(ఇవాళ 'సూర్య' దినపత్రిక లో వచ్చిన వ్యాసం)
శీర్షిక చూడగానే ఇస్లాం విశిష్ఠతో, ఖురాన్ ప్రాశస్త్యమో వస్తువు కావచ్చునని అనుకునే అవకాశముంది. వస్తువును సూటిగా చెప్పని శీర్షికను ఎన్నుకోవటం, వస్తువుకు సుదూరమైన అంశాన్ని శీర్షికగా నిలపటం, శీర్షికకు అసంబద్ధమైన వాక్యాలతో కవితను ఆరంభించటం మొదలైనవి పాఠకుడిలో ఆసక్తిని ఇనుమడింపజేసే వ్యూహాలు.ఈ కవితా శీర్షిక ఎత్తుగడ కూడా అలాంటి ఒక వ్యూహమే.

‘‘కన్నీటి దారాల్తో జీవన వస్త్రానికి మాసికలేస్తూ/ తరాల చీకటి కమ్మేసిన గోషాలో/ పాలిపోయిన చంద్రశిలా దేహంతో/ అనుక్షణం/ ‘బిస్మిల్లా ఇర్రహ్మా నిర్రహీమ్’ అనే కదులుతుంది అమ్మీజాన్’’.
మొదటి పంక్తి దారిద్య్రాన్ని, రెండో పంక్తి మత సంప్రదాయాలు, కట్టుబాట్ల వల్ల కలుగుతున్న దుఃఖాన్ని సూచిస్తాయి. ఈ రెండింటి ఫలితం ‘పాలిపోవటం’. ‘బిస్మిల్లా ఇర్రహ్మా నిర్రహీమ్’ అంటే ‘దయామయుడైన కృపా హృదయుడైన అల్లా పేరుతో ఆరంభిస్తున్నాను’ అని అర్థం (ఈ భావానికి సంఖ్యా రూపమైన సంకేతమే ‘786’). ప్రతి పనిని ఆరంభించే ముందు చేసే దైవనామస్మరణ అన్నమాట. ఒకవైపు లేమివల్ల, మరోవైపు మత నియమాల వల్ల ఎన్ని ఇబ్బందులెదురైనా ఆమె అల్లా పట్ల విశ్వాసంతోనే చరిస్తున్నదని సారాంశం.
మొదటి పంక్తిలోని ‘కన్నీటి దారాలు’ అనే అచ్చ తెలుగు రూపకం ‘జీవన వస్త్రం’ అనే సంస్కృత రూపకం వెంట వెంట ప్రయోగించడంలో ఉన్న ‘భేదకత’ గమనింపదగినది. తెలుగు, సంస్కృత రూపక సమాసాలతో కూడిన రూపకాలంకారమిది. వస్తువులోని వైరుద్ధ్యాలకు దీనిని ఆలంకారికమైన సూచనగా భావింపవచ్చునేమో! ‘చంద్ర శిలా దేహం’ అనే సంస్కృత సమాసం ఆమె శరీర ఛాయను తెలుపడంతో పాటు, దేహాంతరంగాలకు ఒక ఉదాత్తతను ఆపాదింప జేస్తున్నది. ‘గోషా’ అనే ఆమె ఉడుపులోని వర్ణమే చీకటికి పోలిక. అనేక తరాలుగా ముస్లిం స్ర్తీలు గోషా వల్ల అనుభవించిన అంతర్గత వేదనకు తన తల్లి గోషాను ప్రతీకగా చెబుతున్నాడు కవి. అనేక తరాల చీకటి కమ్మినప్పుడు- ఒక్కనాటి (రాత్రి) చంద్రుడు ఎదుర్కొనలేక ‘పాలిపోవటం’ అతిశయోక్తి కాదు. ‘కదులుతుంది’ అనే క్రియ పక్కన చేర్చడం వలన కవితలో ‘అమ్మీ జాన్’కు ప్రాధాన్యం వచ్చింది.

‘మా కోసం ‘దువా’ చేసి చేసి/ అమ్మీ గొంతు తడారిపోతుందే తప్ప../ ముందు కూర్చున్న నీడ విస్తరించి/ కటికి రాత్రై పరచుకుంటుందే తప్ప...’!పశ్చిమాభిముఖులై ప్రార్థిస్తారు కనుక ఫజర్, జొహార్ అనే ఉదయ, మధ్యాహ్న ప్రార్థనల్లో (కూర్చుని దువా చేసేటప్పుడు) నీడ ముందు కూర్చున్నట్లే ఉంటుంది. ముందున్న ఆమె నీడే సాంద్రతిమిరంగా పరచుకున్నదేమో అన్నట్లున్నదంటూ కారణం కాని దాన్ని కారణంగా ఊహిస్తాడు (ఉత్ప్రేక్ష). కటికి రాత్రి, కటికి చీకటి అనాలి. ‘కటికి’ అంటే అధికం, కఠినం, సాంద్రం అని అర్థాలున్నాయి. అది అలా ఉంచితే- ‘తడారిపోతుందే తప్ప...’, ‘పరచుకుంటుందే తప్ప...’ అంటూ అర్థాంతరంగా, అసంపూర్ణంగా వాక్యాలను వదిలేసి, తాను కోరుకుంటున్నది ఏది జరగడం లేదో దానిని పాఠకుల ఊహకే వదిలేశాడు. ఆవేశం, ఉద్వేగం, కోపం, దుఃఖం మొదలైన మానసిక స్థితులలో వాక్యాన్ని పూర్తి చేయలేక హఠాత్తుగా ఆపేయడాన్నిఆంగ్లకవిత్వ పరిభాషలో‘అపోసయ్యొపీసిస్’(Aposiopesis ) అంటారు. 'Aposiopesis (bicoming silent) is a figure of speech wherein a sentence is deliberately broken off and left unfinished, the ending to be supplied by the imagination, giving an impression of unwillingness or inability to continue.' (see: wikipedia- Literary terms)

