Sunday 23 October, 2011

ముస్లింవాద స్పష్టరూపం స్కైబాబ ‘రెహల్‌’

(ఇవాళ 'సూర్య' దినపత్రిక లో వచ్చిన వ్యాసం)
శీర్షిక చూడగానే ఇస్లాం విశిష్ఠతో, ఖురాన్‌ ప్రాశస్త్యమో వస్తువు కావచ్చునని అనుకునే అవకాశముంది. వస్తువును సూటిగా చెప్పని శీర్షికను ఎన్నుకోవటం, వస్తువుకు సుదూరమైన అంశాన్ని శీర్షికగా నిలపటం, శీర్షికకు అసంబద్ధమైన వాక్యాలతో కవితను ఆరంభించటం మొదలైనవి పాఠకుడిలో ఆసక్తిని ఇనుమడింపజేసే వ్యూహాలు.ఈ కవితా శీర్షిక ఎత్తుగడ కూడా అలాంటి ఒక వ్యూహమే.

skybaa-articlముస్లిం మైనారిటీ వాదం ఒక స్పష్ట రూపం సంతరించుకోవడంలో ఇతరులతో పాటు కవిగా, సంపాదకుడిగా, కార్యకర్తగా  స్కైబాబ కృషి అవిస్మరణీయం. ఈ వాదం తొలి దశలో స్కైబాబ రాసిన కవితలలో దాని రూపాంతరం ‘రెహాల్‌’ ఒకటి. నిజానికిది ‘రెహల్‌’. దీని రూపాంతరం ‘రిహల్‌’. పవిత్ర గ్రంథాన్ని ఉంచే పీఠం (వ్యాస పీఠం) అని అర్థం. శీర్షిక చూడగానే ఇస్లాం విశిష్ఠతో, ఖురాన్‌ ప్రాశస్త్యమో వస్తువు కావచ్చునని అనుకునే అవకాశముంది. వస్తువును సూటిగా చెప్పని శీర్షికను ఎన్నుకోవటం, వస్తువుకు సుదూరమైన అంశాన్ని శీర్షికగా నిలపటం, శీర్షికకు అసంబద్ధమైన వాక్యాలతో కవితను ఆరంభించటం మొదలైనవి పాఠకుడిలో ఆసక్తిని ఇనుమడింపజేసే వ్యూహాలు. ఈ కవితా శీర్షిక ఎత్తుగడ కూడా అలాంటి ఒక వ్యూహమే.

‘‘కన్నీటి దారాల్తో జీవన వస్త్రానికి మాసికలేస్తూ/ తరాల చీకటి కమ్మేసిన గోషాలో/ పాలిపోయిన చంద్రశిలా దేహంతో/ అనుక్షణం/ ‘బిస్మిల్లా ఇర్రహ్మా నిర్రహీమ్‌’ అనే కదులుతుంది అమ్మీజాన్‌’’.
మొదటి పంక్తి దారిద్య్రాన్ని, రెండో పంక్తి మత సంప్రదాయాలు, కట్టుబాట్ల వల్ల కలుగుతున్న దుఃఖాన్ని సూచిస్తాయి. ఈ రెండింటి ఫలితం ‘పాలిపోవటం’. ‘బిస్మిల్లా ఇర్రహ్మా నిర్రహీమ్‌’ అంటే ‘దయామయుడైన కృపా హృదయుడైన అల్లా పేరుతో ఆరంభిస్తున్నాను’ అని అర్థం (ఈ భావానికి సంఖ్యా రూపమైన సంకేతమే ‘786’). ప్రతి పనిని ఆరంభించే ముందు చేసే దైవనామస్మరణ అన్నమాట. ఒకవైపు లేమివల్ల, మరోవైపు మత నియమాల వల్ల ఎన్ని ఇబ్బందులెదురైనా ఆమె అల్లా పట్ల విశ్వాసంతోనే చరిస్తున్నదని సారాంశం.

మొదటి పంక్తిలోని ‘కన్నీటి దారాలు’ అనే అచ్చ తెలుగు రూపకం ‘జీవన వస్త్రం’ అనే సంస్కృత రూపకం వెంట వెంట ప్రయోగించడంలో ఉన్న ‘భేదకత’ గమనింపదగినది. తెలుగు, సంస్కృత రూపక సమాసాలతో కూడిన రూపకాలంకారమిది. వస్తువులోని వైరుద్ధ్యాలకు దీనిని ఆలంకారికమైన సూచనగా భావింపవచ్చునేమో! ‘చంద్ర శిలా దేహం’ అనే సంస్కృత సమాసం ఆమె శరీర ఛాయను తెలుపడంతో పాటు, దేహాంతరంగాలకు ఒక ఉదాత్తతను ఆపాదింప జేస్తున్నది. ‘గోషా’ అనే ఆమె ఉడుపులోని వర్ణమే చీకటికి పోలిక. అనేక తరాలుగా ముస్లిం స్ర్తీలు గోషా వల్ల అనుభవించిన అంతర్గత వేదనకు తన తల్లి గోషాను ప్రతీకగా చెబుతున్నాడు కవి. అనేక తరాల చీకటి కమ్మినప్పుడు- ఒక్కనాటి (రాత్రి) చంద్రుడు ఎదుర్కొనలేక ‘పాలిపోవటం’ అతిశయోక్తి కాదు. ‘కదులుతుంది’ అనే క్రియ పక్కన చేర్చడం వలన కవితలో ‘అమ్మీ జాన్‌’కు ప్రాధాన్యం వచ్చింది.

skybaabajpjFinal‘... నమాజ్‌ చదువుతున్నప్పుడు.../ మెరుపు వెలిసిన అమ్మీ దోసిలలో/ రాలిన కన్నీటి తడిపై/ ఏ దేవుడూ సాక్షాత్కరించడు/ ఒక అపనమ్మకాల బొమికల గూడు ప్రతిబింబిస్తుంది’. మెరుపు వెలిసిన దోసిలి, పాలిపోయిన దేహాన్ని గుర్తు చేస్తుంది. ఎంత ప్రార్ధించినా దేవుడు కరుణించడం లేదని, క్రమంగా మనస్సులోని ‘విశ్వాసమే’ మసకబారుతున్నదని తాత్పర్యం.‘అస్తమయం వైపుకు మోకరిల్లి ప్రార్ధిస్తూ/ మా జిందగీల్లో సూర్యోదయమౌతుందనుకుంటుంది అమ్మీ’- ఇది అర్థమవంతమైన ‘విరోధాభాస’. ఉదయానికి వ్యతిరేకమైన ‘అస్తమయం’ ఇక్కడ సార్థక ప్రయోగం. ‘పడమరవైపు’, ‘పశ్చిమ దిక్కు’, ‘కాబావైపు’ లాంటి ఏ పదాన్ని వాడినా ఈ చమత్కారం ఉండదు.

