Monday 19 March, 2012

ఇన్‌సైడర్‌ తీసిన క్లోజప్‌

(ఇవాల్టి 'సూర్య' సాహిత్య పేజి లో..)

ముస్లిం జీవనదృశ్యాల్ని మాటలతో చిత్రించిన కథలు అధూరె. అధూరె అనే ఉర్దూ పదానికి అసంపూర్ణమైన అని, పూర్తికాని అని అర్థం. ఇందులోని కథలు నిజంగా ముగింపు చేయకుండా సగంలో ఆపినట్లు కనిపిస్తాయి. తర్వాతి విషయాన్ని పాఠకునికి వదిలి పెడతాయి. కాని రచయిత తను చెప్పదలచుకున్న విషయం మాత్రం ముగుస్తుంది. కథని ఆపడంలో మంచి కళాత్మకతనే కాదు, పరిణతినీ స్కైబాబ ప్రదర్శిస్తాడు.

Adhoore-Mukhchitramకథా రచనలో తెలుగులో ఒక కొత్త తరంగం వచ్చింది. అస్తిత్వ వాద కథల్లో కూడా ఇది నవ తరంగం. అదే స్కైబాబ అధూరె కథా సంకలనం. తెలుగు ముస్లింల వ్యధార్త జీవన యథార్థ చిత్రాలను కళాత్మకంగా చిత్రించిన కథలివి. ఒక అత్యంత నిపుణుడైన సినిమాటోగ్రాఫర్‌ కళాత్మకంగా చిత్రించిన దృశ్య కళాఖండం అనిపించేలా ముస్లిం జీవనదృశ్యాల్ని మాటలతో చిత్రించిన కథలు అధూరె. అధూరె అనే ఉర్దూ పదానికి అసంపూర్ణమైన అని, పూర్తికాని అని అర్థం. ఇందులోని కథలు నిజంగా ముగింపు చేయకుండా సగంలో ఆపినట్లు కనిపిస్తాయి. తర్వాతి విషయాన్ని పాఠకునికి వదిలి పెడతాయి. కాని రచయిత తను చెప్పదలచుకున్న విషయం మాత్రం ముగుస్తుంది. కథని ఆపడంలో మంచి కళాత్మకతనే కాదు, పరిణతినీ సై్కబాబా ప్రదర్శిస్తాడు. 

ఈ రచయిత సామాజిక నేపథ్యాన్ని సంభావించి తర్వాతనే ఈ కథల్ని చూడాలి. స్కైబాబ అంటే ఎస్‌.కె. యూసుఫ్‌ బాబా. ఎస్‌.కె. అనే ఇంగ్లీషు అక్షరాలు తన పేరుకు ముందు రావడంతో ఎస్‌కెవై ‘ స్కై’ అని చిత్రంగా మార్చుకొని స్కైబాబ అనే పేర రచనలు చేస్తున్న యూసుఫ్‌ బాబా నల్లగొండ జిల్లాకు చెందిన తెలుగు ముస్లిం, కవి, రచయిత. గడచిన దశాబ్దంగా ఆయన కవితలు, కథలు రాస్తూ తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడయ్యాడు. అటు మంచి తెలుగు సాహిత్యాన్ని ప్రచురించడంలోనూ మంచి కృషి చేస్తున్నాడు. అంతే కాదు, ముస్లిం వాద సాహిత్యం అనే దాన్ని తెలుగులో అస్తిత్వ సాహిత్యాలలో ఒక పాయగా తీసుకొని వచ్చి దానికి ప్రత్యేకమైన గుర్తింపు సాధించడంలో కృషి చేసిన తొలి సాహిత్యకారుడు. గడచిన దశాబ్దంలో సై్కబాబా చేసిన సాహిత్యకృషి వల్లనే నేడు తెలుగులో ముస్లిం సాహిత్యం అనే ప్రత్యేక వింగడింపు ఏర్పడడానికి మార్గం సుగమం అయింది. 

అఫ్సర్‌, యాకూబ్‌ కవిత్వంలో ముస్లిం వాద కవిత్వం కూడా ఉంది. వారు దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే రాస్తున్నారు. కాని ఆ కవులు మరింత విస్తృత సాహిత్య నేపథ్యంలో రాస్తున్నారు. అంతే కాదు, ముస్లిం వర్గం నుండి తెలుగు సాహిత్యంలో విశేషించి ఆధునిక వచన కవిత్వాన్ని రాసిన కవులు ఇంతకు ముందే వజీర్‌ రెహ్మాన్‌, ఇస్మాయిల్‌, స్మైల్‌, దేవిప్రియ, సుగమ్‌ బాబు వంటి వారు ఇంకా కొందరున్నారు. అంతకు ముందు కూడా సంప్రదాయ కవిత్వం రాసిన ముస్లింలు తెలుగులో ఉన్నారు. కాని స్కైబాబా చేసిన రచనలు అతను చేస్తూ వచ్చిన నేపథ్య కృషి ‘ముస్లిం వాద సాహిత్యం’ అనే ప్రత్యేకమైన వింగడింపుకు బాగా తోడ్పడింది. తర్వాత వచ్చే ఆధునిక తెలుగు సాహిత్యచరిత్ర రచనలో ఈ వింగడింపులో ఈ విషయం స్పష్టంగా ఉండవలసి వస్తుంది. 

