం జారీ చేస్తూ మిగతా దారులన్నీ మూసేశారు. ఖైరతాబాద్‌ వైపునుంచి వచ్చేవారు కేవలం ఆ చౌరస్తాలో ఉన్న ఫ్లైఓవర్‌ దాటనిస్తే నెక్లెస్‌ రోడ్‌లోకి వెళ్లిపోవచ్చు. కాని అక్కడ ఆ ఫ్లైఓవర్‌కు బారికేడ్లు అడ్డం పెట్టి కాపలా ఉన్న పోలీసులు చుట్టు తిరిగి సంజీవయ్య పార్క్‌ వైపు నుంచి వెళ్లమని సలహా లివ్వడం మొదలుపెట్టారు. నిజానికి అక్కడి నుంచి చుట్టు తిరిగి రావాలంటే ఆరేడు కిలోమీటర్లు వెళ్లాలి. వాహనాలు లోనికి వెళ్లనివ్వరని కాలి నడకన వచ్చేవారిని అన్ని కిలోమీటర్లు నడవమని పురమాయించడం హాస్యాస్పదంగా కనిపించింది. అటు సెక్రటేరియట్‌ వద్దనుంచి వెళదామని వచ్చినవారిని సైతం నిలువరించి, లాఠీచార్జ్‌ చేసి, బాష్పవాయువు ప్రయోగించి నానా యాతన పెట్టారు పోలీసులు. ఇటు గల్లీల్లోంచి ఐమాక్స్‌ థియేటర్‌ ముందుకు చేరుకున్న 100 మందిని నిలువరించిన పోలీసులు వెనక్కి వెళ్లి తిరిగిపొమ్మంటున్నారు. కేవలం పోలీసులు దారి ఇచ్చి ఒక బారికేడ్‌ పక్కకు జరిపితే మేము వెళ్లిపోతామని మళ్లీ మూసేసుకొమ్మని అక్కడ చేరిన వారు వేడుకున్నారు. అంతా కాలినడకన వచ్చిన వారంతా అన్నేసి కిలోమీటర్లు తిరిగి నడిచి వెళ్లడం భారమైన విషయం. ఎంత బతిమిలాడినా పోలీసులు వినలేదు. దాంతో తెలంగాణవాదులు 'జై తెలంగాణ' నినాదాలు చేయడం మొదలుపెట్టారు. వదిలేస్తాం రమ్మని ఒక పోలీసు అధికారి పిలిచాడు. దాంతో అంతా గుంపుగా వచ్చారు. లేదు, లేదు వెళ్లనిచ్చేది లేదు అని ఇతర పోలీసు అధికారులన్నారు. దాంతో పోలీసులు సీరియస్‌ అయ్యారు. దాంతో తెలంగాణ వాదులు కొందరు బైఠాయించారు, మిగతావాళ్లు కూడా బైఠాయించబోతుండగానే ఒక్కసారిగా లాఠీచార్జ్‌ మొదలుపెట్టారు. విచక్షణారహితంగా కొట్టడం మొదలుపెట్టారు. దాంతో పడుతూ లేస్తూ పరుగులు పెట్టిన తెలంగాణవాదులు అనేక దెబ్బలు పడ్డారు. చెప్పులు పోగొట్టుకున్నారు. ఆ గుంపులోనే ఉన్న నేను, సంగిశెట్టి శ్రీనివాస్‌ కూడా రెండ్రెండుసార్లు కింద పడ్డాం. నా చెప్పులు పోయాయి. అరచేయి కట్‌ అయి రక్తం కారసాగింది. తొడమీద బలమైన లాఠీ దెబ్బపడింది. విపరీతమైన నొప్పిపెట్టసాగింది. అందరం ఖైరతాబాద్‌ గల్లీల్లో పడి వెనక్కి వచ్చాం. మిత్రులు పసునూరి రవీందర్‌, గోగు శ్యామల, పిల్లలమర్రి రాములు సార్ తదితరులు సెక్రటేరియట్‌ దగ్గర ఎప్పుడు వెళ్లనిస్తారా అని తచ్చాడుతున్నారు. నేను, సంగిశెట్టి శ్రీనివాస్‌ కాళ్లీడ్చుకుంటూ ద్వారకా హోటల్‌ దాకా వచ్చి ఓ అరుగు మీద కూలబడ్డాం. ఊడుగుల వేణు ఒక పెద్ద గుంపులో కలిసి ఖైరతాబాద్‌ చౌరస్తాకి చేరుకున్నాడు. అక్కడ పోలీసులు వెళ్లనివ్వకపోవడంతో ఆ చౌరస్తాలో తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో బైఠాయించారు. నినాదాలు హోరెత్తుతున్నాయి. కొందరు ఫుట్‌వే బ్రిడ్జ్‌ ఎక్కి దానికి కట్టి ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌, దానం నాగేందర్‌ బ్యానర్లు చించివేశారు. హోరెక్కువవుతున్నది.
మరో మిత్రుడు నందకిశోర్‌ మెహదీపట్నం దారిలో వచ్చి మాసాబ్‌ట్యాంక్‌లోనే బస్‌ దింపేయడంతో అక్కడినుంచి నడిచివస్తూ లక్డీకాపూల్‌లో ఉన్న మమ్మల్ని కలవడానికి రానివ్వకపోవడంతో ఖైరతాబాద్‌ వైపుగా నడుస్తున్న గుంపుతో పాటు వెళ్లిపోయాడు. 
చివరికి 3 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్‌లో నలువైపుల నుంచి జామ్‌ ఐపోవడంతో అప్పుడు ఫ్లైఓవర్‌ దారి విడిచారు పోలీసులు. దాంతో ఖైరతాబాద్‌ నుంచి పెద్దఎత్తున నినాదాలు చేస్తూ జనం నెక్లెస్‌ రోడ్‌వైపు దారితీశారు. అక్కడ వదిలేశారని తెలియడంతో మేము, మాతో చేరిన పసునూరి, గాదె వెంకటేష్‌ తదితరులం కలిసి కదిలాం. ఐమాక్స్‌ వైపు కూడా వెళ్లనిస్తుండడంతో అక్కడి నుంచి నెక్లెస్‌ రోడ్‌లోకి వెళ్లాం. మాపై లాఠీచార్జ్‌ జరిగిన స్థలం దాటుతుంటే అక్కడ ఎన్నో రకాల చెప్పులు చిందరవందరగా పడి ఉండడం కనిపించింది.
నెక్లెస్‌రోడ్‌లోకి వెళ్తుంటే రకరకాల బ్యానర్లతో, జెండాలతో గుంపులు గుంపులుగా జనం వస్తూ కనిపించారు. ఐమాక్స్‌ నుంచి ఎంత నడిచినా, ఎంతసేపు నడిచినా మీటింగ్‌ స్పాట్‌ రావడం లేదు. అంత దూరం ఉంది ఆ ప్లేస్‌. నడిచీ నడిచీ అలసిపోయాం. దారి పొడవునా పోలీసువాళ్లను జనమంతా బూతులు తిట్టడం వినిపించింది.
సాయంత్రమవుతోంది. పోలీసు వాహనాలు జనంలోంచే అటూ ఇటూ తిరుగుతున్నాయి. రెండు వాహనాలు తగలబడుతున్నాయి. చిత్రమేమంటే పోలీసులు విధించిన గడువు కాకముందే మాటిమాటికి టియర్‌ గ్యాస్‌ పేల్చుతుండడం!! దాంతో ఆ పొగకు కళ్లు మండడం, ఊపిరాడకపోవడంతో జనమందరం చాలా ఇబ్బంది పడ్డాం. పోలీసులు టియర్‌ గ్యాస్‌ పేల్చినప్పుడల్లా జనం భయంతో అటూ ఇటూ పరిగెత్తడం కనిపించింది. స్టేజి ఎదురుగా ఉన్నవాళ్లు నిలకడగా ఉన్నా అటువైపు, ఇటువైపు ఉన్న జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ పోయారు పోలీసులు. 7 గంటల దాకా కవాతు సమయమున్నా ఆరున్నర గంటలకే వాటర్‌ కేనన్లు ప్రయోగించడం ఆశ్చర్యం కలిగించింది.. మొత్తంగా సభా సమయం కాకముందే ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి చెల్లాచెదరు చేసి వెళ్లిపోయేలా చేయాలని పోలీసుల ప్లాన్‌ కావొచ్చు. తొక్కిసలాట జరిగి కవాతుకు చెడ్డ పేరు రావాలని కూడా వాళ్ళు ప్లాన్ చేసినట్టు సమజవుతూనే ఉంది.
ఇదిలా ఉంటే కవాతుకు మూడు రోజుల ముందు నుంచే జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రయాణీకులను నానా ఇబ్బందుల పాలు చేశారు పోలీసులు. కవాతు రోజు మాత్రం హైదరాబాద్‌ చుట్టూ దాదాపు 25 కిలోమీటర్ల అవతలే వాహనాలు నిలిపేశారు. నల్గొండ వైపు నుంచి వచ్చిన వాహనాలను రామోజీ ఫిలిం సిటి కాన్నే నిలిపెశారట.. అక్కడ దిగిన జనం 25 కిలోమీటర్లు ఎలా నడిచి వస్తారు? ఆ రకంగా కవాతుకు జనం తగ్గడానికి శాయాశక్తుల పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ అంత జనం కవాతుకు తరలిరావడం విశేషం.
ఇక మేము (నేను, సంగిశెట్టి శ్రీనివాస్‌, పసునూరి రవీందర్‌, ఆయన తమ్ముడు, గాదె వెంకటేష్‌, ఊడుగుల వేణు) అలసిపోయి.. టియర్‌ గ్యాస్‌ వల్ల కళ్లు మండుతుండడంతో, దగ్గు వస్తుండడంతో బేగంపేట ఏరియాలో రైలు పట్టాలు దాటి గల్లీల్లోకి వచ్చాం. ఈ లోపు మా గాదె వెంకటేష్‌ కవితా సంకలనం 'పొలి' ఆ జనంలోనే ఆవిష్కరణ చేసుకున్నాం. ఆ తర్వాత నడుస్తూ నడుస్తూ మెయిన్‌ రోడ్డు మీదికొచ్చి చూస్తే బేగంపేట ఫ్లైఓవర్‌ దగ్గర తేలాము. అక్కడి నుంచి సిటీలోకి వెళ్దామని చూస్తే- అక్కడ పంజాగుట్ట వైపుగా రోడ్‌ బ్లాక్‌ చేసి అడ్డంగా నిలబడ్డ పోలీసులు లాఠీలు చూపుతూ 'మార్చ్‌కి వచ్చారు కదా.. మార్చ్‌వైపే వెళ్లండి' అని నిర్దాక్షిణ్యంగా మళ్లీ గల్లీలోకి తరుమడం మొదలుపెట్టారు. మాకేం అర్థం కాలేదు. ఇదేమి విచిత్రం. ఇళ్లకు వెళ్లిపోతామన్నా వినడం లేదు. దాంతో ఏం చేయాలో అర్థం కాక ఫ్లైఓవర్‌ మీంచి వస్తున్న సిటీ బస్సులను రోడ్డు మధ్యలోనే ఆపి ఎక్కి మైత్రీవనం వైపు ప్రయాణించవలసివచ్చింది. మాతోపాటు బస్సులు ఎక్కిన తెలంగాణవాదులు పోలీసులను బూతులు తిట్టడం వినిపించింది. బస్సుల్లో తెలంగాణ నినాదాలు చేస్తూ ప్రభుత్వాన్ని, తెలంగాణ మంత్రులను నినాదాల్లో తిట్టడం వినిపించింది. మధ్యలో దిగి ఆటోలు మాట్లాడుకొని మేము బంజారాహిల్స్‌ మీంచి చుట్టూ తిరిగి ఇండ్లకు చేరాల్సి వచ్చింది. రాగానే టీవీలు పెట్టుకొని వర్షంలో తడుస్తున్న కవాతును నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాం.