‘మా కోసం ‘దువా’ చేసి చేసి/ అమ్మీ గొంతు తడారిపోతుందే తప్ప../ ముందు కూర్చున్న నీడ విస్తరించి/ కటికి  రాత్రై పరచుకుంటుందే తప్ప...’!పశ్చిమాభిముఖులై ప్రార్థిస్తారు కనుక ఫజర్‌, జొహార్‌ అనే ఉదయ, మధ్యాహ్న ప్రార్థనల్లో (కూర్చుని దువా చేసేటప్పుడు) నీడ ముందు కూర్చున్నట్లే ఉంటుంది. ముందున్న ఆమె నీడే సాంద్రతిమిరంగా పరచుకున్నదేమో అన్నట్లున్నదంటూ కారణం కాని దాన్ని కారణంగా ఊహిస్తాడు (ఉత్ప్రేక్ష). కటికి  రాత్రి, కటికి  చీకటి అనాలి. ‘కటికి’ అంటే అధికం, కఠినం, సాంద్రం అని అర్థాలున్నాయి. అది అలా ఉంచితే- ‘తడారిపోతుందే తప్ప...’, ‘పరచుకుంటుందే తప్ప...’ అంటూ అర్థాంతరంగా, అసంపూర్ణంగా వాక్యాలను వదిలేసి, తాను కోరుకుంటున్నది ఏది జరగడం లేదో దానిని పాఠకుల ఊహకే వదిలేశాడు. ఆవేశం, ఉద్వేగం, కోపం, దుఃఖం మొదలైన మానసిక స్థితులలో వాక్యాన్ని పూర్తి చేయలేక హఠాత్తుగా ఆపేయడాన్నిఆంగ్లకవిత్వ పరిభాషలో‘అపోసయ్యొపీసిస్‌’(Aposiopesis ) అంటారు. 'Aposiopesis (bicoming silent) is a figure of speech wherein a sentence is deliberately broken off and left unfinished, the ending to be supplied by the imagination, giving an impression of unwillingness or inability to continue.' (see: wikipedia- Literary terms)

jagne-ki-raat‘తల్లిపాదాల వద్ద స్వర్గం ఉందంటారు/ మా అమ్మీ పాదాలపై వంగిన ప్రతిసారీ/ చెమరిన నా చూపు/ ఆమె పాదాల పగుళ్ళలో చిక్కుకుని గిలగిలలాడుతుంది’. ఆమె పాదాలను చూడడంతోనే చెమ్మగిల్లిన చూపు పాదాల పగుళ్ళు కనిపంచగానే ఇంకెంత తల్లడిల్లుతుందో ఊహించుకోవచ్చు. ‘చూపు’కు ప్రాణి లక్షణారోపణ ద్వారా క్లుప్తంగా, గుప్తంగా దయనీయ హృదయ వేదన వ్యక్త మయింది. తల్లి పాదాల వద్ద స్వర్గం లేకపోగా పాదాలలోనే బీటలు ఉన్నాయన్నది వ్యంగ్యం.‘అబ్బాజాన్‌ అసహాయత చెల్లిని ఎవడికో/ రెండో పెళ్ళాంగా అంటగడితే/ ఆ చిట్టి తల్లి కళ్ళల్లో ఉబికిన కన్నీళ్ళ మీద/ వణికే దృశ్యమై తల్లడిల్లుతుంది అమ్మే’. చెల్లిని ఎవడికో రెండో పెళ్ళాంగా అంటగట్టింది అబ్బాజాన్‌ కాదు, ఆయన ‘అసహాయత’ అని గమనించాలి.
ఈ అసహాయతకు మూలమైన ఆర్థిక, ఆర్థికేతర కారణాలను తెలుసుకోవడం కష్టం కాదు. చెల్లెలి కన్నీళ్ళ మీద వణికే దృశ్యమై అమ్మ తల్లడిల్లే దృశ్యానికి, అమ్మీ దోసిలిలోని కన్నీటి తడిపై ఏ దేవుడూ సాక్షాత్కరించకపోవటం అనే మొదటి దృశ్యానికి అంతర్గత సంబంధమున్నది. ఒకేరకమైన పోలికలతో భిన్న దృశ్యాలను సృష్టించి, భిన్న ప్రయోజనాలను కవి సాధించాడు. తన దోసిలిలోని కన్నీటి తడిలో ఏ దేవుడూ సాక్షాత్కరించకపోగా, తన కూతురి కన్నీళ్ళలో తానే తల్లడిల్లుతూ వణుకుతున్న దృశ్యంగా మిగలడంలో నిస్సహాయత, దైన్యం ధ్వనించాయి.

‘కాన్వెంట్‌కు బదులు కార్ఖానాకెళ్ళే తమ్ముడు/ సాయంత్రానికి కమలిన దేహంతో అల్లుకుపోతే/ పగిలిన లేత స్వప్నం గుచ్చుకొని విలవిల్లాడేది అమ్మే’- కాన్వెంట్‌కు బదులు తమ్ముడు కార్ఖానాకెళ్ళాల్సి రావడం వెనుక ఉన్నది కూడ అబ్బాజాన్‌ ‘అసహాయతే’. కూతురి దీనస్థితికి, కొడుకు బాలకార్మికుడిగా మారవలసిన దుస్థితికి మొదట తల్లడిల్లేది, విలవిల్లాడేది అమ్మే అనేది సారాంశం.‘కడుపులో మా భారాన్ని మోసి/ కష్టాల మా బాధ్యతలు మోసి/ కళ్ళ గుమ్మానికి కట్టిన పరదాల వెనుక పాతివ్రత్యాన్ని మోసి/ తన కనుబొమ్మల నెలవంకల మీద/ చీకటి రాశుల్ని మోస్తున్న అమ్మ/ చివరకు ఖురాన్‌ను మోసే ‘రెహాల్‌’లా మిగిలిపోవలసిందేనా’?- ఒక తూగు కలిగిన వాక్యాంశాల్ని వరుసగా పేర్చి, కవి తన ఆవేశాన్ని వ్యక్తీకరించాడు. ఉద్వేగాన్ని చేకూర్చాడు.

