Sunday 20 November, 2011

గుజరాత్ ముస్లింలకు అండగా నిలుస్తున్న ధీరులకు మద్దతు తెలుపుదాం


సాహసమే సాక్షిగా...

గుజరాత్‌...అన్న మాట చెవిన పడితే చాలు! గోద్రా అనంతర హింసరచన గుర్తుకొస్తుంది!! మతోన్మాద శక్తుల పదఘట్టనలు వినిపిస్తాయి!!! గాంధీ పుట్టిన రాష్ట్రంలో గుంపులకొద్దీ గాడ్సేలు కనిపిస్తారు. అహింస, శాంతి, పరమత సహనం ప్రబోధించిన జాతిపిత జన్మస్థలం హింసకు పర్యాయపదంగా మారిపోవడం అగుపిస్తుంది. మైనార్టీలపై సాగిన నాటి మారణకాండను అడ్డుకుని ఆదుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడియే అందుకు వెన్నుదన్నుగా నిలిచారని తెల్సినప్పుడు మనసున్న ప్రతి హృదయం బాధతో మూల్గుతుంది. 'అందుకు బలమైన సాక్ష్యమిదుగో...' అంటూ పోలీసు అధికారి సంజీవ్‌భట్‌ తన బలమైన గొంతుకను వినిపించడం, సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసి ముఖ్యమంత్రికే సవాల్‌ విసరడం చిన్న విషయం కాదు. అందుకు పూనుకున్న సంజీవ్‌భట్‌ గుజరాత్‌ ప్రభుత్వం నుంచి ఎదురౌతున్న కక్ష సాధింపు చర్యలను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఆ వివరాలు ఈ వారం అట్టమీద కథలో....
ప్రఖ్యాత బాలీవుడ్‌ సినీ నిర్మాత మహేష్‌భట్‌ మాటల్లో చెప్పాలంటే 'సత్యం కోసం పోరాటం సాగిస్తున్న నిజమైన కథానాయకుడు సంజీవ్‌భట్‌'. ఆయన, ఆయన కుటుంబం సత్యం కోసమే పోరాటం సాగిస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా అఫిడవిట్‌ దాఖలు చేయగానే ఆయనపై కక్ష్యసాధింపులు మొదలయ్యాయి. ఉద్యోగం నుంచి తీసేశారు. జైలుకు పంపారు. మానసికంగా ఎంతో వేదనకు గురిచేశారు. ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా ఆయన అదరలేదు. బెదరలేదు. సాహసమే సాక్షిగా న్యాయ పోరాటం సాగిస్తున్నారు. పోలీసు అధికారుల సంఘంతో పాటు అనేక ప్రజాసంఘాలు కూడా ఆయనకు అండగా నిలిచాయి. జైలు నుంచి విడుదలై తన పోరాటాన్ని సాగిస్తున్న సంజీవ్‌భట్‌ 1963 డిసెంబర్‌ 21న ముంబయిలో జన్మించారు. అహ్మదాబాద్‌లోని సెయింట్‌ జేవియర్స్‌ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత బొంబాయి ఐఐటిలో చేరారు. అక్కడ పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాక 1988లో ఇండియన్‌ పోలీసు సర్వీస్‌లో చేరారు. గుజరాత్‌ కేడర్‌లో నియమితులయ్యారు. సంజీవ్‌ గొప్ప అథ్లెట్‌ కూడా. పలు జిల్లాలు, పోలీసు కమిషనరేట్లు, విభాగాల్లో ఆయన 23 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. 1999-2002 మధ్యకాలంలో రాష్ట్ర ఇంటలిజెన్స్‌ బ్యూరో డిప్యూటీ ఇంటలిజెన్స్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్‌గా ఆ సమయంలో గుజరాత్‌ అంతర్గత భద్రత గురించిన అన్ని విషయాలు ఆయన పర్యవేక్షించేవారు. సరిహద్దు భద్రత, తీరప్రాంత రక్షణ, గుజరాత్‌లోని కీలక కార్యాలయాలు, సంస్థల భద్రతను కూడా ఆయనే చూసేవారు. ముఖ్యమంత్రి భద్రతతో సహా అనేకమంది వివిఐపి భద్రతనూ పర్యవేక్షించేవారు. అంతేకాదు కేంద్ర నిఘా సంస్థలు, సైనిక బలగాలతో నిఘా సమాచారాన్ని అందిపుచ్చుకునేందుకు నోడల్‌ ఆఫీసర్‌ హోదాలోనూ పనిచేశారు.
2002 ఫిబ్రవరి 27న గోద్రా పట్టణంలో సబర్మతి ఎక్స్‌ప్రైస్‌ ఎస్‌-6 బోగీ తగలబడింది. 58 మంది విశ్వ హిందూ పరిషత్‌ కరసేవకులు చనిపోయారు. ముస్లింలే ఈ రైలును తగులబెట్టారన్న ఆరోపణలతో కమలదళాలు గుజరాత్‌లో రావణకాష్టం సృష్టించాయి. గోద్రా ఘటనలో 58 మంది మాత్రమే చనిపోగా.. పరివార్‌ శక్తులు సాగించిన మారణకాండలో వేలాది మంది ముస్లింలు హత్యకు గురయ్యారు. వేలాది మంది ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. పోలీసు కాల్పుల్లోనే 200 మంది దాకా చనిపోయారు.
ఫిబ్రవరి 27న ఏం జరిగింది?