Thursday 20 September, 2012

చలో తెలంగాణ మార్చ్


జంగ్

ధన దాహం
కులం మదం
అణగార్చిన ఆకాంక్షల్ని
అణచే ఉంచాలనే వ్యూహాలు
చాలు.. చాలిక!
అవమానాలు మనకు
ఆధిపత్యాలు వాళ్ళకా...??

బలి కావడాలు
బలిదానాలు.. చాలు!
బలి కోరడమే మిగిలిందిక

కణజాలం కదులుతున్నది
అణువణువు అంటుకుంటున్నది
విడి శక్తులన్ని మోపుకొస్తున్నయ్
బిగిస్తున్న పిడికిళ్ళు
పిగులుతున్న నరాలు
మరుగుతున్న నెత్తురు
ఉగ్గబట్టిన ఉక్రోశం
ఉప్పెనలా ఎగుస్తున్నది

వీరులను మర్లేసుకొని...
ఓపిగ్గా అడుగేస్తున్న ఉద్యమం
జంగ్ సైరన్ మోగించింది

కన్నీటి చారికలు
ఉప్పు కత్తులై లేస్తాయ్
ఎండిన పేగుల్ని
మా చేతులు ఉరితాళ్ళలా
విసురుతాయ్
మండే గుండెల్
మందు పాతరలై పేల్తాయ్

కవాతుకు కదం తొక్కుతున్నం
తలకు కఫన్ కట్టుకొని
కదులుతున్నం
విజయమో.. వీరస్వర్గమో...

వీర అంశ ఉన్న దేహం
ఎన్ని ముళ్ళ కంచెలు చుట్టినా
ఎన్ని తుపాకులు ఎక్కుపెట్టినా
విప్లవిస్తూనే ఉంటుంది
లక్ష్యం చేరేదాక!


published in Namaste Telangana Daily 19.09.2012

Thursday 30 August, 2012

Skybaaba_Adhoore_hyd

Skybaaba, K.Srinivas, BaaRahamathulla, Kolakaluri Inak, Olga, Vinodini

Adhoore Cover

Skybaaba Short Story Book Cover

Skybaaba_Adhoore

'అధురే' ముస్లిం కథల పుస్తకాన్ని ప్రఖ్యాత సినీ దర్శకులు బి.నరసింగ రావు మా అమ్మకు తొలి కాపీ అందజేస్తూ.. పక్కన డా.చెరుకు సుధాకర్, భూపాల్, నిసార్

Sunday 26 August, 2012

సహచరం


కొత్తగానో ఒంటిగానో
బయలెల్తే
ఎక్కడ విడిది చేస్తే
అదే ఇల్లు
ఎటు ప్రయాణిస్తుంటే
అటే గమ్యం

గాడిని తప్పుకొని
గడులు గిరులు దాటుకెళ్తుంటే
అదో ఖుషీ
అసలు 'గోల్' అనే ఒకదాన్ని
నాశనం చేస్తే
అంతా మైదానమేరా బై !

      *
దేహ ఖండా లేకమైంతర్వాత
అగ్గి పుట్టడమే కాదు
ఘనీభవించడమూ ఉంటుంది

జీవితం
సహచరమనే పరచేతిలో
పగ్గమై నలిగిపోతుంది

ఒకరి ఆధీనంలోకి
హద్దులోకి నడవడం
నాలో నదులు నదులుగా
ప్రవహిస్తున్న చైతన్యాన్ని
ఉప్పు సముద్రంలో కలపడమే !