కథా రచనలో ముఖ్యంగా భాషని ఎన్నుకోవడంలో ఇంతకు ముందు రచయితలు చాలా ప్రయోగాలు చేశారు. ఉత్తరాంధ్ర మాండలికంలో, రాయలసీమ మాండలికంలో, తెలంగాణ మాండలికంలో, గోదావరి జిల్లాల యాసలో కథలు, నవలలు వచ్చాయి. కానీ ఒక ప్రత్యేక సామాజిక వర్గం మాట్లాడే భాషలో కథలు రావడం స్కైబాబాతోనే ప్రారంభం అయిందని చెప్పవచ్చు. ఇది డయలెక్ట్‌ కాదు, భాషాశాస్త్రంలో దీన్ని ఇడయలెక్ట్‌ అంటారు. అంటే వర్గమాండలికం అని తెలుగులో అనాలి. ఇలా వర్గమాండలికంలో ఎవరైనా ఇంతకు ముందు కథలు రాశారేమో కాని, ముస్లిం వర్గమాండలిక భాషకు మంచి సాహిత్య స్థితిని సాహిత్య గౌరవాన్ని తెచ్చిన గౌరవం కీర్తి స్కైబాబాకు దక్కవలసి ఉంది. 

ఈ కథల్లో ముస్లింలు మాట్లాడేది కృతక భాష అని అనడం అవగాహనా లోపమే. వారిదైన సజీవ సామాజిక సందర్భంలో మాట్లాడే సజీవ భాష అది. నల్లగొండ జిల్లాలో తెలుగు సమాజంలో జీవించే ముస్లింలు బయటికి వచ్చి వ్యవహరించే సజీవమైన తెలుగు భాష ఒక వర్గమాండలికంగా రూపొందింది. ఈ సహజ భాషలోనే స్కై బాబా తన కథల్ని రాశాడు. మాండలికమే కాదు, నేడు వర్గమాండలిక భాష అస్తిత్వ సాహిత్యంలో ప్రముఖపాత్ర పోషిస్తూ ఉంది. కారణం ఆ రచయితలు ఆ కులాల సామాజిక నేపథ్యాన్ని ప్రతిభావంతంగా పోషించే పనిచేయడమే. స్కైబాబా కథల్లోని ఈ భాషా నేపథ్యం, ఈ కథలకున్న సామాజిక నేపథ్యం ఈ కథల్ని తెలుగు సాహిత్యంలో ఒక కొత్త కెరటంగా నిలుపుతున్నాయి. ఇవి ఒక ప్రత్యేక స్రోతస్సుగా రూపొందాయి. 

స్కైబాబా చిత్రించిన పాత్రలు జీవం ఉట్టిపడుతూ రోజూ మన మధ్య కనిపించే ముస్లిం వ్యక్తులుగా మనకు తారసపడే వారై కనిపిస్తారు. మనకు తెలిసిన ముస్లింల జీవితాల్లో కూడా మనకు తెలియని కష్టాలు, కన్నీళ్ళగురించి విలపించి వివరిస్తాయి ఈ కథలు. ఇందులోని పాత్రలు సుల్తానా, జానీబేగం, సల్మా, జరీనా, ఫాతిమా, షాహీన్‌, పర్వీన్‌, షాజీదా, సైదాబేగం, ముంతాజ్‌ బేగం పాత్రలు తెలుగు సాహిత్యంలో చాలాకాలం నిలబడి ఉంటాయి. కారణం కవి నిజ జీవితంలోనికి తొంగిచూచిన తీరు, తాను దర్శించిన జీవన వాస్తవాల్ని ఉన్నదున్నట్లు మాత్రమే కాకుండా దాన్నొక అద్భుత కళగా మలచిన తీరు! ఇదే సన్నపోగారు శిల్పంపని. ఇవి ఈ కథల్ని కలం కాలం గుర్తుండేలా చేస్తాయి. ఇందులో పాత్రలు చదివినవారి మనస్సులో ముద్రవేసుకోవడం ఇందులో ఒక గుణంగా కనిపిస్తుంది. 