సంజీవ్‌ భట్‌ సుప్రీంకోర్టుకు దాదాపు 600 పేజీల సాక్ష్యాధార సహిత అఫిడవిట్‌ను దాఖలు చేశారు. సారాంశం ఇలా వుంది.

''గోద్రా ఘటన అనంతరం రాత్రి చాలా పొద్దుపోయాక ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సీనియర్‌ అధికారులతో అత్యున్నత సమావేశం నిర్వహించారు. 'గోద్రా దుర్ఘటనపై హిందువులు ఆగ్రహంతో ఉన్నారు. వారి ఆగ్రహాన్ని వెళ్లగక్కనీయండి. మీరు పట్టించుకోవద్దు. చూసీచూడనట్టు వదిలేయండి' అని ముఖ్యమంత్రి మాకు ధర్మసందేశం ఇచ్చారు. ఆయన అనుచర అధికారులకు మోడీ ఆకాంక్ష ఏంటో అర్థమైంది. ఆ సమావేశానికి నేనూ వెళ్లాను. గోద్రా ఘటన అనంతర దారుణాలకు ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు, ఇతర ప్రభుత్వాధినేతలు, పోలీసు ఉన్నతాధికారులకు ప్రమేయముంది. మాజీ మంత్రి హరేన్‌పాండ్య హత్యకు సంబంధించి నేను సేకరించిన సాక్ష్యాధారాలను ధ్వంసం చేయాల్సిందిగా మోడీ, హోంశాఖ మాజీ మంత్రి అమిత్‌షా ఒత్తిడి చేశారు. వారి మాట విననందుకు నన్ను వేధించారు. సబర్మతి జైలు అధిపతి స్థానం నుంచి తప్పించి రెండు నెలల పాటు ఏ శాఖకు మార్చకుండా వేధించారు''. (సంజీవ్‌భట్‌ అఫిడవిట్‌)