వద్దు
ఈ గుంజలొద్దు గుంజాటనలొద్దు
ఈ పలుపుతాళ్లొద్దు గుదిబండలొద్దు
బందీ కావడం నా చేత కాదు
చేతన కాదు

మనుషుల్ని తడుముతూ
వాళ్ల పరవళ్లనూ
కన్నీళ్లనూ
తోడ్కొని
పాయలు పాయలుగా విడిపోతా...

Friday 10 August, 2012

వింగ్స్ (poem)


లోపల- ఏ అలారం మోగుతుందో
టంచనుగా లోపలి కన్ను విచ్చుకుంటుంది
నా కుంచెకు అందిన బొమ్మ చకచకా రూపుదిద్దుకుంటూ..
పక్కింటి పచ్చపచ్చని లంగావోనీ
మనసు వాకిలి ఊడుస్తూ..
ఎంతకూ అడగక
అసలెంతకూ నాలో మంచివాడు తగలబడిపోక..
గింజుకొనీ గిల్లుకొనీ
అటు తిరిగి పడుకుంటాను
పక్కలో ప్రత్యక్షమై
గుండీలో గుండెలో విప్పుతూంటే
అల్లకల్లోలమై సుడితిరుగుతుంటాను
నన్నెక్కడికో నడిపించుకుపోయి
నా చేయి పట్టుకుని
అవతలికి దూకేస్తుంది
ఎక్కడికో ఇంకెక్కడికో పడిపోతూ..
లేదు లేదు
రివ్వున దూసుకెళ్తూ..
బట్టలూ ఆచ్ఛాదనలన్నీ
లోకం అరుపులూ గుసగుసలన్నీ
ఎగిరిపోతున్నాయి గాల్లోకి..
దూసుకుపోతూన్నాం..
నేనూ, తప్పిపోయిన మేక పిల్లా
లేదు, నా చిన్న నాటి స్నేహితుడూ నేనూ
అహ–, నేనూ నన్ను వెంటాడే దెయ్యమూ
కిళుక్కున నవ్వుతూ మాజీ ప్రేయసి
దూసుకెళ్తూ ఎళ్తూ ఉన్నాం
ఇంకా అడుగు అందనే లేదు..

అంతలోనే రెక్కలు మొలుచుకు వచ్చాయ్!
తడిమి చూసుకున్నాను, ఆశ్చర్యంగా
అవి నేను
ఎక్కడో పోగొట్టుకున్నవే..!

Tuesday 24 July, 2012

ఆంధ్రప్రభలో 'అధూరే'

(హారతి వాగీశ్ రాసిన పెద్ద వ్యాసం లోంచి కొంత భాగమే ఇది. 23.7.2012 ఆంధ్రప్రభ)

Sunday 17 June, 2012

సూఫీ దేవుడు (A Poem On My 'ABBAAJAAN')



అబ్బాజాన్ నవ్వుతున్నడు
చిన్న పిలగాని లెక్క
చిటికెన వేలందించి
నాతో తప్పటడుగులు వేయించిన అబ్బా
ఇయాల నా చెయ్యి పట్టుకొని
అడుగేస్తానికే తడబడుతుండు

పక్షవాతపు ఒళ్ళు తూలినప్పుడల్లా
నవ్వుతున్నడు అబ్బాజాన్
పసి పిలగాని లెక్క
     *          *
నిండైన గడ్డం - టోపీ పెట్టి
తెల్లని లాల్చీ - లుంగీ కట్టి
కదిలొస్తుంటే
అచ్చం ఆ సూఫీ దేవుడే ... ... !

పీర్ల ముందూ నువ్వే
కందూర్ల ముందూ నువ్వే
పుంజునో పోతునో హలాల్ చెయ్యాలన్నా
ఫాతెహా లియ్యాలన్నా నువ్వే
తేలు కరిసినా పురుగు ముట్టినా
నీ మంత్రమే కావాలె
పసి కందులకు నీ అంత్రమే కట్టాలె
ఏ ఇంట్లో ఏ ఆపదొచ్చినా - నొప్పొచ్చినా
గుర్తొచ్చే మొదటి దేవుడా !
నీ మాట చాలు - నీ ఆభయమే 'మేలు' !

సుక్క పొడవక ముందే
ఎన్ని ఇండ్లల్లో పలికేదో - నీ పేరు
'మదారు సాబు కాడికి తోల్క పోవాలె '
మదారు సాబును పిల్సుక రావాలె '
మాల మాదిగలూ సూదర్ల బారు !
          *
చేతులెత్తి నువ్వు దువా చేస్తే
ఊరందరికీ కొండంత అండనిపించేదే..
మరి మన ఇల్లెందుకు అబ్బాజాన్
పడావు పడ్డది

దువా చదివి నువ్వు జుబా చేస్తే
ఆ ఇంటిల్లాదులకూ కందూరు పండుగయ్యేదే..
మరి మన ఇంటోళ్ళ కెందుకు అబ్బాజాన్
ఉపాసముండని రోజు లేకుంటయ్యింది

మనకు చేలేందుకు లెవ్వో - చెల్క లెందుకు లెవ్వో
పొల మెందుకు లేదో - తల మెందుకు లేదో
చేతిలో ఆరె ఎందుకు లేదో
ఇంటి ముందు సారె ఎందుకు లేదో
ఇంట్లో మగ్గం ఎందుకు లేదో
ఏనాడూ చింత చెయ్యవైతివి అబ్బా
రిజర్వేషన్ మాటెత్తితే
సర్కారు బిచ్చం మనకెందుకురా అంటివి

గొంతెత్తి పాడేటోనివి - నిర్వేదంగా..
'యే దునియా యే మహెఫిల్
మెరే కామ్ కీ నహీ మెరే కామ్ కీ నహీ..'
          *
చేతులెత్తి నువ్వు దువా చేస్తుంటే
భూగోళమే  మెల్లమెల్లగా చిన్నదై
నీ కాళ్ళ కింద చేరి చిన్నబొయ్యేది

ఊరందరి నోట్లో నాలుకైన నువ్వు
ఇంటి పరేశాన్లకు బైటివాడివైతివి

'భద్రత' తెలియని నిరంది
సొంతానికీ.. కుటుంబానికీ..
అంతా బేగం మీద వోదిలేసే బేచింత !

నువ్వే అదృష్టవంతుడివేమో అబ్బా
అందరిలా ఏదో ఇంకేదో సంపాయించాలనే
యావేదీ లేకుండా బేఫికర్ గా బతికినవ్
ఎవరేమనుకుంటే నీకేంది
అది నీ తత్వమో - 'నసల్ ' నైజమో

మాక్కూడా నీలాగే  బతకాలని ఉంది
జర  గా  ఉపాయం చెప్పరాదే !
     *            *
అబ్బాజాన్ నవ్వుతున్నడు
నిర్వేదంగా...

అబ్బాజాన్ నవ్వుతనే ఉన్నడు
మారని మమ్మల్ని చూసో...
మారిన లోకాన్ని చూసో...
                                        (HAPPY FATHER'S DAY to all)

Saturday 2 June, 2012

బేచారె (ఈ వారం కథ-AndraJyothi)





కూరగాయలు కోస్తున్నది జుబెదా. కండ్ల ఎంట అతని యాద్‌లు (జ్ఞాపకాలు) పటపట రాలుతున్నయ్! అతను యాదికొచ్చినప్పుడల్లా కండ్ల నిండ నీల్లు నిండడం.. ఇంకిపోవడం మామూలె. కని ఇయాల కన్నీల్లు ఆగుతలెవ్. ఎవరినన్న పట్టుకొని బోరున ఏడ్వాలని ఉన్నది. కని ఎవరికి చెప్పుకోగలదు- తను మది నిండ ప్రేమించిన మునీర్‌ని వొదులుకొని జీవచ్ఛవంలా బతుకుతున్నదని.. అతని యాదుల్లోనే ప్రతి రోజు తెల్లారుతుందని.. ప్రతి దినం అతని ముచ్చట్లె గుర్తొచ్చి రాత్రవుతుందని.. జీవితాన్ని ఒకరి ప్రేమ ఇంత గనం ప్రభావితం చేస్తుందా? ఐదేండ్ల యాదులే జిందగీ అంతా ఇంత గనం ఎంటాడతయా? ఈ ప్రశ్నలు ఎప్పటికీ జవాబ్‌లు దొరకని సవాల్‌లే తనకు...