ఆంధ్రప్రదేశ్‌ ఉగ్రవాదానికి చాలాసార్లు మూల్యం చెల్లించింది. గోకుల్‌ ఛాట్‌ లో, లుంబినీ పార్కులో, మక్కామసీద్‌లో మన రాష్ట్రాని కి తగిలిన గాయాలు హిందూ ముస్లిం ప్రజల మధ్య తీవ్రమైన అగాథాన్ని మిగి ల్చాయి. ఏ నేరం తెలియని అమాయ కులైన లక్షలాది ముస్లింల దైనందిన జీవితం కూడా దీనివల్ల ఛిద్రం అయింది. ఒక్కడి తప్పుకు వేల మంది మూల్యం చెల్లించుకోవలసి వస్తూఉంది. ఈ జీవన స్థితిని ‘దావా’ అనే కథలో అత్యంత హృద్యంగా చిత్రించాడు స్కైబాబా. ముం తాజ్‌ బేగం ఒక అమాయకుడైన యువ కుడైన ముస్లింకు తల్లి. పోలీసులు ఉగ్రవాద చర్యలపై అనుమానంతో అరెస్టు చేసిన కొందరు ముస్లిం యువకుల్లో ఒక యువకుని తల్లి. 

ఏ పాపం ఎరుగని తన కొడుకుని విడిపించుకోవడానికి ఏ పలుకుబడీ లేని ఒక బీద ముస్లిం తల్లి చేసిన హృదయవిదారకమైన ప్రయత్నాన్ని ఇందులో ప్రతిభావంతంగా చిత్రించాడు రచయిత. ఈ స్థితిని రచయితే కథ మధ్యలో ఒక వాక్యంలో ఇలా చెప్తాడు ‘గూట్లోంచి కిందబడ్డ తన పిల్ల కోసం ఒకటే అరుసుకుంట అటు ఇటు చక్కర్లు కొడుతున్నది కాకి’ అని. ముంతాజ్‌ బేగం ఎంతో ప్రయత్నంచేసీ పోలీసుల కాళ్ళ వేళ్ళా బడీ తన కొడుకుని విడిపించుకోలేక పోయింది. కొద్ది రోజుల తర్వాత పోలీస్‌ స్టేషన్‌ నుండి తన కొడుకును ఎక్కడికో మరొక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకుపోయారని తెలుసుకుంటుంది ఆ తల్లి. ఆ తల్లి గుండె పగిలి చక్కరొచ్చినట్లు అక్కడనే కూలబడిపోయింది- అది తెలిసి. 

ఇక్కడ కథ చివరి వాక్యంగా రచయిత ‘కాకిపిల్లను కుక్కలు ఎక్కడికో ఎత్తుకు పోయినయ్‌’ అని రాసి కథను ఆపాడు. ఇక్కడున్న సింబాలిజం గురించి కథాకళ గురించి ప్రత్యేకించి చెప్పవలసినపని లేదు. ఇది పాఠకుల హృదయాల్ని ప్రత్యక్షంగా తాకుతుంది. ఈ కథలకు పాఠకులు ఎవరు అని అనుకున్నప్పుడు కొన్ని ప్రశ్నలు మనసును వేధిస్తాయి. ఇందులో ఉర్దూ పదాల సమ్మేళనం చాలా విస్తారంగా ఉంది. తెలుగు పాఠకులు అందరూ చదవాలనే ఉద్దేశం రచయితకు ఉంటే తప్పనిసరిగా ఇందులోని తొంబై శాతం పదాలకు ఫుట్‌ నోట్‌లో అర్థాలు ఇవ్వాలి. 

pulliతెలుగు వారందరికీ అర్థమయ్యే ఉర్దూ పదాలు ఇందులో కొన్నే ఉన్నాయి. ఉర్దూ బాగాతెలిస్తే తప్ప ఈ కథలు అధూరాగనే అర్థం అవుతాయి. తన ఉద్దిష్ట పాఠకులు ఎవరు అనే ప్రశ్న రచయిత వేసుకున్నట్లు కనిపించదు. తదుపరి ప్రచురణలో ఈ లోపాన్ని స్కైబాబా సరిదిద్దుకోవలసి ఉంది. ఒక ఇన్‌ సైడ్‌ అబ్జర్వర్‌ చేసిన పరిశీలన, ఒక క్లోజప్‌ దృశ్యం ‘అధూరె’. కథలు చదవడం ముగిసిన తర్వాత స్కైబాబా నుండి ఏ దిల్‌ మాంగే మోర్‌ అని అనిపిస్తుంది. మహ్మద్‌ రఫీ గొంతులోని ఏ దిల్‌ అభీ భరా నహీఁ అని మనసు అధూరాగా మిగిలిపోతుంది

No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియజెయ్యండి