Monday 10 February, 2014

వెంటాడే' కథలు 'ఏక్ కహానీ కె తీన్ రంగ్'

నా కొత్త కథల పుస్తకం పై ప్రముఖ కథకుడు లెనిన్ ధనిశెట్టి మొన్నటి ఆంధ్రజ్యోతి సండే లో రాసిన రివ్యూ:
'వెంటాడే' కథలు
- - - - - - - - -
తెలంగాణ తెలుగు కథ వ్యక్తీకరణలోనూ, ప్రయోగాత్మకతలోనూ కొత్త పుంతలు తొక్కుతూ వికసిస్తూందనేందుకు మంచి ఉదాహరణ స్కైబాబ రాసిన 'ఏక్ కహానీ కె తీన్ రంగ్' కథలు. ముగ్గురు ముస్లిం స్త్రీలకు, పురుషులకు మధ్య సెల్‌ఫోన్‌లో జరిగిన సంభాషణలకు 'వహీదా', 'జమీలా', 'మౌసమీ' అనే మూడు కథా రూపాలనిచ్చాడు రచయిత.
పాఠకులు ఊహించని మలుపులతో సాగే ఈ కథలు సమకాలీన మధ్యతరగతి ముస్లిం స్త్రీల మనస్తత్వంలోని పరాధీనత, నిస్పృహ, వేదన వంటి విభిన్న కోణాలను మనకు పరిచయం చేస్తాయి. అత్యంత పురాతనమైన, అదే సమయంలో సమకాలీనమైన ఈ వాస్తవికతను రచయిత వివరించిన తీరు మూలంగా ఈ కథలు పాఠకుల్ని తమతో పాటు లాక్కెళ్ళి సంఘటనల్ని దృశ్యమానం చేస్తాయి. చదివిన చాలాకాలం వరకూ వారిని వెంటాడేలా చేస్తాయి. ఈ కథలలోని స్త్రీ పాత్రలన్నీ సనాతన ఆచారాలకు, ఆధునికతకు మధ్య నలిగి పోతుంటాయి. సంప్రదాయాల సంకెళ్ళ నుంచి బయటికొచ్చి స్వేచ్ఛా ప్రపంచంలో విహరించాలని తపిస్తుంటాయి. ఆ మహిళల అంతరంగాల్లోని ఈ 'తపన'ను, ఘర్షణను చాలా నేర్పుగా వ్యక్తీకరిస్తాడు రచయిత. వారి అంతరంగ చిత్రణకు సమాంతరంగా ముస్లిం పురుషుడి అపరాధ భావన కూడా వీటిలో చాలా సహజంగా వ్యక్తమైంది.
సెల్‌ఫోన్ కథలని వీటికో టాగ్‌లైన్ తగిలించడం అనవసరం. ఎందుకంటే ఈ కథల్లో సెల్‌ఫోన్ ఒక మాధ్యమం, పరికరం మాత్రమే. అందరికీ తెలిసిన జీవితాలనే ఉత్కంఠ భరితంగా రాయడం వల్ల ఈ కథలకు చాలా రీడబిలిటీ వచ్చింది. రొటీన్ కథలతో చిక్కి శల్యమవుతున్న తెలుగు పాఠకులు, తెలుగు సాహిత్యంలో కొత్తదనం లేదని వాపోయేవారు తప్పక చదవాల్సిన కథలివి. వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన ముందు మాట చాలా ఆలోచనాత్మకంగా ఉంది.
- డి. లెనిన్
ఏక్ కహానీ కె తీన్ రంగ్, స్కై బాబ
పేజీలు : 40, వెల : రూ. 30
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు,
www.kinige.com
- See more at: http://www.andhrajyothy.com/node/63722#sthash.qMcODbNb.dpuf

No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియజెయ్యండి