పరుషాలలోని ఆద్యక్షరమైన ‘క’ కారం తొలి నాలుగు పాదాలలో పలుమార్లు ఆవృత్తం కావడం వలన కవి దృష్టికోణానికి తగిన పారుష్యం చేకూరిందనిపిస్తుంది. కనుబొమలను ధనస్సుతో పోల్చడం తెలుగు కావ్య సంప్రదాయం. ‘కనుబొమల నెలవంకల మీద చీకటి రాశుల్ని మోయడం’ అనే మాటలు- ‘తరాల చీకటి కమ్మేసిన గోషా’ అనే ఈ కవితలోని తొలి దృశ్యంతో అనుసంధిస్తాయి. నెలవంక అనే పోలిక ద్వారా భంగ్యంతరంగా ఇస్లాం మత సంకేతాలైన చాంద్‌ తారలు స్ఫురిస్తాయి. కాలానుగుణంగా ఆచార సంప్రదాయాలలో మార్పులను అంగీకరించని ‘ధర్మాల’ను మోస్తూ అనామకంగా అణగారుతున్న అమ్మను ‘రెహల్‌’తో పోల్చాడు.

‘రెహల్‌’ దివ్యత్వానికి, పవిత్రతకు సంకేతమవుతూనే మరోవైపు మరో అంశాన్ని కాపాడుతూ, దానికి మరింత గౌరవాన్ని కలిగిస్తూ తాను అనామకంగా మిగిలిపోవడానికి ప్రతీకగా నిలచింది. ఒక ముస్లిం తల్లి జీవితం ఛిద్రం కావడానికి దారిద్య్రం, కఠినమైన మత ధర్మాలే కారణాలని సై్కబాబా ఈ కవితలో సూచించాడు. కవితలో ఆద్యంతం ఆ రెండింటిని సమాంతరంగా ధ్వనిస్తూ వచ్చాడు.ముస్లిం స్ర్తీ కంఠ స్వరంతోనే 
స్కైబాబ రాసిన మరో కవిత ‘సాంబా’. ఆ కవితలోని ‘నేను నేనుగా కాదు/ ఒక మతానికి చిహ్నమై ఆరిపోతున్నానే...’ అనే మాటలను ప్రస్తుత కవితలోని ముగింపుకు అన్వయించుకుంటే కవి ఉద్దేశం మరింత స్పష్టమవుతుంది. ‘బిస్మిల్లా...’, వజా, మోకరిల్లి ప్రార్ధించడం, దువా అనే అంశాల క్రమపరిణామంలో చివరకు ఖురాన్‌ను ప్రస్తావించి, తద్వారా ‘రెహల్‌’తో పోలిక చెప్పాడు.

pamakrishnaసాకారాలను (concrete) సాకారాలతో పోల్చడం కంటే, సాకారాలను నిరాకారాల (abstract))తో, నిరాకారాలను సాకారాలతో పోల్చడం వల్ల భావసాంద్రత వస్తుంది. జీవన శాస్త్రం, వేలాడుతున్న నైరాశ్యం, అపనమ్మకాల బొమికల గూడు, పగిలిన లేత స్వప్నం, చీకటిరాశులు- మొదలైన అన్ని సమాసాల్లో నిరాకారాలను, సాకారాలతో పోల్చి భావగాఢతను సమకూర్చాడు. ఈ కవితను గూర్చి ‘ముస్లిం జీవితంలోని సున్నితమైన లలితమైన పదాలు- కవిలోని సాత్త్వికావేశం ఇక్కడ దుఃఖంతో నిండిన కవిత్వానికి సౌందర్యాన్నిచ్చాయి అన్నారు ఖాజ  (ముస్లింవాద తాత్వికత; సిద్ధాంతం- సాహిత్యం, పుట.113).సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నట్టు ‘రెహల్‌’తో పాటు 
స్కైబాబ రాసిన సాంచా (1995), హిజాబ్‌ (1994) కవితలను ముస్లిం స్ర్తీవాదానికి ప్రాతినిధ్యం వహించగలగినవిగా భావించవచ్చు.
                                                        -పెన్నా శివరామకృష్ణ 

Sunday 16 October, 2011

పుట్టుమచ్చ నుంచి పోరు జల్‌జలా


(ఇవాళ ఆంధ్ర జ్యోతి 'వివిధ'లో వచ్చిన వ్యాసం..)

ఒక అందమైన తోట/ఆ తోటలో రకరకాల పూలు
రంగురంగుల పూలు/గులాబీలు మందారాలు చమేలీలు
మొగలిపూలు బంతిపూలు గుల్‌మొహర్‌లు...
అన్ని రకాల పూలతో చాలా అందంగా కనబడుతుందా తోట!
అయితే/ ఆ పూలన్నింటినీ నలిపేసి, తొక్కేసి, కోసేసి
ఒక్క కమలమే విస్తరించాలంటే
ఆ తోట అందమంతా ఏమైపోతుంది?!
                                    అంటున్నాడు ముస్లిం కవి ఆఫ్రీన్.
ఏ సమాజంలోనైనా మెజారిటీ మత భావజాలం ఆవరించి ఉంటుంది. ఆ భావజాలంలోంచే మెజారిటీ ప్రజల చర్యలుంటాయి. దానివల్ల మైనారిటీల మనోభావాలు దెబ్బతింటుండడాన్ని కూడా ఎవరూ పట్టించుకోరు. మైనారిటీల దృష్టికోణం నుంచి చూసే దృక్పథాన్ని ముస్లింవాద సాహిత్యం అందించింది. ఆ కోణం నుంచే ఈ కవిత్వం... 

