Friday 26 November, 2010

ట్‌రైటర్స్‌

నువ్వూ నేనూ కలిసే
భూమి కోసం పోరాడుతున్న
వీరుల కోసం విప్లవగానం చేశాం -
నువ్వూ నేనూ కలిసే
కశ్మీర్‌, పాలస్తీనా, ఇరాక్‌
పోరాటాలను సమర్థించాం ..
చర్చలు.. సభలు.. ఉపన్యాసాలూ...
ఉద్యమ ఆవేశాల్తో ఊగిపొయ్యేవాళ్లం -
ఒకానొక సమయం ఇలా వచ్చింది
ముక్క దగ్గరా మగువ దగ్గరా
మనిషి మనస్తత్వం తెలుస్తుందంటారు..
నువ్వు ఆక్రమించిన నా నేల
ఉద్యమించేసరికి నీ నైజమూ బైటపడిపోయింది!
    1
ఏకైక రక్తసంబంధాన్ని ఏడేడు సముద్రాలు దాటనిచ్చినవాడా!
అమ్మగల్లాడిన మా మట్టిమీది ప్రేమను అపహాస్యం చేస్తున్నావా?
మెత్తని నీ మాటకు మురిసిపోయేవాణ్ణి
అది చాకూ అని తేలి విస్తుపోతున్నాను
నీ ఆలింగనంలో గుండెలు విచ్చుకునేవి
ఇప్పుడు బ్రహ్మజెముళ్లు గుచ్చుకుంటున్నాయి
    2
ఈ నేలే నిన్ను కవిని చేసిందంటావ్‌
ఇవాళ ఈ నేలే తన విముక్తికోసం పెనుగులాడుతుంటే
ట్రైటర్స్‌లో ఒకడివయ్యావ్‌
కుడి ఎడమల తలలూపేవాళ్ళే
ఎవడి ముందు వాడి పద్యం పాడతావ్‌
తడబడుతున్న నీ పదమే
నీ కలాన్ని నిలదీస్తుంది
    3
ఏ నేల నిన్ను తన జవసత్వాల నిచ్చి
పెంచి పెద్ద చేసిందో
ఆ నేలనే తన్నేసి
పరాయి దేశం ఎగిరిపోగలిగిన గద్దా..
నీకు మా మాతృప్రేమ తండ్లాట
ఎలా సమజైతది?
    4
ఒక అస్తిత్వం గురించి మాట్లాడుతూనే
మరొక అస్తిత్వాన్ని కాదనడం ఏమనిపించుకుంటుంది?!
మైనారిటీ అస్తిత్వ దీర్ఘ కావ్యమైనవాడా..
స్త్రీవాదపు రెమ్మలై రెపరెపలాడినవారలారా..
సోదర అస్తిత్వాని కొచ్చేసరికి
ఇంగితం ఆవిరైపోయిందా.. కపాలం డొల్లగా మారిందా..
                 *
కవి అన్నవారికి కన్నెలా మలుగుతుంది..
ఆమ్‌ ఆద్మీ రోడ్ల మీదికొచ్చి నినదిస్తుంటే
రక్తం ఉరకలెత్తకుండా ఎలా ఉంటుంది..
ఇన్నాళ్లూ విప్లవాల వేషాలేసీ
ఉద్యమాల శిగాలూగీ
ఇవాళ ముడుచుకుపోయారేం..
మిమ్మల్ని ఇన్నాళ్లూ గౌరవించినందుకు
మాకే తలవంపులుగా ఉంది-
సిగ్గూ శరం ఉన్నోళ్ళయితే
ఇన్నాళ్లూ రాసిన ఆ కలంతోనే పొడుచుకోండి
అట్లన్నా కవిత్వం పునీతమవుతుంది!           

                                                                       01 09 2010

Monday 22 November, 2010

'కథతో ఒకరోజు' విషయంలో ఏమి జరిగింది ...

ఆంధ్రా 'కథతో ఒకరోజు' ఆంధ్రాలో పెట్టుకోండి! -కరపత్రం విడుదలయ్యాక మరునాడు సభ అనంగా, వాసిరెడ్డి నవీన్‌ 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం బాధ్యులైన డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్‌, స్కైబాబ లకు, తెలంగాణ రచయితల జెఎసి కన్వీనర్‌ పరవస్తు లోకేశ్వర్‌కు వేరువేరుగా ఫోన్లు చేసి తాను తెలంగాణకు మద్దతుగా ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేయడం జరిగిందని, రేపు మీటింగ్‌ సజావుగా జరగడానికి సహకరించమని, అందుకు ఇంకా ఏమి చేయాలని అడిగారు. మరి ఇప్పటివరకు తెలంగాణ రచయితలకు జరిగిన నష్టం ఎలా పూడుతుందని అడిగాము. 14మంది వక్తల్లో కేవలం ఇద్దరినే తెలంగాణవారిని పెట్టడం గురించీ అడిగాము. మీటింగ్‌ తర్వాత అన్నీ మాట్లాడుకుందామని నవీన్‌ అన్నారు. సరే, సింగిడి సభ్యులము మాట్లాడుకొని చెబుతామన్నాము. తర్వాత సంగిశెట్టి శ్రీనివాస్‌ నాలుగు విషయాలు నవీన్‌కు చెప్పడం జరిగింది. 1.సభలో తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా తీర్మానం చేయాలి. 2. కరపత్రంలో 'సింగిడి' లేవనెత్తిన అంశాలకు వివరణ ఇవ్వాలి. 3. కరపత్రాలు సభా ప్రాంగణంలో పంచుకుంటాము. 4. మీటింగ్‌ తర్వాత కలిసి 20 ఏళ్లుగా తెలంగాణ రచయితలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకోవాలి. -వీటన్నింటికీ వాసిరెడ్డి నవీన్‌ ఒప్పుకున్నారు.
ఆయన పత్రికలకు విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో- 'సింగిడి' వారు కోరినట్లుగా తెలంగాణ ఉద్యమానికి ఎటువంటి అరమరికలు లేకుండా మద్దతు తెలియజేస్తున్నామని, కథల ఎంపికకు సంబంధించి, సంకలనాల లోటుపాట్ల గురించి సాహిత్య చర్చల ద్వారా నిర్ణయించుకోవచ్చునని -నవీన్‌ అన్నారు.
మీటింగ్‌ రోజు ఆరేడుగురు సింగిడి సభ్యులు వెళ్లి కరపత్రాలు పంచి వచ్చేశారు. సింగిడి సభ్యులు అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికి దాదాపు 20 మంది పోలీసులు అక్కడికి చేరుకుని సభకు రక్షణగా నిలుచున్నారు. ముగ్గురు నలుగురు తప్ప తెలంగాణ రచయితలంతా సభను బాయ్‌కాట్‌ చేశారు. రాలేదు. ఆశించినంతమంది సభకు రాలేదని, 150కి పైగా సాహిత్యకారులు వస్తారనుకుని నిర్వాహకులు భోజనాలు చెప్పారని, కేవలం 50 మందే వచ్చిఉంటారని, చివరి సెషన్‌ మరీ వెలవెలా పోయిందని తెలిసింది.
తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు అన్న విషయమే వాసిరెడ్డి నవీన్‌ మళ్లీ మళ్లీ అందరికీ చెప్పారు కానీ అదొక్క విషయమే సింగిడి లేవనెత్తలేదు, 20 ఏళ్లుగా తెలంగాణలో ఎదగాల్సిన కథకు, కథకులకు ఎనలేని నష్టం కథాసాహితి చేసిందని మేము కరపత్రంలో చెప్పాం. అట్లే ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు కరపత్రంలో ఉన్న విషయం గమనించవచ్చు.
                                                                      - 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం

బద్వా



''అయ్యో - నా బిడ్డలు
ఒకని జోలికి బోతోల్లు గాదు
ఒగని ఉసురు బోసుకుంటోల్లు గాదు
ఒగల ఉప్పు దింటోల్లు గాదు
ఉన్నదున్నట్లు మాట్లాడ్తె
నీతి దప్పుతున్నవంటె
నా బిడ్డల్ని పొట్టన బెట్టుకుంటున్నవ్‌ గదర
గరీబోల్ల కోసం బందూఖ్ బట్టినోన్ని సంపుతుంటివి
నీ లెక్కనె మనుషులందర్కి హక్కులుంటయంటె నరుకుతుంటివి
తుర్కోల్ల వష్షి పోరగాల్లని పరాయి ఏజంట్లని పట్కపోతుంటివి
ఏ దేశంర నీది
మా కాడ పెద్దిర్కం జేస్కుంట
మమ్మల్నే ఆగమాగం జేస్తున్నవ్‌ గదర
అన్నం బెడ్తున్నోన్కి పురుగుల మందు తాపియ్యబడ్తివి
పత్తిచెట్లను ఉరికొయ్యలు జేస్తివి
కంపెనీల బతుకుదెరువుల్ని మూతబడేస్తుంటివి
నువ్వు సత్తెనాశనం గాను
నువ్వు పురుగులు బడిపోను
నీ ఏశాలు అరవపోల్లకాడ సాగయని
మా తాన ఆడుతున్నవార ?
సోపతిల తెల్లోని బుద్దులు ఒంటబట్టి
అచ్చం ఆని లెక్కనె మా మీద రాజ్యం జేస్కుంట
నా బిడ్డల కడుపు గొట్టి
నీవోళ్ల బొజ్జలు నింపుతున్నవారీ
మేం ఆ అంగ్రేజోన్ని సూళ్లే
నిన్ను జూస్తున్నం

మా కోహినూర్  ఎవని కిరీటంలనో మెరిసినట్టు
మా పచ్చదనం దగదగల్ని తరలిస్తిరి గదర
మా గొలుసుకట్టు చెరువులెయ్యి
కుంటల్ల చెరువుల్ల బావుల్ల తానాలాడిన
మా సంతసాన్ని మాయం జేస్తిరి గదర
కండ్ల మీద ఆనకట్ట లేసి చూపానకుంట జేసి
కండ్ల కింద పంటలు పండించుకుంటున్నరారీ
ఈ ఒంటిని 'జలాశయం' చేసుకుంటిరి
దాన్యాగారం చేసుకుంటిరి
'డబ్బు' సంచి జేసుకుంటిరారీ
ఈ తావు ఉజ్జెమాల పుట్ట
పాముల్లెక్క జేరితిరి గదర
తురక రాజులుగుడ ఈడ రాజ్జెం జేసిన్రు గని
మా రాజులు...
మా నోటికాడిది గుంజి ఇంకోనికైతె పెట్టలె
ఈడ రాజ్జెం జేసిన్రు
ఈ మట్టిల్నె గలిసిన్రు
ఆళ్లె నయమనిపిస్తున్రు
నా బిడ్డలను నీళ్లకు బువ్వకైతె సంపలె
సాచ్చెం రుజువుల్లేకుంట
నా బిడ్డల పాణాలైతె తోడలె
ఆళ్లను ఎలగొట్టి
మీరు శనిలెక్క పట్టుకున్రు గదరా...''