ఆడుకుంటానికి పొయ్‌న పిల్లలు ఇంట్లకొస్తున్న సప్పుడయ్యేసరికి కండ్లు తుడుసుకుంది జుబెదా.
పిల్లలొచ్చి అదొ ఇదొ మాట్లాడిస్తున్నరు. పరద్యానంగ జవాబ్‌లిస్తున్నది జుబెదా. మనసు నిండా మునీర్ రూపమె. అతని హాయైన నవ్వు. అతని గుండెల మీద సేద తీరిన చల్లదనం.. గంటలు.. రోజులు.. యేండ్లు మాట్లాడినా తీరని ముచ్చట్లు... ఒక జన్మకు సరిపోంగ ఎక్కువై పొంగుతున్న యాద్‌లు...

ఎందుకు వదులుకుంది మునీర్‌ని.. తన ప్రాణం కన్న ఎక్కువగ ప్రేమించిన మునీర్‌ని.. అతను లేకుంటె బతుకే లేదనుకున్న తనేనా అతన్ని వొదులుకొని కొన్నేండ్ల తర్వాత మరొకర్ని చేసుకొని ఇద్దరు పిల్లల్ని కని ఇలా బతికేసుకుంట- మాటిమాటికి అతని యాదుల్లోకి ఒరుగుతూ లేస్తూ.. యాంత్రికంగా ఇలా బతికేస్తూ... తమ కలయిక ఎంత అద్భుతంగా ఉండేది. ఎంత తన్మయం పొందేది తను. ఎంతగా మళ్లీ మళ్లీ కావాలనిపించేది. ఆ విషయంలోనూ తాము ఒకరి కోసం ఒకరం పుట్టామేమో అనిపించేది. కాని ఇప్పుడు- దేహాన్ని అలా మొద్దులా వొదిలేసి- ఏ స్పందనలూ పొందకుండా, బైటికి ప్రకటించకుండా, తన దేహం పొందాల్సినది పొందిందా లేదా పట్టించుకోకుండానే పక్కకు వొరిగిపోవడం- అట్లట్లనే పిల్లలిద్దరు పుట్టేస్తిరి. ఇక వాళ్ల కోసమే బతికేస్తుందా? అంతే కదా!

15 ఏళ్ల తర్వాత ఇవాళ అనుకోకుంట మునీర్ ఫోన్! ఆ గొంతు వినేసరికి గుండె కొన్ని క్షణాలు ఆగిపొయ్యింది. గొంతు అస్సలు పెగల్లేదు.. ఫోన్ ఎత్తంగనె హలో అన్నది కాబట్టి అతను "హలో.. నేను మునీర్‌ని. బాగున్నవా జుబెదా?'' అన్నడు. తనకు మాట రాలె.
తను "జుబెదా! జుబెదా!'' అని మల్ల మల్ల్ల పిలుస్తున్నడు, "మాట్లాడు జుబెదా! నా మీద కోపమా!'' అంటున్నడు.
కష్టంగ కొంచెం దగ్గింది.
"ఏమన్న ప్రాబ్లమా?! మళ్లీ మాట్లాడనా?'' అన్నడు.
ఎక్కడ పెట్టేస్తడోనని గాభర పడిపోయి 'లేదు లేదు.. మాట్లాడు' అనగలిగింది. గొంతు పూడుకుపొయ్యి దుఖ్కం పొంగుకొస్తున్నది. అతను మాట్లాడుతున్నడు. ఆ గొంతు వింటుంటే గుండె నరాల నెవరో ఒక్కొక్కదాన్నె తెంపేస్తున్న బాధ. వింటోంది. వింటోంది. ఇంకా వినాలనిపిస్తోంది ఆ గొంతు.. ఎక్కడో పోగొట్టుకున్న తన మరో గొంతుక అది..!
"నువ్వేం మాట్లాడవేంది జుబెదా!? ఏమన్న మాట్లాడు..'' అంటున్నడు.
గొంతు పెగలడం లేదు. ఏడుపొచ్చేస్తున్నది అందామనుకుంది. కని తనకే ఎందుకింతగ ఏడుపొస్తున్నది.. అతనెందుకు దుఖ్కపడకుంటనె మాట్లాడేస్తున్నడు? అనే బింకం పొడుచుకొచ్చింది.

"చెప్పు మునీర్! వింటున్న... ఇన్నాళ్లకు గుర్తొచ్చిన్నా??'' అన్నది కొంచెం కూడదీసుకొని. అప్పటికీ చివరి మాటల్లోంచి దుఖ్కం తొంగి చూసింది.
"ఎక్కడ! నువ్వే నాకు అందకుంట, నేను మాట్లాడ్తానికి ఏ ఆధారం ఇవ్వకుంట గడుపుతున్నవు కదా- మళ్లీ నన్నంటున్నవా?'' అతని నిలతీత.
తను ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగ అతని గురించి తెలుసుకుంటనె ఉంది.
షాదీ చేసుకుని ఎల్లిపొయ్‌నంక తన గురించి తెలుసుకుంటానికి అతనె ఏ ప్రయత్నం చేసినట్లు కనిపించలె..
"జుబెదా! మాట్లాడవేంది? ఎట్ల ఉన్నవు?'' అడుగుతున్నడు.
"నేను బాగనె ఉన్నా..'' జుబెదా గొంతు వణికింది. "నా నెంబర్ ఎవరిచ్చిన్రు?!'' అన్నది మెల్లగ.
"సునంద ఇచ్చింది. నిన్న బస్టాండ్‌ల కలిసింది. నీ గురించి అడిగితె నువ్వు ఇక్కడె ఉంటున్నవన్నది. నెంబర్ ఇమ్మంటె కొంచెం ఎనకాముందాడింది. 'వాళ్లాయన ఆఫీస్ టైమింగ్స్‌లో చెయ్యండి. జాగ్రత్త!' అన్నది. అందుకె నిన్నట్నుంచి ఉగ్గబట్టుకొని ఇయాల చేస్తున్న. అవునూ.. జాబ్ ఎందుకు వొదిలేసినవ్ జుబెదా?'' అన్నడు మునీర్. "ఆయన కిష్టం లేదు''