కుటుంబం కొండంత అండ


న్యాయం కోసం సంజీవ్‌భట్‌ సాగిస్తున్న పోరాటానికి ఆయన కుటుంబం కొండంత అండగా నిలుస్తోంది. ఆయనకు భార్య శ్వేత, కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు ఎంబిబిఎస్‌ ఆఖరి సంవత్సరం చదువుతుండగా తనయుడు ఇంటర్‌ చదువుతున్నాడు. మాజీ మంత్రి హరేన్‌పాండ్య హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను బయట పెట్టవద్దంటూ మోడీ సర్కార్‌ చేసిన ఒత్తిడిని లెక్కచేయకపోవడంతో 2003 నుంచి గుజరాత్‌ ప్రభుత్వం సంజీవ్‌పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి ఎదురవుతున్న వేధింపులను సంజీవ్‌ కుటుంబం ఎదుర్కొంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న సంజీవ్‌ భట్‌ను అరెస్టు చేసి, జైల్లో ఉండగానే ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన భార్య, పిల్లలు ఏమాత్రం జంకలేదు. 'సరైన లక్ష్యంతో వెళ్తున్న అధికారి భార్యగా గర్విస్తున్నాను. ఎన్ని ఇబ్బందులొచ్చినా ఆయనకు మా సహకారం ఉంటుంది' అని సంజీవ్‌ భార్య శ్వేత అంటారు. మోడీ సర్కారు కక్షసాధింపు చర్యలతో తరచూ శాఖలు మార్చడం..బదిలీ చేయడం..లాంటి ఇబ్బందులన్నింటిని సంజీవ్‌ కుటుంబం భరిస్తూనే ఉంది. తమ పిల్లలు తండ్రిలానే చాలా ధైర్యవంతులని తనకు వారే అండగా నిలబడి ధైర్యం చెబుతున్నారని శ్వేత అంటారు. తమకు ఎదురవుతున్న ఇబ్బందులు, వేధింపులపై స్వచ్ఛంద సంస్థలతో కలిసి శ్వేత కూడా న్యాయపోరాటం సాగించారు. సంజీవ్‌ అరెస్టు తర్వాత ఆయనను వెంటనే విడుదల చేయాలంటూ ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి చిదంబరానికి, డిజిపికి పదేపదే లేఖలు రాసి శాంతియుత పోరాటం సాగించారు. వీరికి తోడుగా పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు, ఐపిఎస్‌ అధికారుల సంఘం బాసటగా నిలిచాయి. సంజీవ్‌ను విడుదల చేసేవరకు న్యాయపోరాటం సాగించాయి.

ఈ మారణకాండ జరిగినప్పుడు సంజీవ్‌ భట్‌ నోడల్‌ ఆఫీసర్‌గానే ఉన్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అత్యున్నత విభాగాలన్నింటితోనూ సంప్రదింపులు జరిపేవారు. ఆయా శాఖలు అంతరంగికంగా చర్చించే ఎంత రహస్య సున్నిత సమాచారమైనా భట్‌కు తెలిసేది. గోద్రా ఘటనకు దారితీసిన అసలు వాస్తవాలేంటి.. ఆ తర్వాత జరిగిన నరమేధం వెనుక దాగిన ప్రభుత్వ కుట్ర, అధికార నిర్లక్షానికి సంబంధించి తనకు తెలిసిన సమాచారమంతటిని పత్ర సహిత ఆధారాలతో సిట్‌కు అందజేశారు సంజీవ్‌. గుజరాత్‌ మత ఘర్షణల్లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, ఆయన మంత్రులు, ఇతర ప్రభుత్వ పెద్దల పాత్రపై దర్యాప్తు చేపట్టిన జస్టిస్‌ నానావతి, జస్టిస్‌ మెహ్తా కమిషన్‌ ముందు భట్‌ హాజరై వివరించారు. అసలు నేరస్తులను బోనెక్కించాలన్ని తపనతో ఆయన తన పోరాటం సాగిస్తూనే ఉన్నారు. తాజాగా గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టుకు సంజీవ్‌భట్‌ ఓ అఫిడవిట్‌ దాఖలు చేశారు. కక్షసాధింపు చర్యలకు దిగిన మోడీ సర్కార్‌ చిన్న కేసులో ఇరికించి సెప్టెంబర్‌ 30 న అరెస్టు చేయించింది. ఆయన అఫిడవిట్‌కు దన్నుగా తన చేత మరో అఫిడవిట్‌ను బలవంతంగా దాఖలు చేయించారని సంజీవ్‌ డ్రైవర్‌గా వ్యవహరించిన పిసి కెడి పంత్‌ చేసిన ఫిర్యాదుతో సంజీవ్‌ను అరెస్టు చేసినట్లు మోడీ సర్కార్‌ చెబుతోంది. వాస్తవానికి గుజరాత్‌ మాజీ మంత్రి హరేన్‌పాండ్య హత్యకేసుకు సంబంధించి ప్రభుత్వంలోని కొందరు పెద్దల ప్రమేయముందంటూ.. అందుకు బలమైన సాక్ష్యాధారాలను పరిశీలించాల్సిందిగా అరెస్టుకు రెండు రోజుల ముందు అఫిడవిట్‌ దాఖలు చేశారు. అంటే అసలు కారణమేంటో ఇట్టే అర్థమైపోతుంది.
పోలీసు అత్యున్నత అధికారులు, మహేష్‌ భట్‌, అన్నా హజారే వంటి ప్రముఖులు భట్‌ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు నిరసన ప్రదర్శనలు చేశాయి. తక్షణమే విడుదల చేయాలని సర్వత్రా డిమాండ్‌ వెల్లువెత్తింది. దీంతో ఆయనకు గత అక్టోబర్‌ 17న బెయిల్‌ మంజూరు చేసి విడుదల చేశారు. మోడీని క్రిమినల్‌గానే చూడాలని, సత్యం కోసం తన పోరాటం కొనసాగుతుందని విడుదల అనంతరం సంజీవ్‌ ప్రకటించారు.
నిలదీసేవారందరికీ వేధింపులే..
గోద్రా ఘటన తర్వాత తనను ఎవరు వేలేత్తి చూపినా ..మోడీ కక్ష సాధింపులతోనే సమాధానమిస్తున్నారు. వేధింపులతోనే బదులిస్తున్నారు. భట్‌ ఒక్కరే కాదు..ఎంతో మంది సీనియర్‌ పోలీసు అధికారులు, స్వచ్ఛంద కార్యకర్తలు ఆయన వేధింపులకు బలయ్యారు. పదవులు పోగొట్టుకున్నారు. రావాల్సిన ప్రమోషన్లు తొక్కిపెట్టారు. ఇలా మోడీ సర్కార్‌ వేధింపులు ఎదుర్కొన్న వారిలో పోలీసు అధికారులు రాహుల్‌శర్మ, ఆర్‌బి శ్రీకుమార్‌, స్వచ్ఛంద కార్యకర్తలు తీస్తా సెతల్వాద్‌, షకీల్‌ తర్మీజి ...ఇలా ఎంతోమంది ఉన్నారు.
తేల్చుకుందాం రా!