ముఖ్యంగా ముస్లింవాదం రెండు రకాల పోరాటం చేసింది- బాహిర్ పోరాటం. అంతర్ పోరాటం. బాహిర్ పోరాటంలో భాగంగా ఖాదర్ మొహియుద్దీన్ 'పుట్టుమచ్చ'ను చూడొ చ్చు. ముస్లింల అభద్రత, వివక్ష, అణచివేత, తద్వారా పేదరికం మొదలైనవి. ముస్లింలు మన దేశంలో అతిపెద్ద సమూహం. ఈ సమూహాన్ని విస్మరించి పురోగతి సాధించడం సాధ్యం కాదు. అన్ని రంగాల్లోనూ ముస్లింల విలువైన, ప్రత్యేకమైన ప్రాతినిధ్యం ఉంది. దేశ ప్రగతిలో ముస్లింల శ్రమ, కృషి ఎంతో ఉంది. ఆ విషయాన్ని విస్మరింపేజేసి ముస్లింలను అట్టడుక్కి తొక్కేసే ప్రయత్నం జరిగింది.. జరుగుతున్నది. 

అంతర్గత సంస్కరణలు కోరడం ముస్లింవాదం ప్రత్యేకత. ఆ కోణం నుంచి బలమైన కవిత్వం వచ్చింది. అయితే ఈ ముస్లింల అంతర్గత సమస్యల పైన వచ్చిన కవిత్వానికి 'ఆహా! ఓహో!' అన్నంత స్థాయిలో హిందూత్వ దాష్టీకం, వివక్ష, అభద్రతలపై వచ్చిన కవిత్వం పట్ల మౌనం వహించడం మేము గమనించాం. అంటే చైతన్యవంతులైన వారిలోనూ హిందూత్వ అంశ ఉన్నట్లు దీనివల్ల రుజువైంది.

'ముస్లింవాద' సంఘర్షణ: 
ఇవాళ ముస్లింవాద సాహిత్యంపై ఎంఫిల్‌లు, పిహెచ్‌డీలు, చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సాహితీ పెద్దలు ముస్లింవాదాన్ని లెక్కలోకి తీసుకుంటున్నారు. కాని ఈ పరిస్థితికి ముందు, ముస్లింవాదం ఒక వాదంగా నిలబడడానికి ముస్లింవాదులుగా ఎన్నో సంఘర్షణలు ఎదుర్కోవలసి వచ్చింది.. 

నల్గొండ కేంద్రంగా ఒక ముస్లిం కవితా సంకలనాన్ని తీసుకువచ్చే పనిలో ఏడాదిన్నరపాటు శ్రమించాల్సివచ్చింది. అది 'జల్‌జలా' ముస్లింవాద కవితాసంకలనంగా వచ్చింది. ఆ సమయంలో ఎన్నో చర్చలు, సంఘర్షణ, వాదోపవాదాలు జరిగాయి. అంతలో విరసం 'జిహాద్' వేసింది. పత్రికల్లో చర్చ జరిగింది. అందులోని కవిత్వాన్ని మినహాయిస్తూనే సంకలనం తేవాలనుకున్నాం. 

దీనిని ఏ కవిత్వం అందాం అన్న దగ్గర ఎంతో సంఘర్షణ జరిగింది. విరసం 'ముస్లిం మైనారిటీ కవుల కవిత్వం' అన్నది. మైనారిటీ పదం వాడడంలో న్యూనతాభావం కొట్టిచ్చినట్లు కనిపిస్తుంది. ఎవరు మైనారిటీ? ఎవరు మెజారిటీ? అనేది మరో చర్చ. స్త్రీవాదం, దళితవాదం లాగా ముస్లింవాదం అనడంపై ఎన్నో రకాలుగా ఆలోచించాం. కాని ముస్లింవాదం అంటే ఎక్కడ మతముద్ర వేస్తారో అనేది సంశయం. కాని ఇస్లాంవాదం అంటే మతం పరిధిలోకి వెళ్తుంది, 

ముస్లిం అంటే ఒక సమూహ నామం అనే దృష్టితో చివరికి దాన్నే ఖాయం చేశాం. చర్చల్లో కొన్ని విషయాలు ఎంతకూ తెగేవి కావు. చివరికి అంతర్ పోరాట కవిత్వం రాసిన మా కవితలకు మేమే బాధ్యత వహిస్తాం, వేరెవరికి సంబంధం లేదు కాబట్టి వారు భయపడవలసిన అవసరం లేదంటూ గట్టిగా నిలబడ్డాం. ఈ విషయంలోనే ముస్లింవాదులు ఏ అస్తిత్వవాదులూ ఎదుర్కోని సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ కవులు ఏ సమూహానికైతే ప్రతినిధులుగా రాస్తున్నారో ఆ సమూహంలోని మెజారిటీ ప్రజలే సంస్కరణవాద కవిత్వం పట్ల అయిష్టంగా ఉండడం విషాదం. 

ముందుమాటలు ఎవరితో రాయించాలనేది కూడా సంఘర్షణే. ముస్లింవాదానికి ఆదికవి ఖాదర్‌తోనే రాయించొచ్చు. కాని ఆయన అంతర్ పోరాట కవిత్వాన్ని ఆహ్వానించడంలేదు. ఆ విషయంలో రాజీ పడకుండా అఫ్సర్‌తో రాయించాం. ఈ సంకలనం విషయం లో ఆదినుంచీ మాకు భావజాలపరంగా, అన్ని రకాలుగా అండగా నిలిచిన సుంకిరెడ్డి నారాయణరెడ్డి విలువైన ముందుమాట రాశా రు. 

ముస్లింలది పౌరహక్కుల సమస్య కూడా అనే కోణం నుంచి ఎమ్‌టి ఖాన్‌తో రాయించినా, దాన్ని తెలుగు చేసి ఇస్తూ బాలగోపాల్, ఐడెంటిటీ ఉద్యమాల విషయంలో నా అభిప్రాయం వేరు, మీకు ఇష్టమైతే నేను రాసి ఇస్తాను అన్నారు. సంతోషం సార్, రాసివ్వండి అన్నాను. దాంతో ఆయన జల్‌జలాకు ముందుమాట రాశా రు. అస్తిత్వ సాహిత్య ఉద్యమాలపై బాలగోపాల్ మొదటగా రాసిన వ్యాసం ఇది. 1997లోనే ఆయన దళిత, స్త్రీ, గిరిజన, ముస్లిం, బహుజన అస్తిత్వ ఉద్యమాలపై ఎంతో వివరంగా రాశారు. 