ఈ అసహాయతకు మూలమైన ఆర్థిక, ఆర్థికేతర కారణాలను తెలుసుకోవడం కష్టం కాదు. చెల్లెలి కన్నీళ్ళ మీద వణికే దృశ్యమై అమ్మ తల్లడిల్లే దృశ్యానికి, అమ్మీ దోసిలిలోని కన్నీటి తడిపై ఏ దేవుడూ సాక్షాత్కరించకపోవటం అనే మొదటి దృశ్యానికి అంతర్గత సంబంధమున్నది. ఒకేరకమైన పోలికలతో భిన్న దృశ్యాలను సృష్టించి, భిన్న ప్రయోజనాలను కవి సాధించాడు. తన దోసిలిలోని కన్నీటి తడిలో ఏ దేవుడూ సాక్షాత్కరించకపోగా, తన కూతురి కన్నీళ్ళలో తానే తల్లడిల్లుతూ వణుకుతున్న దృశ్యంగా మిగలడంలో నిస్సహాయత, దైన్యం ధ్వనించాయి.
‘కాన్వెంట్కు బదులు కార్ఖానాకెళ్ళే తమ్ముడు/ సాయంత్రానికి కమలిన దేహంతో అల్లుకుపోతే/ పగిలిన లేత స్వప్నం గుచ్చుకొని విలవిల్లాడేది అమ్మే’- కాన్వెంట్కు బదులు తమ్ముడు కార్ఖానాకెళ్ళాల్సి రావడం వెనుక ఉన్నది కూడ అబ్బాజాన్ ‘అసహాయతే’. కూతురి దీనస్థితికి, కొడుకు బాలకార్మికుడిగా మారవలసిన దుస్థితికి మొదట తల్లడిల్లేది, విలవిల్లాడేది అమ్మే అనేది సారాంశం.‘కడుపులో మా భారాన్ని మోసి/ కష్టాల మా బాధ్యతలు మోసి/ కళ్ళ గుమ్మానికి కట్టిన పరదాల వెనుక పాతివ్రత్యాన్ని మోసి/ తన కనుబొమ్మల నెలవంకల మీద/ చీకటి రాశుల్ని మోస్తున్న అమ్మ/ చివరకు ఖురాన్ను మోసే ‘రెహాల్’లా మిగిలిపోవలసిందేనా’?- ఒక తూగు కలిగిన వాక్యాంశాల్ని వరుసగా పేర్చి, కవి తన ఆవేశాన్ని వ్యక్తీకరించాడు. ఉద్వేగాన్ని చేకూర్చాడు.
పరుషాలలోని ఆద్యక్షరమైన ‘క’ కారం తొలి నాలుగు పాదాలలో పలుమార్లు ఆవృత్తం కావడం వలన కవి దృష్టికోణానికి తగిన పారుష్యం చేకూరిందనిపిస్తుంది. కనుబొమలను ధనస్సుతో పోల్చడం తెలుగు కావ్య సంప్రదాయం. ‘కనుబొమల నెలవంకల మీద చీకటి రాశుల్ని మోయడం’ అనే మాటలు- ‘తరాల చీకటి కమ్మేసిన గోషా’ అనే ఈ కవితలోని తొలి దృశ్యంతో అనుసంధిస్తాయి. నెలవంక అనే పోలిక ద్వారా భంగ్యంతరంగా ఇస్లాం మత సంకేతాలైన చాంద్ తారలు స్ఫురిస్తాయి. కాలానుగుణంగా ఆచార సంప్రదాయాలలో మార్పులను అంగీకరించని ‘ధర్మాల’ను మోస్తూ అనామకంగా అణగారుతున్న అమ్మను ‘రెహల్’తో పోల్చాడు.
‘రెహల్’ దివ్యత్వానికి, పవిత్రతకు సంకేతమవుతూనే మరోవైపు మరో అంశాన్ని కాపాడుతూ, దానికి మరింత గౌరవాన్ని కలిగిస్తూ తాను అనామకంగా మిగిలిపోవడానికి ప్రతీకగా నిలచింది. ఒక ముస్లిం తల్లి జీవితం ఛిద్రం కావడానికి దారిద్య్రం, కఠినమైన మత ధర్మాలే కారణాలని సై్కబాబా ఈ కవితలో సూచించాడు. కవితలో ఆద్యంతం ఆ రెండింటిని సమాంతరంగా ధ్వనిస్తూ వచ్చాడు.ముస్లిం స్ర్తీ కంఠ స్వరంతోనే స్కైబాబ రాసిన మరో కవిత ‘సాంబా’. ఆ కవితలోని ‘నేను నేనుగా కాదు/ ఒక మతానికి చిహ్నమై ఆరిపోతున్నానే...’ అనే మాటలను ప్రస్తుత కవితలోని ముగింపుకు అన్వయించుకుంటే కవి ఉద్దేశం మరింత స్పష్టమవుతుంది. ‘బిస్మిల్లా...’, వజా, మోకరిల్లి ప్రార్ధించడం, దువా అనే అంశాల క్రమపరిణామంలో చివరకు ఖురాన్ను ప్రస్తావించి, తద్వారా ‘రెహల్’తో పోలిక చెప్పాడు.

-పెన్నా శివరామకృష్ణ
No comments:
Post a Comment
మీ అభిప్రాయం తెలియజెయ్యండి