'నాకు నైతికత ఉంది అధికారం లేదు
నీకు అధికారం ఉంది నైతికత లేదు
నీకు నీవెంతో..నాకు నేనంతే
రాజీ పడే ప్రశ్నేలేదు
న్యాయపోరాటం మొదలైంది
తేల్చుకుందాం రా..
నా వద్ద సత్యముంది బలగం లేదు
నీకు బలగముంది సత్యం లేదు
నీకు నీవెంతో ..నాకు నేనంతే
రాజీ ప్రశ్నేలేదు
న్యాయపోరాటం మొదలైంది
తేల్చుకుందాం రా..
నీవు నన్ను చితకబాదొచ్చు
నేను పోరాడతాను
నా ఎముకలు విరగ్గొట్టొచ్చు
నేను పోరాడతాను
/*/*/
సజీవ సమాధి చేయొచ్చు
నేను పోరాడతాను
తుదిశ్వాస విడిచేదాకా
పోరాడతాను
అభాండాలతో నీవు నిర్మించిన అసత్యకోటను కూల్చేదాకా
నీవు కొలుస్తున్న సైతానును
నా సత్యదేవత నేలమట్టం చేసేదాకా
దేవుడు నిన్ను కరుణించుగాక
సత్యమేవ జయతే''
- సంజీవ్‌భట్