నిజంగానే పెన్నా శివరామకృష్ణ ఒక సమీక్షలో అన్నట్టు 'జల్‌జలా' భూకంపమే పుట్టించింది. కాకపోతే- ఒకవైపు, ముస్లిం చాదస్తులు, మరోవైపు హిందూత్వవాదులు ఎక్కడ గొడవ చేస్తారోననే భయంతో ఆ సంకలనం పుట్టినచోటే ఆవిష్కరణ జరుపుకోలేదు. అందులోని కవితల బలం అంత తీవ్రమైనది. 

మరి ముస్లింలు ఎవరు?
మనదేశంలో 15 కోట్లకు పైగా ముస్లింలున్నారు. పాకిస్తాన్‌లోనూ దాదాపు అంతే. బంగ్లాదేశ్‌లో 8 కోట్లు. మరి ఇంత జనాభాకు కారణమైన ఈ ఉపఖండంలో మొదట్లో ముస్లింలుగా మారినవాళ్లు ఎవరు? ఏయే కారణాల వల్ల మారారు? ఈ ప్రశ్నలకు హిందూత్వవాదుల ప్రచారమే ఎక్కు వ ప్రాచుర్యం పొందింది. 2004లో ముస్లింలు రకరకాల సంఘాల ద్వారా ముస్లిం రిజర్వేషన్‌కోసం పోరాడుతుండడంతో వారికి 4 శాతం రిజర్వేషన్ కల్పించబడింది. ఆ సందర్భంలో ముస్లింలను బీసీ ల్లో కలపడాన్ని కొన్ని బీసీ సంఘాలు వ్యతిరేకించాయి. అప్పటికి 'మర్ఫా' పేరుతో రిజర్వేషన్ కోసం పోరాడు తున్న మేము షాకయ్యాం. బీసీ లు మమ్మల్ని బీసీల్లో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నారు, హిందూత్వవాదులు మేము ఈ దేశస్థులమే కాదని ప్రచారం చేస్తున్నారు.. దీంతో '..మరి ముస్లింలు ఎవరు?' అనే పరిశోధనాత్మక కరపత్రం వెలువరించాం. 

మన ఉపఖండంలో ఇంతగా ముస్లిం జనాభా పెరగడానికి ముస్లిం రాజుల పాలనలో రకరకాల అవసరా లు, అవకాశాల కోసమే కాకుండా మరో బలమైన కారణమూ ఉందని ప్రకటించాం. 
గుడి అంటని
ఇక్కడి మట్టి బిడ్డల కాడికే
నడిచొచ్చిన దేవుళ్లు సూఫీలు...

'అసుంట! అసుంట!' నిలిపిన మూలాన్ని
అలాయిబలాయి తీసుకున్న దిల్! - స్కైబాబ, 'అలావా' ముస్లిం సంస్కృతి కవితా సంకలనం 

బడికీ, గుడికీ ఆఖరికి ఊరికీ అంటరానివాళ్లుగా చేయబడిన ఈ దేశ మూలవాసుల వాడల్లోకి నడుచుకుంటూ వచ్చారు సూఫీ 'దేవు ళ్లు'! వచ్చి వాళ్లని అక్కున చేర్చుకున్నారు. బ్రాహ్మణ సంస్కృతి అసుంట అసుంట అంటే సూఫీలు వాళ్లకు గుండెకు గుండెను కలిపే అలాయిబలాయి ఇచ్చారు. వాళ్లు తాగిన గిలాసుల్లో నీళ్లు తాగారు. వాళ్లతోపాటు కూచొని బువ్వ తిన్నారు. అగ్రహారాల వీధుల నుంచి వాళ్ల శవాల్ని కూడా తీసుకెళ్లనివ్వని దుష్ట సంస్కృతిని బద్దలుచేస్తూ వాళ్ల శవానికి భుజం పట్టారు. 

మజీదుకు వెళ్తే భుజం భుజం కలిపి నమాజు చదివించా రు. ఆ గరీబుల గుండెలు చెరువులయ్యాయి.. వాళ్లు తమ దేహాల తో కాదు, గుండెలతోనే సూఫీలను అలాయిబలాయి తీసుకున్నారు. వాళ్లలో ఒకరైనారు. తమకు కష్టమొస్తే నష్టమొస్తే మంచి మాటల్తో తమని ఓదార్చే, ఆదరించే ప్రవక్తలయ్యారు సూఫీలు. తమకు రోగమొస్తే, రొష్టొస్తే అభయమిచ్చే దేవుళ్లయ్యారు. దాంతో వాళ్లంతా ముసల్మానులయ్యారు. వాళ్లు ఈ దేశ మూలవాసులు. ద్రావిడులు. మాదిగలు, మాలలు. ఆదివాసీలు. బీసీలు. ఇతర కులాలవారు. 

కేవలం 2 నుంచి 3 శాతం ముస్లింలు మాత్రమే బైటి దేశాల నుంచి వచ్చినవారు. మిగతా 97 శాతం ఈ దేశవాసులే. అందులో అధికభాగం 'అంటబడనివ్వని' కులాలనుంచి, 'వెనకబడేయబడ్డ' కులాలనుంచీ ఇస్లాం స్వీకరించినవారే. ఈ దేశమూలవాసులే. ఈ విషయాన్ని తొక్కిపెట్టి హిందూత్వవాదులు ముస్లింలను బైటి దేశస్తులుగా దుష్ప్రచారం చేశారు. 