"అదేంటి? ఇష్టం లేదని ఒదిలేస్తవా? సమ్జాయించకపొయ్‌నవా?''
"కొందరు వినరు..! సరెగని.. ఎక్కడ ఉంటున్నవ్?''
"హైద్రాబాద్‌ల...''
"నల్గొండకు వస్తలేవా?''
"చాలా రోజులాయె రాక.. అమ్మీ అబ్బాలను అక్కడికె తీస్కెళ్లిన.. తమ్ముడొక్కడె ఇక్కడ ఉంటడు. నిన్న ఒక సర్టిఫికెట్ కోసం వచ్చిన. రేపు ఈవినింగ్‌కి ఎల్లిపోవాలె. రేపు నిన్ను కలవాలని ఉంది జుబెదా.. నిన్ను చూడాలి. మీ ఆయన ఆఫీసుకు ఎల్లినంక బైటికి వస్తవా? ఒక్కసారి నిన్ను కలవాలని ఉంది...''
"చూద్దాం...''
"ప్లీజ్ జుబెదా..!''
"చూద్దామన్న కదా...''
"ఒక్కసారి నిన్ను చూడాలి జుబెదా ప్లీజ్''
"ఓ.కె... కలుద్దాం''
"షుక్రియా జుబెదా..!''
"................''
"నేను ఎక్కడ వెయిట్ చెయ్యను? ఆఁ..! రాజీవ్ పార్క్! అది బెటర్.. 11.30కి అక్కడికొచ్చేస్తా. ఓ.కే.నా..?''
"సరె...''
"ఉంట మరి''
"సరె...''
ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ఫోన్ అట్లనె పట్టుకొని బోరున ఏడ్చింది జుబెదా.. 'ఎంత ఈజీగా మాట్లాడేస్తున్నడు.. ఇన్నాళ్లకు మాట్లాడుకుంట గుడ.. తనెందుకు అట్లా మాట్లాడలేకపొయ్యింది? మగాళ్లే అంతనా?! ఆడాళ్లే జల్ది మర్చిపోతరంటరు.. తనెందుకు అస్సలు మర్చిపోలేకపొయ్యింది? ఆడోళ్లు బైటికి చెప్పుకోరు.. మగోళ్లు చెప్పుకుంటరు.. అంతే తేడా! ఏదేమైనా.. తను మాత్రం తన బతుకును ఇట్ల గోస పెట్టుకుంది.. అతన్ని మర్చిపోలేకపొయింది.. మర్చిపోలేదు గూడా.. ఆడవాల్లు తమను అర్పించుకున్న వారితోనే జీవితం పంచుకోవాలను కుంటరేమో.. మగవాళ్లు మాత్రం అన్నీ పొందాక మరొక అమ్మాయి కోసం తయారైపోతరు.. మునీర్ కూడా అట్లనే చేసిండా?! ఏమో..'

సరె, రేపు కలవాలె.. ఇన్నేండ్ల తర్వాత మునీర్‌ని చూడబోతున్నది. తన మునీర్.. ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా తను తనవాడే!
అతన్ని కలవాలె. అతని ఒళ్లో పండుకొని తనివితీరా ఏడ్వాలె.. ఎందుకు తన కోసం ఆగకుండా పెండ్లి చేసుకొని ఎల్లిపొయిండో నిలదియ్యాలె. అదే తనయితే చేసుకోకుంట ఉండకపొయ్యేదా?
నిజానికి అదొక చిత్రమైన సమస్య. అతనేమో- తన తమ్ముడు పెళ్లికి తొందరపడుతున్నడు కాబట్టి పెండ్లి చేసుకోవలసిన పరిస్తితి. తనేమో ఏడాది క్రితమే నాయన చనిపోయి, ఒక చెల్లె, తమ్ముడు చదువుకుంటున్నరు కాబట్టి అంత జల్ది చేసుకోలేని పరిస్తితి.
అడిగిండు- "ఇంట్ల వొత్తిడి ఎక్కువైంది జుబెదా! మనం షాదీ చేసుకుందాం'' అని.
"చెల్లెకు తమ్మునికి నేనే ఆదారం. నేనిప్పుడే చేసుకోలేను కదా మునీర్!'' అని తను.
"మరెట్ల?'' అన్నడు.

"ఏముంది, మీ తమ్ముణ్ణి చేసుకోనీ. మనం తర్వాత చేసుకుందాం'' అన్నది తను.
"మా ఇంట్ల అట్ల ఒప్పుకోరు'' అన్నడు.
"నీ యిష్టం'' అన్నది తను బింకంగ.
కోపంగ ఎల్లిపొయిండు.
ఎక్కడికి పోతడులే.. అనుకుంది.
రెండో రోజు మల్ల కలిసి చెప్పిండు- "ఇంట్ల పెద్ద గొడవైంది జుబెదా. ఆగడం కుదరదు'' అన్నడు. "మా అమ్మీ, అబ్బా చాలా సెన్సిటివ్. వాళ్లను ఇంతకన్నా ఎక్కువ బాధ పెట్టలేను'' అన్నడు.
"నేను మాత్రం మా అమ్మీని బాధ పెట్టాలంటవా?'' అన్నది తను.
మళ్లా కోపంగ ఎల్లిపొయిండు.
మూడో రోజు తెగేసి చెప్పిండు- "ఆగడం నాతోని కాదు. నువ్వు కాదంటే మనం ఇక ఇంతే'' అన్నడు.
తన కళ్లల్ల నీళ్లు చిమ్మినయ్. దగ్గరికొచ్చి ఓదార్చబొయిండు. ఇసిరి కొట్టింది. కోపంతో ఎల్లిపొయిండు.
అంతే.. ఇక కలవలేదు..!
ఐదేళ్లు మునీర్‌ని పోగొట్టుకున్న మనాదిల్నే కాలం గడిపేసింది. బక్కగై పొయింది. కాని చెల్లెను, తమ్మున్ని మాత్రం ఒక ఆదరువుకు తెచ్చింది. చెల్లె జాబ్‌ల చేరింది. ఆ వెంటనె అనుకోకుంట తనకో సంబంధం కుదిరింది. మౌనంగ చేసేసు కుంది. తన తర్వాత చెల్లె పెండ్లి గూడ కావాల్సి ఉందన్నదొక్కటె కారణం..!
"పప్పా ఆగయ్ మమ్మీ!'' అని పిలగాడు అరిచేసరికి దుఖ్కపు ధార తెగింది జుబెదాకు.

***

రెండో రోజు 11 గంటలకె రాజీవ్ పార్క్ చేరుకుండు మునీర్. జుబెదాను చూడాలన్న ఆత్రం అతన్ని నిలవనీయడం లేదు. రాత్రంత నిద్రెక్కడిది! పార్క్‌లకు పొయ్యి ఒక పక్కగ కొద్దిసేపు నిలబడ్డడు. మనసంత జుబెదా రూపమె..
నిజంగ- ఎంత గనం ప్రేమిం చిండు జుబెదాను. తనను అట్లా వొదిలేయాల్సి లేకుండె. తప్పు చేసిండు తను.. అంత ఈజీగా ఎట్లా వొదులుకోగలిగిండు అసలు? బహుశా అప్పటికె తనను ఐదేళ్లుగా అన్ని రకాలుగ పొంది ఉండడం కారణమా? కావొచ్చేమో..! షాదీ పేరుతో మరొక అమ్మాయిని పొందవచ్చన్న మగ స్వార్థమా?? అది చూచాయగ అర్థమైపోలేదా తనకు? సమజయ్యే నటించిండా?? ఆ సమయంలో వెంటనె జుబెదా పెండ్లి చేసుకోలేదని తెలిసి ఉండి.. అమ్మీ అబ్బాల వంక తోడు తెచ్చుకొని, కోపం నటించి వేరే పెండ్లి చేసేసుకున్నట్లె గదా! అదే నిజం గదా..! ఎంత స్వార్థం తనది. ఎంతగ ఇష్టపడేది జుబెదా తనను. అంత ఇష్టాన్ని ఎలా వొదులుకున్నడు తను? ఛత్... అయినా వొదులుకున్న ఖుషీ ఎన్నాళ్లుండింది లే..! కొన్నాళ్లకే ప్రతి మలుపులో జుబెదా గుర్తుకు రాబట్టింది.. మనసును మెలిపెట్టి చంపెయ్యబట్టింది... కానీ.. జుబెదాను కలవ డానికి మొహం చెల్లలేదు.. అబిమానం ఏదో అడ్డు పడ్డది. అన్ని విషయాల్లోనూ తామిద్దరికి భలే కలిసేది. ఒకే ఇష్టంగ ఉండేది. అవన్నీ వొదులుకున్నడు తను. అన్యాయం చేసిండు జుబెదాకు. తేరుకునేసరికి అంతా ఐపొయింది! అస్సలు ఎవ్వరి మాట వినని భార్యతోని, ఇద్దరు పిల్లలతోని జీవితం బండబారిపొయ్యింది. ఒక సుఖం లేదు.. ఒక సంతృప్తి లేదు!
పార్క్ లోపల ఒక చెట్టు నీడ చూసుకొని గడ్డిలో కూలబడ్డడు మునీర్.

టైం 12 గంటలు కావొస్తుంది.
తనంటే చచ్చేంత ఇష్టం జుబెదాకి. తనలెక్కనె ఎంత ఆత్రపడు తుంటదో తనను చూడాలని..
పొద్దున్నె లేషి గడ్డం చేసుకొని మీసాలల్ల తెల్ల ఎంటుకలు కట్ చేసుకొని పౌడరు ఏసుకొని మంచి జత టక్ చేసుకొని వచ్చిండు తను. తన అందం ఏమంత తగ్గలేదనిపించింది.. జుబెదా ఎట్లా తయారవుతుందో చూడాలె.. తను మొదటి నుంచి కూడ సింపుల్ అండ్ స్మార్ట్.. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కదా.. ఎట్ల తయారైందో చూడాలె..
ఒకటె ఆత్రంగ ఉంది మునీర్‌కు. మల్ల మల్ల టైం చూసు కుంటుండు..
ఇప్పట్నుంచి నెలకొక్కసారన్న నల్గొండ వొచ్చి జుబెదాను చూసి ఎల్లాలె. జుబెదా మీది ప్రేమ ఏమాత్రం తగ్గలేదు తనకు. తనకు కూడ అంతే ఉంటుంది. తన కన్నా ఎక్కువే ఉంటుంది. నిన్న ఫోన్‌లో మాట్లాడుతుంటె రెండుసార్లు తన గొంతు పూడుకుపొయ్యింది. ఇప్పట్నుంచైనా తనను కలుస్తు ఉండాలె. అయ్యిందేదో అయ్యింది... మల్ల టైం చూసుకుండు మునీర్- 12.30.
ఫోన్ చేస్తే..!

వస్తుందిలే.. ఏదో కొంచెం లేట్ అయి ఉంటుంది. డిస్టర్బ్ చేస్తే బాగుండదు. అయినా తనైనా ఫోన్ చెయ్యొచ్చు కదా...
ఈ పార్క్‌కి ఎన్నోసార్లు వచ్చినం అప్పుడు. ఎక్కువగ తన రూంకె తీసుకెళ్లేటోడు జుబెదాను. జుబెదా రాంగనె రూంమేట్ మోహన్ బైటికెళ్లిపొయ్యేటోడు. దాంతో తను ఊరుకోలేక జుబెదాను అల్లుకుపొయ్యేటోడు. మొదట్లో ఎంత గనమో వారించేది. కాని తను వినేటోడు కాదు. తర్వాత్తర్వాత వారించడం మానేసింది. అలా ఐదేళ్లల్ల ఎన్నిసార్లు కలిసినమో లెక్కేలేదు. ఓహ్.. తనతో అనుభవం అద్భుతం. అంతటి అద్భుతాన్ని చేజేతులా వొదులుకున్నడు తను. ఛత్! తర్వాత తనను తనే ఎన్నిసార్లో నిందించుకున్నడు. క్యా ఫాయిదా? పెసర చేలో పోగొట్టుకొని కూరటికెలో ఎతుక్కుంటె ఏం లాభం!
మళ్లా టైం చూసుకుండు మునీర్. ఒంటి గంట!
ఇక ఉండలేకపొయ్యిండు.
ఫోన్ తీసి కలిపిండు. రింగవు తోంది. ఒకటి.. రెండు.. మూడు రింగ్స్. ఎత్తింది జుబెదా.
"హలో'' అన్నది.
"హలో జుబెదా! ఎక్కడిదాంక వొచ్చినవ్? ఇంత లేటేంది?'' అన్నడు మునీర్.
"లేదు మునీర్! నేను... నేను - వస్త లేను..'' అన్నది జుబెదా!
షాకయ్యిండు మునీర్-
"ఏం.. ఎందుకని?!?''
"...చెప్తాను...''
"వస్తలేనని 11 గంటలకే చెప్పొచ్చు గదా?'' అన్నడు కొద్దిగ చికాగ్గా.
"నిన్నంతా కలుద్దామనే అను కున్న. రాత్రంత ఒకటే ఆలోచన. తెల్లారగట్ల ఒక నిర్ణయం తీసుకున్నంక గని మనసు నెమ్మదించలేదు.. ఆ సంఘర్షణలోంచే రావొద్దని నిర్ణయించు కున్న మునీర్.''
"ఏఁ... ఎందుకు?''
"ఎందుకంటె... అదంతె!''
"చెప్పు జుబెదా! ఎందుకు నన్ను కలవొద్దనుకున్నవ్?''

"ఏం లేదు మునీర్! నేను నిన్ను అమితంగా ప్రేమించిన. అనుదినం నీ యాదుల్లోనే గడుపుతున్న. లెక్కలేనన్నిసార్లు ఏడ్చుకున్న. ఇంత దుఖ్కంలో గూడ- 15 ఏళ్ల క్రితం మన ప్రేమ రోజుల్ని అట్లనె నా జ్ఞాపకాల్లో ఆస్వాదిస్తున్న. ఊహల్లోనైనా అప్పటి హుషారు కొనసాగనీ.. ఇప్పుడు నిన్ను కలిసి వాటినన్నింటినీ... ఆ అద్భుతమైన జ్ఞాపకాల సంపదను పోగొట్టుకోలేను.. ఒకప్పటి నా మునీర్‌ని అలాగే నా జ్ఞాపకాల్లో పొదువుకొని ఉండనీ నన్ను! నిన్నిప్పుడు కలిసి- నా మునీర్ కాని నిన్నిప్పుడు కలిసి- నాకే సొంతమైన మునీర్‌ని చెరిపేసుకోలేను..! పైగా నీ నోటినుంచి గనక 'తెలిసే నిన్ను వదిలేసుకున్న' ననే మాట వస్తే, విని తట్టుకోలేను.. సారీ మునీర్..! ఉంటాను.. బై..'' గొంతు పూడుకుపోతుండంగ ఫోన్ కట్ చేసింది జుబెదా!
ఫోన్ అట్లనె చెవి దగ్గరే ఉండిపొయ్యింది మునీర్‌కు. తానేం విన్నడో కాసేపటిదాకా సమజ్ కాలె. మెల్లగ సమజవుతున్నకొద్దీ కళ్లల్ల నుంచి నీల్లు ఉబికి రావడం మొదలయ్యింది..
ఎంతో సేపటికి తేరుకున్నడు.. అప్పుడు అనిపించింది-
తనకు ఈ శాస్తి జరగాల్సిందే! 
                                                                                                          * స్కైబాబ

Saturday 12 May, 2012

మా తుజే సలామ్!



ఈమె మా అమ్మ!
మేము ఐదుగురం పిల్లలం తనకు.
ఆ మొఖం లోని జీవం అంతా
మెరుపు.. ఆనందం అంతా 
మాకు ధారా పోసి పోసీ 
అలా మిగిలిపోయింది..
ఇప్పటికీ మా పరేషాన్ లే ఆమెకు
ఇప్పటికీ ఒక్కో బిడ్డ కష్టాలను తలచుకుంటూ
నిద్ర పట్టని రాత్రులను గడుపుతుంటుంది..
ఏం చేయగలిగాను నేను,
ఆమె సంతోషానికి ?
ప్చ్.. ఏమీ లేదు...!
కొన్ని కవితా పాదాలు మాత్రం మిగుల్చుకున్నా
కొన్ని కవితల్లో...
''తల్లి పాదాల వద్ద స్వర్గం ఉందంటారు'
మా అమ్మీ పాదాలకై వంగిన ప్రతీసారీ
చెమరిన నా చూపు
ఆమె పాదాల పగుళ్ళలో చిక్కి
గిల గిల లాడుతుంది''
      ౨
ఉర్సు లో రోల్డుగోల్డు హారం కొన్నది అమ్మీ
అబ్బా మొఖం చిన్నబోయింది 
      ౩
అమ్మీ చిరుగుల దుపట్టా
రాత్రి ఆకాశం 
     ౪
పొద్దున్నే అద్దంలో మొఖం చుసుకోవాలనేది అమ్మీ
ఇప్పుడు ఏ ముక్కలో చూసుకోను?
      ౫
కన్నీటి దారాల్తో జీవన వస్త్రానికి మాసికలేస్తూ
తరాల చీకటి కమ్మేసిన గోషా లో 
పాలిపోయిన చంద్రశిలా దేహంతో
అనుక్షణం
'బిస్మిల్లా ఇర్రహ్మాన్ నిర్రహీమ్' అనే కదులుతుంది అమ్మీజాన్

మొహంపై వేలాడుతున్న నైరాశ్యాన్ని
'వజూ' నీళ్ళతో పుక్కిలించి
తలనిండా చిరుగుల 'దుపట్టా' కప్పుకొని
నమాజ్ చదువుతున్నపుడు...