(నరేంద్ర మోడీకి సంజీవ్‌భట్‌ రాసిన లేఖాస్త్రం నుంచి)‌

రాహుల్‌ శర్మ : ఈయన డిఐజిగా ఉండేవారు. 2002 నరమేధం సమయంలో కొందమంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల సంభాషణల రికార్డులను నానావతి కమిషన్‌కు, సిట్‌కు అందజేశారు. దీంతో మోడీ సర్కారుకు కోపం వచ్చింది. అధికార రహస్యాల చట్టం కింద చార్జిషీట్‌ దాఖలు చేసింది.
ఆర్‌బి శ్రీకుమార్‌ : ఈయన కూడా 2002లో ఇంటలిజెన్స్‌ బ్యూరోలో డిఐజిగా ఉండేవారు. గుజరాత్‌ మారణకాండ సమయంలో పోలీసులు బాధ్యతలు నిర్వర్తించకుండా ప్రభుత్వమే అడ్డుకుందని ఆరోపించారు. నానావతి కమిషన్‌ ఎదుట సాక్ష్యం కూడా చెప్పారు. దీంతో మోడీ ఆగ్రహానికి గురయ్యారు. రాష్ట్ర పోలీసు అధిపతిగా ప్రమోషన్‌ రావాల్సిన అతడికి ఆ పదవీ దక్కనీయకుండా చేశారు.
తీస్తా సెతల్వాద్‌ : మతోన్మాదంపై ఎనలేని పోరాటం చేస్తున్న తీస్తా సెతల్వాద్‌ ప్రముఖ పాత్రికేయులు, విద్యావేత్త, భారత తొలి అటార్నీ జర్నల్‌ ఎంసి సెతల్వాద్‌ మనవరాలు. గుజరాత్‌ నరమేధంపై కూడా రాజీలేని పోరాటం సాగిస్తున్నారు. బెస్ట్‌ బేకరీ కేసు, గుల్బర్గ హౌసింగ్‌ సొసైటీ కేసులో సాక్ష్యాధారాలు సేకరించి న్యాయస్థానాల ముందుంచుతున్నారు. సంజీవ్‌ భట్‌కు కూడా అండగా నిలబడ్డారు.
కోటి రూపాయలు కాలదన్నిన కర్కారే

ముంబయి ఉగ్రవాద నిరోధక సంస్థ (ఎటిఎస్‌) అధినేతగా హేమంత్‌ కర్కారే పనిచేశారు. ఉగ్రవాదులంటే కేవలం ముస్లింలే కాదంటూ మాలెగావ్‌ బాంబు పేలుళ్ల కేసులో సమగ్ర దర్యాప్తు సాగించి కాషాయ ఉగ్రవాదాన్ని ప్రపంచానికి చాటారు. ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి వంటి కాషాయ సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలున్న నేతలను ఈ కేసులో అరెస్టు చేశారు. చివరకు 2008లో నవంబర్‌ 26న ఉగ్రవాదులు ముంబయిలో సృష్టించిన నరమేధంలో వీరోచితంగా పోరాడి అసువులు బాసారు. మాలెగావ్‌ కేసు విచారణ సందర్భంలో కర్కారేపై ... సహచర కాషాయ నేతలతో పాటు ఆరోపణలు గుప్పించిన నరేంద్ర మోడీ కర్కారే మృతి పట్ల సంఘీభావం ప్రకటించి గొప్ప పేరు పొందాలని తహతహలాడారు. కర్కారే కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందజేసేందుకు యత్నించగా కర్కారే భార్య కవితా కర్కారే తిరస్కరించారు. 'రాజకీయ పరామర్శలు మాకొద్దు' అంటూ మతోన్మాద మోడీ మోహం మీద కొట్టారు. బిజెపి సీనియర్‌ నేత అద్వానీ సహా రాజకీయ నేతలు తమను పరామర్శించేందుకు ఆమె నిరాకరించారు.