నీగ్రోలను, తెల్లవాళ్లను చూడగానే గుర్తుపట్టవచ్చు. ఇరానియన్లను, అఫ్ఘానిస్తానీలను గుర్తుపట్టవచ్చు. మన ఉపఖండంలోనే ఉన్న నేపాలీలను చూడగానే గుర్తుపడతాం. అలాగే బైటి దేశస్తులు ఇక్కడి ముస్లింలను చూడగానే ఇండియన్లుగానే గుర్తుపడతారు! తరువాతే పేరు చెబితే ఇండియన్ ముస్లింలుగా గుర్తు పడతారు. ఎందుకంటే ఆంత్రొపాలజీ ప్రకారం- భూగోళం మీది ఉష్ణోగ్రతలను బట్టి ఒక్కో ప్రాంతంలోని మనుషులు ఒక్కో తీరుగా ఉంటా రు. వారి కపాలం, ముక్కుదూలం, వెన్నెముక ఒక్క తీరుగా ఉంటా యి. 

అందుకే ఇక్కడి దళిత బహుజనులూ-ముస్లింలు, ఆదివాసీలూ-ముస్లింలు, ఇతర కులస్తులూ-ముస్లింలు అన్నదమ్ముల్లాగే కనిపిస్తారు. ఎందుకంటే వాళ్లే ముస్లింలైనారు కాబట్టి. అందుకే ముస్లింలు ఈ దేశ మూలవాసులని ముస్లింవాదం స్పష్టం చేసింది. ఆదివాసీ-దళిత-బహుజనుల 60కి పైగా వృత్తుల్లో ముస్లింలు కొనసాగుతున్నారని కొన్ని నివేదికలు చెబుతుండడం మరొక ఆధారం. దళితవర్గాలు, బీసీల నుంచి ఎక్కువమంది ముస్లింలుగా మారడంతో వాళ్లలో వెనుకబాటు, పేదరికం అలాగే కొనసాగుతున్నాయని అస్ఘర్అలీ ఇంజనీర్ చెప్పడం గమనార్హం. 

ముస్లింలపై హత్యాకాండలు చిన్నప్పుడు 15 ఆగస్టుకు హుషారుగా ఊరేగేది. పెద్దయ్యాక తెలిసింది- స్వాతంత్య్రానికి ముందు దేశవిభజన జరిగిందని, లక్షల మంది ఊచకోత జరిగిందని! ఆంధ్రప్రదేశ్ అవతరణరోజూ ఊరేగేవాళ్లం. తర్వాత తెలిసింది- పోలీస్ యాక్షన్‌లో 50 నుంచి 2 లక్షలమంది ముస్లింల ఊచకోత జరిగిందని! (దానికి సంబంధించిన రిపోర్టును 'ముల్కి' ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచికలో వేసిన తరువాతే ఆ విషయం కొంద రు మాట్లాడ్డం మొదలుపెట్టారు.) 

కమ్యూనిస్టుల ఊచకోతను చెప్పడానికి వారికి ఎన్నో సంస్థలున్నాయి, కాని ముస్లింలకేవి? పోలీస్ యాక్షన్‌లో చంపబడ్డ వాళ్ల కుటుంబాలు, దోపిడీకి గురైనవారి కుటుంబాలు ఎంతగా చితికిపోయి ఉంటాయి? ముస్లింలందరిపై రజాకార్ల పేరుతో దాడులు చేస్తుంటే అన్నీ వదులుకొని పట్టణాలకు పారిపోయి వచ్చేసిన ముస్లింలు ఎంత పేదలైపోయి ఉంటారు! 

'వాళ్లూ వాళ్లూ కలిసి పంచుకున్న ఊళ్ల మధ్య
నా రక్తం ఏరులై పారింది' 
                            -అంటాడు ఖాదర్. దేశ విభజనతో ఇక్కడి సామాన్య ముస్లింలకు ఏం సంబంధం? వాళ్లూ వాళ్లూ కలిసి తీసుకున్న నిర్ణయం ఎంతటి రక్తపాతాన్ని సృష్టించిందో తెలిసిందే. ఉన్న ఊరు-కన్నతల్లిని వదిలి వెళ్లలేక, తమ మూలాల్ని, వేర్లను తెంచుకుని వెళ్లలేక పుట్టిన గడ్డనే హత్తుకుని ఉండిపోయిన ఈ దేశపు ముస్లింలకు ఎంతటి దుర్గతి పట్టించారు ఇక్కడి పాలకులు, హిందూత్వవాదులు. అనుక్షణం అవమానపరుస్తూ మాతృదేశంలోనే వారి మనసుల్ని ఛిద్రం చేశారు. చివరికి రోడ్డుసైడు చిల్లర వ్యాపారాలకు మాత్రమే ముస్లింలు పరిమతమయ్యేలా చేశారు. 

1992లో బాబ్రీ మజీదు కూల్చబడింది. మరోసారి ముస్లింల ఊచకోత. దేశంలోని లౌకికవాదులైన ముస్లింలంతా హతాశులయ్యారు. దేశవ్యాప్తంగా అన్నాళ్లు ముస్లింలుగా మాట్లాడ ని ముస్లింమేధావులు, రచయితలంతా ముస్లిం లుగా మాట్లాడాల్సిన అవసరాన్ని గుర్తించారు. తెలుగు సాహిత్యంలోనూ అదే జరిగింది. మళ్లీ పదేళ్లకు 2002లో గుజరాత్‌లో జెనోసైడ్ జరిగింది. వేలమంది ముస్లింల ఊచకోత సాగింది. దానికి హిందూత్వ సంస్థలు, పార్టీలు నాయకత్వం వహించాయని మీడియా, మేధావులు, ప్రజాస్వామికవాదులు తమ కథనాలద్వారా, పుస్తకాల ద్వారా రికార్డు చేశారు. 

దేశమంతా నిరసన వ్యక్తమైంది. తెలుగు సాహిత్యంలోనూ వందలకొలది కవితలు, కథలు, వ్యాసాలు అచ్చయ్యాయి. తెలుగు కవులు 30 మంది గుజరాత్ వెళ్లి పరిస్థితిని అధ్యయనం చేసి వచ్చారు. వచ్చి సభలు పెట్టారు. 'గుజరాత్ గాయం' పేరుతో 200మంది కవులతో సంకలనం తెచ్చారు. అలాగే నేను అన్వర్ కలిసి 36 మంది ముస్లిం కవులతో 'అజాఁ' పేరుతో కవిత్వం తీసుకొచ్చాం. 17 రోజులు గుజరాత్‌లో తిరిగి వచ్చిన నా అనుభవం అందుకు తోడ్పడింది. 

ఆ సంకలనానికి ముందుమాట రాస్తూ స్మైల్ ఇలా అన్నారు- 'ఈ సంకలనం.. గుండె వుంటే చదవాలి. దిటవు చేసుకు చదవాలి. లేకుండా చదివిన వారికి ఓ గుండె ఏర్పడి స్పందిస్తుంది. వీరి విషా ద కవిత్వ నేపథ్యంలో ఒక ఆలోచన ప్రత్యామ్నాయాల, ఐడెంటిటీ ల దిశగా అంకురిస్తుంది. ఆ అంకురం కోసమే... ఈ సంకలనం.' అన్వర్ తన సంపాదకీయంలో 'దేశపతాకంలోని కాషాయం తెలుపును ఆక్రమించేస్తోంది' అన్నారు. నా గుజరాత్ అనుభవాలన్నీ నా సంపాదకీయంగా రాశాను. ఈ సంకలనం ఒక జాతి మేధాన్ని ప్రశ్నించిన సంకలనంగా సమీక్షకుల చేత రికార్డు చేయబడింది. 

గర్భంతోనున్న ఒక స్త్రీ కడుపుని చీల్చి పిండాన్ని బైటికి తీసి త్రిశూలంతో ఆడించి మంటల్లో వేసిన సంఘటన యావత్ భారతదేశాన్ని కలచివేసింది. అందుకే- 'ఇప్పుడు మాతృగర్భంలోంచే పెకటించబడ్తున్న మా ఉనికి' -అన్నాడు వలీ హుసేన్. మనది సెక్యులర్ దేశం అని ప్రపంచమంతా కొనియాడుతుంటే గుజరాత్ నరమేధం మాత్రం ఇక్కడ హిందూత్వ ఫాసిజం రాజ్యమేలుతున్న ట్లు స్పష్టం చేసింది. దాంతో మనస్తాపం చెందిన మహమూద్ ఇలా అన్నాడు-'మితృలారా! 'కఫన్' కప్పబడిన సెక్యులరిజం జనాజాకు 
మీ భుజం ఖాళీ వుంటే పట్టండి...' గుజరాత్ అంటే ఐదారేళ్ల పసివాడికి పెట్రో లుతాగించి ఆ లేత పెదాలపై అగ్గిపుల్ల అం టిస్తే ఆ చిన్నారి దేహం ఫట్‌మని పేలిపోయిన అమానవీయ దృశ్యం! తల్లుల ముందే పిల్లల్ని పిల్లల ముందే తల్లుల్ని సామూహికంగా చెరిచి ముక్కలుగా నరికి తగలబెట్టిన వైనం! పాడుబడిన బావిలోకి ముస్లింలను విసిరేసి పైనుంచి రాళ్లెత్తేయడం.. ప్రాణభయంతో పారిపోతున్న 70 మందిని టెంపోలోనే సజీవ దహనం చేయ డం..
మాజీ ఎంపి జాఫ్రితో పాటు ఆయన బిల్డింగ్‌లో తలదాచుకోడానికొచ్చిన 100 నుం డి 150 మందిని చంపి తగలబెట్టడం.. తన తల్లిని తగలబెడుతున్న దృశ్యం కళ్లల్లోకి ప్రసరించిన ప్రతిసారీ ఏడేళ్ల ఇమ్రాన్ పెడుతున్న కేక.. దఫన్ చేసుకోడానికి దేహాలు కూడా మిగలని వందలూ వేల బూడిద కుప్పలు! భార్యల కనురెప్పల మీదే భర్తల దహనం.. భర్తల పిచ్చి చూపుల ముందే బరిసెలు దిగబడిన యోనుల రక్తం కేకలు...

5 నుంచి 10 వేలమంది దాకా గుంపుగా కత్తులు, త్రిశూలాలు, పిస్తోళ్లు, యాసిడ్ పట్టుకొని ఒక్కొక్క ఊరిలో ఉన్న ముస్లిం బస్తీల మీద పడి చంపుతుంటే తప్పించుకున్న ఏ కొందరో పారిపోయి చెట్లనకా, గుట్టలనకా, పగలూ రాత్రనకా కిలోమీటర్ల కొద్దీ పరుగులు తీశారు. ఆ అనుభవంలోంచి- 

'రామబాణంతో వాళ్లు/
విష్ణు చక్రంతో/కృష్ణ చక్రంతో వాళ్లు/ శివుని త్రిశూలంలో వాళ్లు/హనుమంతుని గదతో వాళ్లు.../అయ్ అల్లాహ్!/ఈ చేతులు ఉట్టి దువాకేనా?!' -అజాఁ సంకలనం తిరిగి ఊర్లలోకి వద్దామంటే హిందూత్వవాదులు రకరకాల షరతులు విధిస్తే బిత్తరపోయిన ముస్లింలు ఊరిబైటే ఉండిపోయారు- 'దళిత వాడలు ఊర్లలో కలుస్తున్న ఆనం దం/ఒళ్లంతా పారక ముందే/ఇప్పుడక్కడ ఊరి బైట/ముస్లిం వాడలు వెలిశాయి' అని ఆవేదన పడ్డాడు ముస్లిం కవి. ఇప్పుడీ దేశాన్ని ఏ జీవజలంతో కడిగినా పోని రక్తపు వాసన/కాళ్ల కింది నేలే కాదు/ కరిగిన ఆకాశం కూడా మురికైపోయింది' అం టాడు ఖాదర్ షరీఫ్. 'నీకు నాకు మధ్యా రక్త సంబంధం లేదంటావా?/గుండెల్ని పెకిలించి/పొట్టలు చీల్చి /యోనుల్లో ఆయుధాలు పొడిచి/ఇవ్వాళ నువ్వు చావుల విందు చేసుకొనుండొచ్చు/కానీ 'నన్ను' హత్య చేయలేవు/అనంతంగా సాగే జీవనదిని/నేను బతకడమే కాదు/నిన్ను పుట్టించి బతికించేదీ నేనే..!/అయినా/స్త్రీ తప్ప మగాణ్ణి క్షమించేదెవరు?/ఎన్నటికీ ప్రపంచం/నా రొమ్ము తాగుతున్న పసిబిడ్డే..!' -అన్నది షాజహానా.

'హమ్ మర్కే భి జగాతే హెఁౖ సోయీ హుయీ దునియాఁ కో' -అన్నాడు అలీ. నిజమే! వేలమంది ముస్లింలు హత్య చేయబడితే గాని భారతదేశం ఉలిక్కిపడలేదు! మన లౌకికవాదులూ, ప్రజాస్వామ్యవాదులూ, మార్క్సిస్టులూ, మావోయిస్టులూ అంతా దిగ్గున లేచి కూర్చున్నారు. వేలమంది ముస్లింల బలిదానం జరిగితేగాని ఈ దేశంలో హిందూత్వవాదు లు ఏం చేయబోతున్నారో అర్థం కాలేదు. 
అందరూ మేల్కొన్నట్లే అనిపించింది. కానీ మతోన్మాదుల్ని నిలువరించే, కనీసం అది చేసే దుష్ట చర్యల్ని నిలువరించే కార్యక్రమాన్ని కూడా ఎవరూ చేపట్టలేదు. ఊరకే ఉపన్యాసాల్లో హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతాం అంటే సరిపోతుందా? కొన్ని సభలు చేస్తే పుస్తకాలేస్తే మన బాధ్యత నెరవేరినట్టేనా? అందుకే ప్రధాని పదవికి మోడీని ముందుకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. గుజరాత్ ముస్లింల నరమేధం సాక్షిగా మోడీని ఎన్నటికీ ఈ దేశ ప్రజాస్వామిక, లౌకికవాదులు అంగీకరించరని ఆశిద్దాం. లేదంటే ఈ దేశం మరెన్నో గుజరాత్‌లను చూడాల్సి వస్తుంది. 
                                                                                                       - స్కైబాబ
(ఆంధ్ర సారస్వత పరిషత్‌లో 14.9.11న 'ముస్లింవాద కవిత్వం'పై ఆలూరి బైరాగి స్మారకోపన్యాసంలోని కొన్ని భాగాలు-ఒక కోణం)

Friday 14 October, 2011

QABZA



ఊటగ ఉర్కుతున్న
గని ఉర్కొస్తలె
లాగు జేబుల్ల పెద్ద పెద్ద తాళాలు
బరువుకు కాళ్లు కదుల్తలెవ్‌
సుట్టు ఎనుగు పాత్తుండు
అరెరె! ఆళ్లు మునిగిపోతున్నరు
ఉర్కిపొయ్యి బచాయించాలె
ఉహుం.. ఊటగ ఉర్కొస్తలె
కాళ్లు బోదకాల్లలెక్క ఇంత లావెక్కిపోతున్నయ్
అడుగు కదుల్తలె
ఎట్ల
యాడికాడ కబ్జా పెడ్తుండు
ఎటు పోతెట్టు లేదు
నా ఓళ్ల చేతుల్ల ప్లకార్డులు
'జాగా ఎవన్ది - జాగీ రెవడు'
అగొ, దండుబాటకు రేగ్గంప కొడ్తుండు
ఉంటాఉంటే ఇంకా కషాయమెక్కుతుండు
ఝట్ న ఎనుగుకు పామై ఏలాడుకుంట కనబడ్తుండు
బండ్లబాటంత బుర్దబుర్ద
ఎండిపొయ్యి దడుసుకుంటట్టు
మనిషిపట్టేంత పెద్దగ నెర్రెలు ఇచ్చుకుంటున్నది
అగ్గొ కత్తుల్తోటి ఎంటబడ్తుండు
పిల్ల బాటల్నిండ ముండ్ల తీగెలు
చూస్తుండంగనె పెరిగొస్తున్నయ్
ఒక్కోపాలి బొల్లిగడ్డంతోటి కండ్లబడ్తుండు
మల్ల ఆడే ఒల్లంత కాషాయం పూస్కొని-
అంతల్నె విభూతి రాస్కొని ఎగుర్కుంట వస్తుండు
ఇంకోపాలి సుక్కల్ సుక్కల జండాతోని
బూగోళానికంత ధమ్కి ఇచ్చుకుంట
యాడికాడికి ఎనుగు పాత్తుండు
బాటలన్ని మూసేస్తుండు
ఎట్ల
నా వోళ్లు మునిగిపోతున్నాలె
ఎట్లన్న ఉర్కాలె
కాళ్లు కదుల్త లెవ్వు
అయ్ నా ఉర్కాలె
ఎటోదిక్కు ఎనుగుతొక్కి
కాలిబాటన్న ఎయ్యాలె

Tuesday 4 October, 2011

సింగిడి కవుల పొలికేక



సింగిడై గొంతెత్తిన కవులు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.. సకల జనులతో పాటు నినదించారు.. హైదరాబాద్ దిల్ హై హమారా అని ఎలుగెత్తి చాటారు.. బి.నర్సింగరావు, అమ్మంగి వేణుగోపాల్, నాళేశ్వరం శంకరం, వజ్జల శివకుమార్, దెంచనాల శ్రీనివాస్, సిద్ధార్ధ, ఆయిల సైదాచారి, పగడాల నాగేందర్, ఊడుగుల వేణు, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, సంపతి సోమయ్య, గాదె వెంకటేష్, ఎస్.జగన్ రెడ్డి, అంబటి వెంకన్న, వేముగంటి మురళీకృష్ణ, దాసరాజు రామారావు, దున్న యాదగిరి, రమేష్ హజారి, మోహన్ రుషి, రాపోలు సుదర్శన్, జ్వలిత, వెంకటేష్ చౌహాన్, వెంకట్ యాదవ్, మడిపల్లి రాజ్ కుమార్ తదితర కవులు, సంగిశెట్టి శ్రీనివాస్, మిమిక్రి జనార్ధన్, ఇంద్రవెల్లి రమేష్, జుగాష్, దాసోజు కృష్ణమాచారి, తెగించి కొట్లాడుడే పాటగాడు, సింగిడి కన్వినర్లు స్కైబాబ, పసునూరి రవీందర్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.