మెరుపు వెలిసిన అమ్మీ దోసిలిలో
రాలిన కన్నీటి తడిపై
ఏ దేవుడూ సాక్షాత్కరించడు
ఒక అపనమ్మకాల బొమికల గూడు ప్రతిబింబిస్తుంది

అస్తమయం వైపుకు మోకరిల్లి ప్రార్ధిస్తూ
మా జిందగీల్లో సుర్యోదయమౌతున్దనుకుంటుంది అమ్మీ

మాకోసం 'దువా' చేసి చేసి
అమ్మీ గొంతు తడారిపోతుందే తప్ప...
ముందు కూర్చున్న నీడ విస్తరించి
కటిక రాత్రై పరచుకుంటుందే తప్ప...
....... ......... ......... ......... .......!

Monday 19 March, 2012

ఇన్‌సైడర్‌ తీసిన క్లోజప్‌

(ఇవాల్టి 'సూర్య' సాహిత్య పేజి లో..)

ముస్లిం జీవనదృశ్యాల్ని మాటలతో చిత్రించిన కథలు అధూరె. అధూరె అనే ఉర్దూ పదానికి అసంపూర్ణమైన అని, పూర్తికాని అని అర్థం. ఇందులోని కథలు నిజంగా ముగింపు చేయకుండా సగంలో ఆపినట్లు కనిపిస్తాయి. తర్వాతి విషయాన్ని పాఠకునికి వదిలి పెడతాయి. కాని రచయిత తను చెప్పదలచుకున్న విషయం మాత్రం ముగుస్తుంది. కథని ఆపడంలో మంచి కళాత్మకతనే కాదు, పరిణతినీ స్కైబాబ ప్రదర్శిస్తాడు.

Adhoore-Mukhchitramకథా రచనలో తెలుగులో ఒక కొత్త తరంగం వచ్చింది. అస్తిత్వ వాద కథల్లో కూడా ఇది నవ తరంగం. అదే స్కైబాబ అధూరె కథా సంకలనం. తెలుగు ముస్లింల వ్యధార్త జీవన యథార్థ చిత్రాలను కళాత్మకంగా చిత్రించిన కథలివి. ఒక అత్యంత నిపుణుడైన సినిమాటోగ్రాఫర్‌ కళాత్మకంగా చిత్రించిన దృశ్య కళాఖండం అనిపించేలా ముస్లిం జీవనదృశ్యాల్ని మాటలతో చిత్రించిన కథలు అధూరె. అధూరె అనే ఉర్దూ పదానికి అసంపూర్ణమైన అని, పూర్తికాని అని అర్థం. ఇందులోని కథలు నిజంగా ముగింపు చేయకుండా సగంలో ఆపినట్లు కనిపిస్తాయి. తర్వాతి విషయాన్ని పాఠకునికి వదిలి పెడతాయి. కాని రచయిత తను చెప్పదలచుకున్న విషయం మాత్రం ముగుస్తుంది. కథని ఆపడంలో మంచి కళాత్మకతనే కాదు, పరిణతినీ సై్కబాబా ప్రదర్శిస్తాడు. 

ఈ రచయిత సామాజిక నేపథ్యాన్ని సంభావించి తర్వాతనే ఈ కథల్ని చూడాలి. స్కైబాబ అంటే ఎస్‌.కె. యూసుఫ్‌ బాబా. ఎస్‌.కె. అనే ఇంగ్లీషు అక్షరాలు తన పేరుకు ముందు రావడంతో ఎస్‌కెవై ‘ స్కై’ అని చిత్రంగా మార్చుకొని స్కైబాబ అనే పేర రచనలు చేస్తున్న యూసుఫ్‌ బాబా నల్లగొండ జిల్లాకు చెందిన తెలుగు ముస్లిం, కవి, రచయిత. గడచిన దశాబ్దంగా ఆయన కవితలు, కథలు రాస్తూ తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడయ్యాడు. అటు మంచి తెలుగు సాహిత్యాన్ని ప్రచురించడంలోనూ మంచి కృషి చేస్తున్నాడు. అంతే కాదు, ముస్లిం వాద సాహిత్యం అనే దాన్ని తెలుగులో అస్తిత్వ సాహిత్యాలలో ఒక పాయగా తీసుకొని వచ్చి దానికి ప్రత్యేకమైన గుర్తింపు సాధించడంలో కృషి చేసిన తొలి సాహిత్యకారుడు. గడచిన దశాబ్దంలో సై్కబాబా చేసిన సాహిత్యకృషి వల్లనే నేడు తెలుగులో ముస్లిం సాహిత్యం అనే ప్రత్యేక వింగడింపు ఏర్పడడానికి మార్గం సుగమం అయింది. 

అఫ్సర్‌, యాకూబ్‌ కవిత్వంలో ముస్లిం వాద కవిత్వం కూడా ఉంది. వారు దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే రాస్తున్నారు. కాని ఆ కవులు మరింత విస్తృత సాహిత్య నేపథ్యంలో రాస్తున్నారు. అంతే కాదు, ముస్లిం వర్గం నుండి తెలుగు సాహిత్యంలో విశేషించి ఆధునిక వచన కవిత్వాన్ని రాసిన కవులు ఇంతకు ముందే వజీర్‌ రెహ్మాన్‌, ఇస్మాయిల్‌, స్మైల్‌, దేవిప్రియ, సుగమ్‌ బాబు వంటి వారు ఇంకా కొందరున్నారు. అంతకు ముందు కూడా సంప్రదాయ కవిత్వం రాసిన ముస్లింలు తెలుగులో ఉన్నారు. కాని స్కైబాబా చేసిన రచనలు అతను చేస్తూ వచ్చిన నేపథ్య కృషి ‘ముస్లిం వాద సాహిత్యం’ అనే ప్రత్యేకమైన వింగడింపుకు బాగా తోడ్పడింది. తర్వాత వచ్చే ఆధునిక తెలుగు సాహిత్యచరిత్ర రచనలో ఈ వింగడింపులో ఈ విషయం స్పష్టంగా ఉండవలసి వస్తుంది. 

కథా రచనలో ముఖ్యంగా భాషని ఎన్నుకోవడంలో ఇంతకు ముందు రచయితలు చాలా ప్రయోగాలు చేశారు. ఉత్తరాంధ్ర మాండలికంలో, రాయలసీమ మాండలికంలో, తెలంగాణ మాండలికంలో, గోదావరి జిల్లాల యాసలో కథలు, నవలలు వచ్చాయి. కానీ ఒక ప్రత్యేక సామాజిక వర్గం మాట్లాడే భాషలో కథలు రావడం స్కైబాబాతోనే ప్రారంభం అయిందని చెప్పవచ్చు. ఇది డయలెక్ట్‌ కాదు, భాషాశాస్త్రంలో దీన్ని ఇడయలెక్ట్‌ అంటారు. అంటే వర్గమాండలికం అని తెలుగులో అనాలి. ఇలా వర్గమాండలికంలో ఎవరైనా ఇంతకు ముందు కథలు రాశారేమో కాని, ముస్లిం వర్గమాండలిక భాషకు మంచి సాహిత్య స్థితిని సాహిత్య గౌరవాన్ని తెచ్చిన గౌరవం కీర్తి స్కైబాబాకు దక్కవలసి ఉంది. 

ఈ కథల్లో ముస్లింలు మాట్లాడేది కృతక భాష అని అనడం అవగాహనా లోపమే. వారిదైన సజీవ సామాజిక సందర్భంలో మాట్లాడే సజీవ భాష అది. నల్లగొండ జిల్లాలో తెలుగు సమాజంలో జీవించే ముస్లింలు బయటికి వచ్చి వ్యవహరించే సజీవమైన తెలుగు భాష ఒక వర్గమాండలికంగా రూపొందింది. ఈ సహజ భాషలోనే స్కై బాబా తన కథల్ని రాశాడు. మాండలికమే కాదు, నేడు వర్గమాండలిక భాష అస్తిత్వ సాహిత్యంలో ప్రముఖపాత్ర పోషిస్తూ ఉంది. కారణం ఆ రచయితలు ఆ కులాల సామాజిక నేపథ్యాన్ని ప్రతిభావంతంగా పోషించే పనిచేయడమే. స్కైబాబా కథల్లోని ఈ భాషా నేపథ్యం, ఈ కథలకున్న సామాజిక నేపథ్యం ఈ కథల్ని తెలుగు సాహిత్యంలో ఒక కొత్త కెరటంగా నిలుపుతున్నాయి. ఇవి ఒక ప్రత్యేక స్రోతస్సుగా రూపొందాయి. 

స్కైబాబా చిత్రించిన పాత్రలు జీవం ఉట్టిపడుతూ రోజూ మన మధ్య కనిపించే ముస్లిం వ్యక్తులుగా మనకు తారసపడే వారై కనిపిస్తారు. మనకు తెలిసిన ముస్లింల జీవితాల్లో కూడా మనకు తెలియని కష్టాలు, కన్నీళ్ళగురించి విలపించి వివరిస్తాయి ఈ కథలు. ఇందులోని పాత్రలు సుల్తానా, జానీబేగం, సల్మా, జరీనా, ఫాతిమా, షాహీన్‌, పర్వీన్‌, షాజీదా, సైదాబేగం, ముంతాజ్‌ బేగం పాత్రలు తెలుగు సాహిత్యంలో చాలాకాలం నిలబడి ఉంటాయి. కారణం కవి నిజ జీవితంలోనికి తొంగిచూచిన తీరు, తాను దర్శించిన జీవన వాస్తవాల్ని ఉన్నదున్నట్లు మాత్రమే కాకుండా దాన్నొక అద్భుత కళగా మలచిన తీరు! ఇదే సన్నపోగారు శిల్పంపని. ఇవి ఈ కథల్ని కలం కాలం గుర్తుండేలా చేస్తాయి. ఇందులో పాత్రలు చదివినవారి మనస్సులో ముద్రవేసుకోవడం ఇందులో ఒక గుణంగా కనిపిస్తుంది. 

ఆంధ్రప్రదేశ్‌ ఉగ్రవాదానికి చాలాసార్లు మూల్యం చెల్లించింది. గోకుల్‌ ఛాట్‌ లో, లుంబినీ పార్కులో, మక్కామసీద్‌లో మన రాష్ట్రాని కి తగిలిన గాయాలు హిందూ ముస్లిం ప్రజల మధ్య తీవ్రమైన అగాథాన్ని మిగి ల్చాయి. ఏ నేరం తెలియని అమాయ కులైన లక్షలాది ముస్లింల దైనందిన జీవితం కూడా దీనివల్ల ఛిద్రం అయింది. ఒక్కడి తప్పుకు వేల మంది మూల్యం చెల్లించుకోవలసి వస్తూఉంది. ఈ జీవన స్థితిని ‘దావా’ అనే కథలో అత్యంత హృద్యంగా చిత్రించాడు స్కైబాబా. ముం తాజ్‌ బేగం ఒక అమాయకుడైన యువ కుడైన ముస్లింకు తల్లి. పోలీసులు ఉగ్రవాద చర్యలపై అనుమానంతో అరెస్టు చేసిన కొందరు ముస్లిం యువకుల్లో ఒక యువకుని తల్లి. 

ఏ పాపం ఎరుగని తన కొడుకుని విడిపించుకోవడానికి ఏ పలుకుబడీ లేని ఒక బీద ముస్లిం తల్లి చేసిన హృదయవిదారకమైన ప్రయత్నాన్ని ఇందులో ప్రతిభావంతంగా చిత్రించాడు రచయిత. ఈ స్థితిని రచయితే కథ మధ్యలో ఒక వాక్యంలో ఇలా చెప్తాడు ‘గూట్లోంచి కిందబడ్డ తన పిల్ల కోసం ఒకటే అరుసుకుంట అటు ఇటు చక్కర్లు కొడుతున్నది కాకి’ అని. ముంతాజ్‌ బేగం ఎంతో ప్రయత్నంచేసీ పోలీసుల కాళ్ళ వేళ్ళా బడీ తన కొడుకుని విడిపించుకోలేక పోయింది. కొద్ది రోజుల తర్వాత పోలీస్‌ స్టేషన్‌ నుండి తన కొడుకును ఎక్కడికో మరొక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకుపోయారని తెలుసుకుంటుంది ఆ తల్లి. ఆ తల్లి గుండె పగిలి చక్కరొచ్చినట్లు అక్కడనే కూలబడిపోయింది- అది తెలిసి. 

ఇక్కడ కథ చివరి వాక్యంగా రచయిత ‘కాకిపిల్లను కుక్కలు ఎక్కడికో ఎత్తుకు పోయినయ్‌’ అని రాసి కథను ఆపాడు. ఇక్కడున్న సింబాలిజం గురించి కథాకళ గురించి ప్రత్యేకించి చెప్పవలసినపని లేదు. ఇది పాఠకుల హృదయాల్ని ప్రత్యక్షంగా తాకుతుంది. ఈ కథలకు పాఠకులు ఎవరు అని అనుకున్నప్పుడు కొన్ని ప్రశ్నలు మనసును వేధిస్తాయి. ఇందులో ఉర్దూ పదాల సమ్మేళనం చాలా విస్తారంగా ఉంది. తెలుగు పాఠకులు అందరూ చదవాలనే ఉద్దేశం రచయితకు ఉంటే తప్పనిసరిగా ఇందులోని తొంబై శాతం పదాలకు ఫుట్‌ నోట్‌లో అర్థాలు ఇవ్వాలి. 

pulliతెలుగు వారందరికీ అర్థమయ్యే ఉర్దూ పదాలు ఇందులో కొన్నే ఉన్నాయి. ఉర్దూ బాగాతెలిస్తే తప్ప ఈ కథలు అధూరాగనే అర్థం అవుతాయి. తన ఉద్దిష్ట పాఠకులు ఎవరు అనే ప్రశ్న రచయిత వేసుకున్నట్లు కనిపించదు. తదుపరి ప్రచురణలో ఈ లోపాన్ని స్కైబాబా సరిదిద్దుకోవలసి ఉంది. ఒక ఇన్‌ సైడ్‌ అబ్జర్వర్‌ చేసిన పరిశీలన, ఒక క్లోజప్‌ దృశ్యం ‘అధూరె’. కథలు చదవడం ముగిసిన తర్వాత స్కైబాబా నుండి ఏ దిల్‌ మాంగే మోర్‌ అని అనిపిస్తుంది. మహ్మద్‌ రఫీ గొంతులోని ఏ దిల్‌ అభీ భరా నహీఁ అని మనసు అధూరాగా మిగిలిపోతుంది