ఇంతటి నరమేధం సృష్టించినా మోడీకి ఎన్నికల్లో విజయానికి ఇది అడ్డురాలేదు. మతవిద్వేష దుష్ప్రభావ ప్రయోజనాలతో అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుపొందుతున్నారు. అదే మతం మత్తులో దేశ ప్రధానిని కూడా అయిపోవాలని కలలు కంటున్న ఆయనకు పరిస్థితి అంత సానుకూలంగా ఏమీ లేదు. గుల్బర్గ సొసైటీ కేసులో సుప్రీంకోర్టు విచారణ అంశాన్ని దిగువ కోర్టుకే వదిలివేయడంతోనే అగ్నిపునీతుడయ్యాడని కమలనాథులు గొప్పలు చెప్పుకుంటున్నా..అది ఆయన సచ్ఛీలతకు ఇచ్చిన తీర్పు కాదు. దిగువ కోర్టు పరిధిలో ఉందికనుక ఆ కోర్టులోనే విచారణ సాగించమని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అది. ఆ తీర్పును సానుకూలంగా మలుచుకునేందుకు నరేంద్రమోడీ పడరాని పాట్లు పడ్డాడు. పనిలో పనిగా సద్భావన దీక్షలు చేపట్టాడు. బిజెపి పార్టీ కార్యకర్తలుగా ఉన్న కొందరు ముస్లింలు అభిమానంతో తమ సాంప్రదాయ టోపీలు ధరించాల్సిందిగా మోడీని కోరితే ఆయన వాటిని తిరస్కరించి హిందూ దర్పం ఉట్టిపడేలా తలపాగా చుట్టుకొని కొత్త మత సామరస్యత చాటారు. మరోవైపు వివిధ సందర్భాల్లో ఆయనకు న్యాయస్థానాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు తన సహచర మం**త్రులుగా ఉన్న మాయా కొద్నానీ అరెస్టయి పదవి పోగొట్టుకున్నారు. గోద్రా అనంతర మత ఘర్షణలకు సంబంధించి ఆమెకు ఈ శాస్తి జరిగింది. అలాగే ఆయన ప్రభుత్వంలో హోంశాఖ సహాయ కార్యదర్శిగా ఉన్న అమిత్‌షా సోహ్రబుద్దీన్‌, ఆయన భార్య కేసర్‌బీని, వారి మిత్రుడు తులసీరాం ప్రజాపతి హత్య కేసులో అరెస్టయి ప్రస్తుతం బెయిల్‌మీద గడుపుతున్నారు. ఇటీవలే 2002 గోద్రా అనంతరం జరిగిన సర్దార్‌పురా దారుణకాండ (33 మందిని సజీవ దహనం చేశారు) లో స్పెషల్‌ కోర్టు 73 మంది నిందితుల్లో 31 మందిని దోషులుగా తేల్చింది. వీరికి జీవిత ఖైదు వేశారు.
గుజరాత్‌ మారణకాండ టైమ్‌లైన్‌

