Tuesday 26 July, 2011

'ఉర్సు' కధ పై స్వాతి శ్రీపాద

స్కైబాబ 'ఉర్సు' కధ ఆరంభం చాలా ఆసక్తి దాయకంగా సహజంగా , ఎలాంటి పటాటోపాలు లేకుండా మనసుకు హత్తుకునేలావుంది. చెల్లెళ్ళతో మొదలెట్టి ఉర్సు దాకా వచ్హ్చి రుక్సానా ప్రస్తావన చెయ్యడం అద్భుతంగా వుంది. సహజంగా వుంది. గుండెను తడిమేలా వుంది. కన్నీళ్ళతో రూపం ఒలికిపోడం ఒక్క వాక్యం చాలు వెయ్యి కావ్యాలు వర్ణించినట్టూ... కధ చదివే ఆసక్తిని కలిగిస్తుంది.
ఓ పక్క ఉర్సు వర్ణన గతకాలపు వైభవాలను తవ్వితలకెత్తడం మరోవైపు రుక్సానా పరిచయం సమాంతరంగా సాగినా దేని ఆసక్తిని దానికే పరిమితం చేసి కలగలిపి రాయడం రచయిత స్కై బాబాకే చెల్లు.
" డిగ్రీ రెండో సంవత్సరంల వచ్చిన ఉర్సులనె ఎదురుపడ్డవి ఆ కళ్లు. చంద్రగోళాల్లాంటి ఆ కళ్లు. చుట్టూ నల్లటి మబ్బుల మధ్య అందమైన కళ్లు. తెల్లని ఒంటి రంగు నడుమ, నల్లని కాటుక మధ్య, తెల్లని కళ్లు. మధ్యలో నల్లని కనుపాపలు. నన్నెంత ఆకర్షించాయో.. వాటి వెంట నేను పడ్డనో అవి నా వెంట పడ్డ్డాయో తెలియదు. కాని ఒకరికి తెలియకుంట ఒకరం మళ్ల మళ్ల ఎదురుపడ్డం. పడ్డప్పుడల్లా పరిచయస్తుల్లెక్కనె ప్రేమగ చూసుకున్నయ్ మా రెండు జతల కళ్లు." వర్ణన కొత్తగా కవితామయంగా సాగింది.
‎" ఆకాశంలో చాంద్ మాయమై ఇక్కడ తేలినట్లుంది'' అన్న. నవ్వు వెన్నెల మళ్లీ కురిసింది. అట్లా అర్ధగంటసేపు గుండెల లయల వేగాల్ని, సప్పుడుల్ని కొలుచుకుంట మాట్లాడుకున్నం."
"ఇంట్లకు పోతూ ఒక్కసారి వెనక్కి మళ్లి చూసింది. అది ఆఖరి చూపు అవుతుందని నేనస్సలు అనుకోలేదు. కాని అదే ఆఖరి చూపు!"
ఇగ ఎన్నిసార్లు ఆ ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టిన్నో. ఏనాడూ రుక్సానా కనిపించలేదు. ఆ ఇంటిముందలికి పోంగనె రుక్సానా కోసమే వేయించిన సైకిల్‌బెల్లు 'టింగ్ .. టింగ్'మని మోగించేటోన్ని. ఎన్నిసార్లు మోగించినా రుక్సానా బైటికి రాలేదు. కొన్ని దినాలు పిచ్చోన్నై పోయ్‌నంత పనైంది. అన్నం సయించేది కాదు. నిద్దర పట్టేది కాదు. ఇంటి బైట మంచం ఏసుకొని పండుకుంటే పైన ఆ జాబిలిలో రుక్సానా మొఖమే కన్పించి బోరున ఏడ్చేటోణ్ణి. పట్టక పట్టక నిద్ర పడితె తెల్లార్లూ రుక్సానా కలలే. నా పరధ్యానానికి మా ఇంటోళ్లంతా పరేశానయ్యేది. ఆ ఎండాకాలం చివర్లో రుక్సానా ఇల్లు షాదీ కళతోని కళకళలాడింది. నాకు సమజైపోయి షానా ఏడ్చిన. ఒకరోజు పెళ్లి కూడా అయిపోయింది! ఆ రోజు పిల్లను పోగొట్టుకున్న కాకి తిరిగినట్టు ఆ ఇంటిచుట్టూ తిరిగిన. కాని ఏం లాభం?ఎంత మామూలుగా ప్రమ కధకో పాజ్ ఇచ్చారు.
ఆలోచనలనుండీ గతం నుండి వాస్తవానికి వచ్చి ...
మళ్ళి రుక్సానా కలవడం , ఆమె నిష్టూరమాడటం "నువ్వు షానా గుర్తొచ్చెటోడివి. ఎందుకో తెలియదు. ఆ ఒక్క ఏడాదిల్నె నిన్ను షానా ఇష్టపడ్డ. మా బావ మెకానిక్ కావడం వల్లనో, నువ్వ చదువుకుంటుండడం వల్లనో కావొచ్చు. నిన్ను చేసుకోలేక పోయ్‌నందుకు మనసు ముడుచుకుపోయింది. బైట పడతానికి షాన్నేళ్లు పట్టింది. నీకేంది, మగవాడివి... నువ్వు బాగనె ఉన్నవ్.''
ఈ ఉర్సు ప్రతి ఏడాది ఇట్ల అందర్నీ కలపడానికే ఉన్నదనిపించింది. రుక్సానాను చూడాలన్నా మళ్ల ఉర్సు కోసం ఎదురు చూడాల్సిందే అనుకుంట కదిలిన.
ఈ ముగింపు కధకు గొప్ప మలుపు నిచ్చింది.
చెప్పిన బ్ఃఆవాలు ఎన్ని ఉన్నాయో చెప్పనివి అంతకు రెట్టింపు ఉన్నాయి. అక్కడో ఇక్కడో తొంగి చూశ్తూ కధకుడిలోని కవి. చివరిమాటల్లో నాయకుడి ఆశ, అతని మనసుకు పట్టని అద్దం , మేలి ముసుగులో చందమామను చూపినంత అందంగా వుందీ కధ. రచయితకు అభినందనలు.
                             - స్వాతి శ్రీపాద

No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియజెయ్యండి