2002 ఫిబ్రవరి 27 : గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-6 బోగీని అల్లరిమూకలు తగులబెట్టడంతో 59 మంది చనిపోయారు. 1500 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.
ఫిబ్రవరి 28 - మార్చి 31, 2002 : గుజరాత్‌లో నరమేధం కొనసాగింది. ఎక్కడపడితే అక్కడ ముస్లింలు, ఇతర మైనార్టీలపై దాడులు జరిగాయి. 1200 మంది దాకా అమాయక ప్రజలు హత్యకు గురయ్యారు. వందలాది ప్రార్థనా స్థలాలు నేలమట్టమయ్యాయి.
మార్చి3, 2002 : గోద్రా రైలు తగులబెట్టిన ఘటనపై ఉగ్రవాద నిరోధక ఆర్డినెన్స్‌ (పోటో) కింద కేసు నమోదైంది.
మార్చి 6, 2002 : గుజరాత్‌ ప్రభుత్వం గోద్రా రైలు ఘటన, తర్వాత మారణకాండపైన దర్యాప్తు చేసేందుకు కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ చట్టం కింద దర్యాప్తు కమిషన్‌ను నియమించింది.
మార్చి 9,2002 : నిందితులందరిపైనా ఐపిసి 120 బి నేరపూరిత కుట్ర కేసును పోలీసులు నమోదు చేశారు.
మార్చి 25, 2002 : కేంద్ర ప్రభుత్య జోక్యంతో పోటో కేసును ఎత్తివేశారు.
మే 27, 2002 : 54 మందిపై ఛార్జిషీట్‌ నమోదు చేశారు.
ఫిబ్రవరి 18, 2003 : పార్లమెంటు ఆమోదంతో పోటో పునరుద్ధరించడంతో గోద్రా నిందితులపై మళ్లీ ఈ చట్టం కింద కేసు తిరగతోడారు.
నవంబర్‌ 21, 2003 : గోద్రా రైలు తగులపెట్టిన కేసు సహా అన్ని మత ఘర్షణల కేసుల జ్యుడీషియల్‌ విచారణపైనా సుప్రీం కోర్టు స్టే విధించింది.
సెప్టెంబర్‌ 4, 2004 : ఆర్జేడి నేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ రైల్వేమంత్రిగా ఉన్న నాటి ఘటనపై కేంద్ర మంత్రిమండలి కొన్ని సందేహాలు లేవనెత్తడంతో సుప్రీంకోర్టు మాజీ జడ్జి యుసి బెనర్జీ నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు.స
సెప్టెంబర్‌ 21 , 2004 : పోటోపై మరోమారు సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
జనవరి 17, 2005 : యుసి బెనర్జీ ప్రాథమిక నివేదిక సమర్పించారు. రైలులోని ఎస్‌-6 బోగీ ప్రమాదం కారణంగానే తగలబడి వుండవచ్చని పేర్కొంది. బయట వ్యక్తులెవరూ దీనిని తగులబెట్టలేదని నివేదించింది.
మే16, 2005 : యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పోటో చట్టాన్ని రద్దు చేసింది.
అక్టోబర్‌13, 2006 : యుసి బెనర్జీ కమిటీ నియామకం చెల్లదని గుజరాత్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. నానావతి - షా కమిషన్‌ దర్యాప్తు చేస్తుండగా బెనర్జీ ఇచ్చిన దర్యాప్తు నివేదిక చెల్లదని పేర్కొంది.
మార్చి26 , 2008 : గోద్రా ఘటన, అనంతర మారణకాండకు సంబంధించిన కేసులపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించింది.
సెప్టెంబర్‌ 18, 2008 : నానావతి కమిషన్‌ తన నివేదిక అందజేసింది. గోద్రా ఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగనది, ఓ అల్లరిమూక తగులబెట్టిందని నివేదిక ఇచ్చింది.
ఫిబ్రవరి 12, 2009 : గోద్రా కేసులో పోటో చెల్లదన్న పోటో సమీక్ష కమిటీ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
ఫిబ్రవరి 20, 2009 : గోద్రా, ఇతర మతకలహాల కేసుల విచారణపై విధించిన స్టేను సుప్రీం ఎత్తివేసింది. సిట్‌కు సిబిఐ మాజీ డైరెక్టర్‌ ఆర్‌కె రాఘవన్‌ నేతృత్వం వహించినప్పటి నుంచి విచారణ వేగం పుంజుకుంది.
జూన్‌ 1, 2009 : గోద్రా రైలు ఘటనపై సబర్మతి కేంద్ర కారాగారంలో విచారణ మొదలైంది.
మే 6, 2010 : గోద్రా సహా తొమ్మిది సున్నితమైన కేసుల్లో తీర్పు వెలువరించొద్దంటూ విచారణ కోర్టుకు సుప్రీం నిర్దేశించింది.
సెప్టెంబర్‌ 28, 2010 : విచారణ తుదకు చేరింది. సుప్రీం స్టే విధించినందున తీర్పు వెలువడలేదు.
జనవరి 18, 2011 : తీర్పులు వెలువరించడంపై విధించిన స్టే ను సుప్రీం ఎత్తివేసింది.
ఫిబ్రవరి 22, 2011 : గోద్రా ఘటనలో 63 మంది నిందితుల్లో 31 మందిని కోర్టు దోషులుగా తేల్చింది.
ఏప్రిల్‌ 22, 2011 : గోద్రా అనంతర మారణకాండలో మోడీకి సంబంధముందంటూ సీనియర్‌ పోలీసు అధికారి సంజీవ్‌ భట్‌ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు.
సెప్టెంబర్‌ 27, 2011 : గుజరాత్‌ హైకోర్టులో సంజీవ్‌భట్‌ మరో అఫిడవిట్‌ దాఖలు చేశారు.
సెప్టెంబర్‌ 30 , 2011 : సంజీవ్‌ భట్‌ను ఓ చిన్న కేసులో అరెస్టు చేశారు.

అక్టోబర్‌ 17, 2011 : సంజీవ్‌ భట్‌ విడుదలయ్యారు.

న్యాయవ్యవస్థ మీద ప్రజల విశ్వాసాన్ని ఈ తీర్పు పెంపొందిస్తుందంటూ తీస్తా సెతల్వాద్‌ ఈ తీర్పును కొనియాడారు. 2002లో ఫిబ్రవరి 27న సమావేశం నిర్వహించినట్లు సంజీవ్‌ ఆరోపిస్తున్నారు. ఆ సమావేశం తర్వాత వివిధ పోలీసు స్టేషన్ల రోజ్‌నాంఛా (జనరల్‌ డైరీ) లోని వివరాలను బయటపెడితే విషయం తేలిపోతుంది. కానీ ఆ విషయాలను మోడీ సర్కారు బయటపెట్టడం లేదు. ఆవిధంగా సంజీవ్‌ భట్‌ సవాలును స్వీకరించి మోడీ తన మీద ఉన్న మచ్చను తొలగించుకునే అవకాశమున్నా వినియోగించుకోవడంలేదు. మానవ హక్కులను ఖననం చేసి తాను సాధిస్తున్న శాసన విజయాలనబడే మేలి ముసుగుతో అతని మతోన్మాద ముఖాన్ని ఏమాత్రమూ కప్పివుంచలేదు. మతోన్మాద విజయానందంలో బీరాలు పోతున్న నరేంద్ర మోడీపై ఏదో ఒక రోజు సత్యం విజయం సాగిస్తుందని సంజీవ్‌ భట్‌ నమ్మకం. సత్యం కోసం పోరాడుతున్న సంజీవ్‌భట్‌ విజయం సాధిస్తారనే ఆకాంక్షిద్దాం.
(ఈ ఆర్టికల్ ప్రజాశక్తి లో వచ్చింది)

4 comments:

  1. అయ్యా !!! నమస్కారం ..... ఉభయకుశులోపరి ....

    దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ అన్నాడు మహా కవి గురజాడ...అటువంటిది మనుషులని చంపి ,,, చంపి దేశాన్ని మట్టి చేద్దాం అనుకుంటున్నారేమో ఈ మతోన్మాదులు ..ఎంత ఆలోచించినా అర్ధం కాని విషయం ఏంటంటే .....దేశం లో అందరికి తెలుసు మోడి ఎలాంటివాడో ....ఎంత కర్కోటకుడో ...ఇంత మంది చావు కి కారణం ఐన ఆ కిరాతకుడు ..ధైర్యం గా తిరుగుతున్నాడు ....పాలిస్తున్నాడు....అనుభవిస్తున్నాడు......వేధిస్తున్నాడు ....అయినా న్యాయస్థానాలు ఏమి చేయలేక పోతున్నాయి ....అనాదిగా వస్తున్నా ఆచారం ఏమో ఈ దేశం లో బలవంతులే బ్రతకాలేమో !!!

    ఏది ఏమైనా సత్యాన్ని తెలుగు బ్లాగ్ లోకం లో తీసుకు రావటానికి మీరు చేసిన కృషి అభినదనీయం ..... మరిన్ని నిజాలు వెలికు తీసి దెస సేవా చేయాలనీ కోరుకుంటూ ... మీ శ్రేయోభిలాషి

    ReplyDelete
  2. గుజరాత్ అంటే చాలా మందికి గోద్రా తరువాతి సంఘటనలే కాదు .. గోధ్రా కూడా గుర్తుకొస్తుంది. కొంత మంది మతోన్మాదానికి కండకావరం కూడా తోడై తగల బెట్టిన రైలు అందులో చనిపోయిన వారు గుర్తుకు వస్తారు.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. hahaha ... is it not a big Joke today!!? ....
    so what ever Commies try ...How ever Commies Try ..." Satyameva Jayethey" ..... Jo bole so NIhaal Sat-Shti-Akaal :)

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి