Monday, 1 April 2013

తెలుగు కథపై సరికొత్త దస్తూరి 'అధూరె'




''తెలంగాణ తెలుగు రచయితల మనో ప్రపంచంలోంచి ముస్లింలు గల్లంతు కావడమే వారి దుస్థితిని తెలియజేస్తుంది. తమ సూఫీ విలువలతో స్థానిక జీవన విధానాన్ని, రీతిని ఎంతగానో పరిపుష్టం చేసిన ముస్లిం జన సమూహం తిరిగి తమ ఉనికి గురించి తామే చెప్పుకోవల్సి రావడం విచారకరం.''

సీమాంధ్ర పాలక వర్గాల ప్రతినిధిగా 1983లో టిడిపి అధికారం చేపట్టి వలసీకరణకు, వనరుల దోపిడీకి తలుపులు బార్లా తెరిచిన తర్వాత తెలంగాణలో జరిగిన పరిణామాలు విశిష్టమైనవి. అందులో రెండు మరీ ముఖ్యమైనవి. 1.జగిత్యాల జైత్రయాత్ర తీసుకొచ్చిన స్థానికత, దాని దరిమిలా చెలరేగిన తెలంగాణ భాషా చరిత్రల చర్చ. 2.కారంచేడు సంఘటన దరిమిలా ముందుకొచ్చిన దళిత, స్త్రీవాద ఉద్యమాలు ముందుకు తెచ్చిన వివక్ష. వీటి దరిమిలా రూపుదిద్దుకున్న ముస్లిం సాహిత్య ఉద్యమం విలక్షణమయ్యింది. ఈ ఉద్యమాలు ముందుకు తెచ్చిన ప్రశ్నలు, అందిచ్చిన ప్రేరణ తెలంగాణ సమాజపు గతం, వర్తమానం, భవిష్యత్తుపై పునరాలోచనకు దారులు వేశాయి. ఒక రకంగా వర్తమాన తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తాత్విక భూమికను సమకూర్చిపెట్టాయి. ఈ క్రమంలో ముస్లిం సాహిత్య ఉద్యమం నిర్వహించిన పాత్ర విలువైనది. ఏడు వందల ఏళ్లుగా ఉర్దూ, ఫారసీ భాషా సంస్కృతుల ప్రమే యం వల్ల కావచ్చు స్థానిక సూఫీ సాంస్కృతిక సంప్రదాయాల వల్ల కావచ్చు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ముస్లింల సాహిత్య ఉద్యమం రేపిన చర్చ ఒక నైతిక శక్తిని ప్రసాదించింది.

కోస్తా కమ్మ, బ్రాహ్మణ స్త్రీల స్త్రీవాదానికి భిన్నంగా, దళితవాదంలో అంతర్లీనమైన అధికార రాజకీయాల ప్రచారాన్ని కాదని, తెలుగు భాషా సంస్కృతుల ఆధిపత్యం కింద అణగారిపోయే తమ జీవితాలను, దాని వైరుధ్యాలను చిత్రిస్తూ రచనా రంగపు బలివితర్థిమీదికి ఒక అల లా, మరో పిడిగు పాటులా వచ్చిపడింది. ప్రసిద్ధ రచయితలు సామల సదాశివ, సుజాతారెడ్డి, సినారె, దాశరథి రంగాచార్య, వరవరరావు, దిలావర్ వంటి రచయితలను కూడా ప్రభావితం చేసింది. శతాబ్దాల తరబడి తెలంగాణలో పరిఢవిల్లిన గంగా జమున తహజీబ్ (ఉమ్మడి సంస్కృతి)పై పునరాలోచించీ చైతన్యపూర్వకంగా రచనకు ఉపక్రమించేలా వారిని ప్రేరేపించింది.

ఏ రచనకైనా ఒక సామాజిక సందర్భం అనివార్యం. అది రాజకీయ, సాంస్కృతిక ఆచరణలో భాగంగా ఉండాలి. ఈ రోజు ప్రధానంగా తెలంగాణ, తెలుగు రచయితల ఆమోదం పొందిన ఈ ఉద్య మ నేపథ్యం, పుట్టుక చాలా కష్టతరమయ్యింది. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం సందర్భంలో ముస్లింలంటే దేశద్రోహులనీ, సంఘవ్యతిరేక శక్తులన్న ప్రచారం ఒకవైపు, లేదంటే రాజకీయాలలో పావులుగానో, ఓటర్లుగా చూసే స్థితి ఒకవైపు. ఈ పరిస్థితులలో తెలంగాణ కేంద్రంగా ముస్లిం సాహిత్య ఉద్యమం తలెత్తింది. తొలుత దళిత, తెలంగాణవాదుల నైతిక మద్దతుతో మొగ్గ తొడిగిన ఈ ఉద్య మం ప్రధాన స్రవంతితోపాటు, అన్ని వాదాల రచయితల మద్దతు పొందడం ఒక చారిత్రాత్మకమైన పరిస్థితి. తొలినాళ్ల ముస్లింవాదంపై వచ్చిన విమర్శలలో ప్రధానమైనవి కవితలో, కథలో వారు ఉపయోగించిన శైలి, తెలుగు ఉర్దూ కలగలిసిన భాష. తెలుగు రచయితలే కాదు, ముస్లిం రచయితలు కూడ ఆ తరహా వైఖరిని వ్యతిరేకించారు. ఈ పేరుతో మొత్తం ఈ సాహిత్య ఉద్యమానికే గండి కొడుదామని చూశారు. ఈ పరిస్థితులలో ఓపికతో ఈ ఉద్యమాన్ని నిలబెట్టి, దాని లో ప్రధాన పాత్ర వహించిన రచయిత స్కైబాబ. ఆయన కవితా రచనతోపాటు, కథా రచన చేసినప్పటికీ పుస్తకాలు వేసుకోవడంలో ఆల స్యం వల్ల కొంత నష్టం జరిగిందనే చెప్పాలి. 13 ఏళ్ల కిత్రం స్కైబాబ రాసిన రెండు కథలు 'ఖిబ్లా', 'ఛోటీ బహెన్' తెలుగు కథా ప్రపంచంలో సంచలనమే. ఇప్పుడు లబ్దప్రతిష్ఠులైన ముస్లిం కథా రచయితలు ఈ తరహా భాషతో అభివ్యక్తితో స్కైబాబ తర్వాతే రాశారు.

నిజానికి తెలంగాణలో తెలుగు ఉర్దూ సాహిత్యంలో ఇదొక బలమైన సంప్రదాయం. కులీఖుతుబ్షాతో మొదలైన దక్కనీ కవితలో ఉర్దూ తెలుగు మాటలు కలగల్సి ఉంటాయి. తెలంగాణ ప్రసిద్ధ రచయితలు సురవరం, కేశవస్వామి, దాశరథి, సినారె తెలుగు ఉర్దూ మాటలు కలగలిసిన మిశ్రమ భాషలో అనేక రచనలు చేశారు. ఈ భాషలో దాశరథి అనేక గజళ్ళు రాశారు. తెలంగాణలో బలమైన రచనా సంప్రదాయంగా ఉన్న ఈ ధోరణిని స్కైబాబ, అతని అనుయాయులు పునరుద్ధరించారనే చెప్పాలి.
తెలంగాణే కాదు, ముస్లిం సాహిత్య ఉద్యమం కూడ బలహీనపడుతున్న కాలమిది. ఈ సందర్భంలో తాను రాసిన కథల సంకలనం 'అధూరె' వెలువరించడం ఆహ్వానించ తగ్గది. ఆ ఉద్యమాలను తిరిగి బలోపేతం చేసే 'అధూరె' కథలకు ప్రత్యేకత చాలా ఉంది. ఇది ప్రయోగం వల్ల, కల్పిత కథన రీతుల విన్యాసం వల్ల, నఖిలీ భాషా పాటవంతో సరికొత్తగా రాద్దామనుకోవడం వల్ల వచ్చింది కాదు. తమదైన జీవితాన్ని, నిత్యం చుట్టుముట్టే వైరుధ్యాలను, ఉన్నదున్నట్టుగా చలనంలో పట్టుకుని దాని ఘర్షణను, సంక్షోభాన్ని కథనం చేసిన రచనలివి. ఇప్పటితరం కథా రచయితలు చాలామంది

ఏదో ఒక వాదాన్ని నిరూపించడానికో, ప్రయోగం పేరుతో, ఎవరినో మెప్పించడానికో, మంచో చెడో ఉద్దేశాల నిరూపణకు రాసేవాళ్లే. ఈ తరహా రచనా తీరుపై మహాకవి చలం ఏనాడో అభ్యంతరం చెప్పి ఉన్నారు. ఈ తరహా రచయితలలో అత్యధికులు సీమాంధ్రకు చెందినవాళ్లే. ఇటువంటి వాతావరణంలో తాను రాసినవి, రాస్తున్నవి కథలేనని వాటికి సాహిత్య ప్రతిపత్తి ఉందని నమ్మి పుస్తకం వేయడం సాహసమే. ఇలా ఎందుకంటున్నానంటే- కథా సిరీస్ (నవీన్-పాపినేని) రాజకీయాలవల్ల చాలామంది తెలంగాణ కథారచయితలు భీరిపోయి రాయడమే మానుకున్నవాళ్లు ఉన్నారు. 'అధూరె'లోని కథలు ఆ పుస్త కం వచ్చేనాటికి ఒక్కటి కూడా 'కథ' సిరీస్‌లో రాలేదు. ఆ సిరీస్‌లో ఈ కథలు వేయకపోవడంలోనే ఉంది రచయితగా స్కైబాబ విజ యం. జీవితం తప్ప 'కట్టుకతల పనితనం' ఇందులో లేదని సిరీస్ నిర్వాహకులు అనుకుని ఉండవచ్చు. ఈ మేరకు సీమాంధ్ర సాహిత్య వ్యూహాలను కాదని, వారి ప్రమాణాలను త్రోసిరాజని వచ్చిన సంకలనమిది. పిడికెడుమంది తప్ప తెలంగాణ, ముస్లిం, దళితవాదుల కథలేవీ ఈ సిరీస్‌లో రాలేదు. 'అధూరె'సంకలనం చూసిన తర్వాత వాద మేదైనా తెలంగాణవారి కథలు అందులో రాకపోవడమే మంచిదయిందనిపిస్తుంది. ముస్లిం, దళిత, తెలంగాణవాదుల కథలని తిరస్కరించి వాసిరెడ్డి-పాపినేనిలు తమ ప్రమాణాలు వేరనీ, తాము వేరని మరింత రూఢీచేశారు. అందుకే ఆధిపత్యం, అవకాశవాదంతో లుకలు కలాడే కథా సిరీస్‌పై తిరుగుబాటుగా వచ్చింది 'అధూరె' సంకలనం.

భారతీయ సాహిత్యంలో మహా కథకులుగా పేరుగాంచిన రచయితలు- బాబూరావు బాగుల్, వైకమ్ మహమ్మద్ బషీర్, అల్లం రాజయ్యలను, వారి సంప్రదాయాలను తెలిసో తెలియకో స్కైబాబ అనుసరించాడు. ప్రస్తుత పరిస్థితులలో ఇంపీరియలిస్ట్ అమెరికన్ సాంస్కృతిక దాడికి స్థానికత నుంచి వచ్చిన జవాబు 'అధూరె'. జాతీయోద్యమ కాలంలో భారతీయ రచయితలు బ్రిటిషు వలస వాదానికి, సామ్రాజ్యవాద దుర్నీతికి ఇదే తరహా జవాబు ఇచ్చారు. 'అధూరె' పేరుతో తెలంగాణ ఇచ్చిన జవాబు కూడా అటువంటిదే. 'అధూరె' కథలలో చోటుచేసుకున్న ఆడవాళ్ల జీవితం తెలుగు కథాప్రపంచంలోనే కొత్తది. దైన్యం, నిస్సహాయత తప్ప వారికి ఏ అండా ఉండదు. చలం రచనలలో అవసరమైతే తిరగబడే మహిళలు, కొకు కథలలో మధ్యతరగతి చైతన్యంతో తమ జీవితాన్ని మార్చుకునే పాత్రలు తారసపడతాయి. వాళ్లంతా బ్రాహ్మణ భూస్వామ్య కుటుంబాలకు, అగ్రకులాలకు చెందినవాళ్లు కావచ్చు. వారికి ఆ వెసులుబాటును చరిత్ర, వాళ్లు పుట్టి పెరిగిన పరిస్థితులే కల్పించాయి. కానీ 'అధూరె' మహిళలకు ఏ అండా ఉండదు. పైగా మగపెత్తనం, సాంప్రదాయపు సంకె ల. చదువు, ఆస్తి అసలే ఉండవు. రాజ్యం వల్ల ఒనగూరే ప్రయోజనాల ప్రస్తావన ఈ కథలలో ఎక్కడా ఉండదు. కేవలం తమ పరిస్థితులలో బతకడంలోని సంఘర్షణ మాత్రమే ఉంటుంది. ఈ కథల్లోని ప్రతి తల్లి దైన్యంతో నిస్సహాయంగా జీవించడం కనిపిస్తుంది..

అమెరికా, మీడియానే కాదు, ఆంధ్రా సినీ పరిశ్రమ యావత్తు ముస్లింలను దుష్టులుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్న కాలమిది. వాటికి జవాబుగా వాళ్ల జీవన విధానం, రీతి రివాజుల గురించి తెలియచెప్పడం ద్వారా కథకునిగా స్కైబాబ సరైన వైఖరిని తీసుకు న్నట్లు అనిపిస్తున్నది. వాటికి సమర్ధింపేమి ఉండదు. ఐతే వాటి ఆచరణలో ముస్లిం సమాజం ఎదుర్కొనే ఘర్షణ, సంఘర్షణల ను, సంతోషాన్ని, కష్టసుఖాలను కలబోసుకోవడం ఉంటుంది.రాజ్యం, ఇతర ముస్లిమేతర సమాజాల నుంచి ఎటువంటి తోడ్పాటు ఆశించక, సమిష్టిగా తమ కష్టాలను కడతేర్చుకోవడం కూడా కనిపిస్తుంది..

రచయిత ఎటువంటి వాదాల, మూసల ప్రభావంలో పడకుండా కథలను జీవితానికి నిబద్ధం చేస్తూ కథ నడపడం విశేషం. తెలంగాణ పైనే కాదు, ముస్లింవాదంపై చెలరేగుతున్న ప్రచారాలను, అపవాదులను కాదని జీవితాన్ని నిష్కర్షగా బేరీజు వేసుకుంటే తప్ప రచయితకు ఇటువంటి రచన సాధ్యం కాదు. తెలంగాణ రచయిత సీమాంధ్ర ప్రమాణాలను సంప్రదాయాలను ఆధిపత్యాన్ని కాదని తన స్వీయ అభివ్యక్తితో రచన చేయడానికి ఉపక్రమించినప్పుడల్లా ఆ ప్రాంతపు రచయితల నుంచి తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది. వారి మార్గంలో నడిచినపుడు వాళ్లు నడిపే ఉద్యమాలలో భాగంగా ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ ముస్లిం, దళిత రచయితలకు ప్రతిష్ట, మన్నన లభించింది. ఈ సాహిత్య రాజకీయాలను ఆధిపత్య వ్యూహాలను కాదని తన స్వీయ అభివ్యక్తిని సాధించుకున్న రచయిత స్కై బాబ. ఇది ఒక రకంగా తెలంగాణ సాహిత్య ఉద్యమం, అం దులో ప్రధాన భాగమైన ముస్లింవాదం సాధించిన విజయం. ఇటువంటి సాహిత్యం విస్తృతంగా వెలువడితే తప్ప తెలంగాణ మనిషి లేదా ముస్లిం, దళితవాదులు ఆధిపత్యవాదులు- సీమాంధ్ర పాలక వర్గాలను, మధ్యతరగతిని ఎదుర్కోవడం సాధ్యం కాదు.

'శ్వేతరాత్రులు' (సంకలనం) నుంచి తెలంగాణ కథా రచయిత చేసిన పయనానికి ఉన్నత స్థాయి ప్రతిఫలనం 'అధూరె'. ఆంగ్లంలోకి తర్జుమా అయిన ఉర్దూ కథలు, సురవరం, కేశవస్వామి, ఆళ్వారు, దాశరథి వంటి రచయితలు రాసిన కథలు చదివిన నాకు అధూరె కథలు చదివినప్పుడు చాలా తేడాలు స్ఫురించాయి. స్కైబాబ ముస్లిం సమాజానికి ఇన్‌సైడర్. ముస్లింలలోని అట్టడుగు వర్గాల జీవితాన్ని తీసుకుని కథలు రాసిన వ్యక్తి. ఆ సమాజాన్ని అర్థం చేసుకుని వారి విలువలు, జీవన రీతిని చిత్రించడంలో ఒక ఇన్‌సైడర్ అయితే ఒక రకంగాను, అవుట్ సైడర్‌గా మరో రకంగానూ ఉండడం విశేషం. ఇటీవల 'నల్లగొండ జిల్లా కథలు' చదివినప్పుడు ఒక పరిణామం కనిపించింది. 1900-1956-60 వరకు వచ్చిన కథలలో కొన్ని మినహాయి స్తే ఎక్కడో ఒక దగ్గర ముస్లిం పాత్ర కనిపిస్తుంది. తెలంగాణ సామాజిక సంబంధాలలో వాళ్లకంటూ ఒక పాత్ర ఉంటుంది.

వాళ్లు అందు లో అవిభాజ్యమైన భాగం. ఎక్క డా వాళ్లను దుష్టులుగా చిత్రించే వైఖరి కూడా ఉండదు. 1960 నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి న తర్వాతే ఇటీవల వరకు వచ్చిన కథలలో ముస్లింల పాత్రలు లేవు. హైదరాబాద్ రాష్ట్రం చీలిపోవడం, అధికార భాషగా ఉర్దూ రద్దు కావడం, పైగా పోలీస్ యాక్షన్ జరగడం తెలిసిందే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడానికి ఈ పరిణామానికి ఏమైనా సంబం ధం ఉన్నదేమో ఆలోచించాలి. తర్వాత కూడా తెలంగాణ జీవన విధానంలో ముస్లింలు అంతర్భాగమైన విషయమై కథలు రాసిన వారిలో నెల్లూరి కేశవస్వామి, దాశరథి రంగాచార్య మాత్రమే ఉన్నా రు. తెలంగాణ తెలుగు రచయితల మనో ప్రపంచంలోంచి వాళ్లు గల్లంతు కావడమే వారి దుస్థితిని తెలియజేస్తుంది. తమ సూఫీ విలువలతో స్థానిక జీవన విధానాన్ని, రీతిని ఎంతగానో పరిపుష్టం చేసిన ముస్లిం జన సమూహం తిరిగి తమ ఉనికి గురించి తామే చెప్పుకోవల్సి రావడం విచారించదగ్గ విషయం. ఈ నేపథ్యంలో ముస్లిం రచయితలు, కవులు, స్కైబాబ కృషి ఎన్నదగింది.

అధూరె చదువుతుంటే భారతీయ సాహిత్యంలో ప్రసిద్ధి గాంచిన ఇప్టా రచయితలు గుర్తుకువచ్చారు. ఉర్దూ సాహిత్యంలోనే ఆపాగా పేరుగాంచిన ఇస్మత్, హైదరాబాద్‌కు చెందిన వాజిదా తబస్సుం, జిలానీ బానోలు, కె.ఎ.అబ్బాస్, కిషన్ చందర్, రాజేందర్‌సింగ్ బేడీలు, మంటో ముస్లింల జీవితాలను చిత్రించినవారిలో ప్రముఖు లు. వారి రచనలన్నీ, ప్రధానంగా కథలు ఉన్నత, మధ్యతరగతి వర్గాల జీవితాలను చిత్రించినవే. సమస్యలు కూడా వారివే. అయితే వీరిలో ముస్లిం ఫ్యూడలిజం కింద అణగారిపోయినవారి గురించి కథలు రాసిన వారిలో కొందరున్నారు. అది కొంతవరకే. అట్టడుగు వర్గాలు, గ్రామీణ ముస్లింల గురించి రాసింది తక్కు వే. బషీర్ ఇందుకు కాస్త మినహాయింపు. ప్రేంచంద్ ముస్లిం రైతులు, స్త్రీల గురించి చాలా రాశారు. చిన్న పట్టణాలలో అవీ ఇవీ పనులు చేస్తూ అర్బన్ ప్రొలిటేరియట్ గురించి కథలు రాసిన వారి లోస్కైబాబ ప్రత్యేకంగా నిలు స్తారు. తెలుగు సాహిత్యంలో ఇటువంటి కథలు రాసినవారిలో పెద్దిభొట్ల, అల్లం రాజయ్య, తుమ్మేటి ఉన్నారు. చిన్న చిన్న పట్టణాలలో వ్యవస్థ నుంచి ఎటువంటి మద్దతు లేకుండా అసహాయంగా మారిన స్త్రీల గురించి రాసినవారిలో స్కైబాబ ప్రథములనే చెప్పాలి..

1901-10 మధ్యకాలానా ఆనాడు పెల్లుబికిన స్వదేశీ ఉద్యమం ప్రభావంతో చాలా నవలలే వచ్చాయి. ముస్లిం రాజవంశాలను దుష్టంగా, నీచంగా చిత్రించే రచనలు అనేకం వచ్చాయి. ఆనాడు బ్రిటీషు వలసపాలకులు, వారి చరిత్రకారులు ప్రచారంలో పెట్టిన భావజాలం దన్నుగా వచ్చినవవి. వాటిని సమీక్షిస్తూ మహాకవి గురజాడ భవిష్యత్తు భారతదేశ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మతమహమ్మారి చిచ్చు గురించి హెచ్చరించారు. ఆనాడే ఆయన కనపరిచిన ఆందోళన పరిణామాలు పార్టీషన్ ముందు నుంచి నేటి వరకు చవిచూస్తూనే ఉన్నాం. కానీ ఆయన ఆందోళనకు పరిష్కారం మాత్రం దొరకలేదు. 'అధూరే' చదివితే గురజాడ ఆందోళనకు ఉపశమనం కలిగించే ఆశ జనించింది.

- సామిడి జగన్‌రెడ్డి
94904 91551
http://www.andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2013/apr/1/vividha/1vividha3&more=2013/apr/1/vividha/vividhamain&date=4/1/2013#.UVlfyhfTwb8

Thursday, 28 February 2013

అనేక ఆధిపత్యాలపై ఒక్కుమ్మడి పోరు 'జగ్‌నే కీ రాత్‌'


కవి స్వాప్నికుడు. నిస్సహాయుడు కూడా. స్కైబాబ ఇందుకు మినహాయింపు కాడు. పైగా సమాజంలో జరుగుతున్న అన్ని దురాగాతాలకు తల్లడిల్లిపోతాడు. గుక్క పడతాడు, నిప్పులు చెరుగుతాడు. అన్ని ఆధిపత్య ధోరణులను తూలనాడే తత్వం స్కైబాబ కవిత్వానికి ఉన్న లక్షణం. స్కైబాబ కవితా సంకలనం 'జగ్‌నే కీ రాత్‌' చదువుతుంటే సిద్ధులగుట్ట కాడ నిప్పుల గుండం తొక్కుతున్నట్లు వుంటుంది. ఈ తీవ్రత కవిత్వానికి రావడానికి కారణం స్కై అంతరంగంలో ఎడతెరిపి లేకుండా భగభగ మండుతున్న ఆలోచనా స్రవంతే కారణమని అనిపిస్తుంది. ఒక దారం పోగు లాగుతున్న కొద్దీ సాగినట్లు ఆ ఆలోచన ధార ముందుకు సాగుతూ పోతుంటుంది. 'జగ్‌నే కీ రాత్‌' సంకలనంలోని చాలా కవితలు ఈ విషయాన్ని పట్టిస్తాయి. అప్పుడప్పుడు స్కై వ్యక్తీకరణలకు హేతుబద్దత లేనట్లు కూడా అనిపిస్తూ వుంటుంది. అది పైకి కనిపించే లక్షణం. కవిత్వాన్నంతా కాకపోయినా ఏ కవితకు ఆ కవిత చదివినా స్కై సమంజసమైన ఆగ్రహం మన మనసులను తాకి లోలోన మంటలు పుడుతూ వుంటాయి. 

కవిగా స్కై ఇప్పటి వరకు చేసిన ప్రయాణాన్ని 'జగ్‌నే కీ రాత్‌' తెలియజేస్తుంది. ఇందులో మూడు దశలు కనిపిస్తాయి. మొదటి కవితలు తాను స్త్రీగా, ఒక తల్లికి కొడుకుగా ముస్లిం సమాజంలోని స్త్రీని మతం పేర, ఆచారాల పేర అణచివేస్తున్న తీరును ప్రశ్నిస్తాడు. ఇస్లాం మతం పేర పురుషాధిక్యత ఎంత దుర్భరంగా వుందో, స్త్రీల పట్ల ఎంత దాష్టీకంగా వ్యవహరిస్తుందో స్కై చెబుతాడు. ఈ కవితలు మెజారిటీ హిందూ సమాజం ఆమోదించి, హర్షించే భావజాలానికి సంబంధించినవి. ఇది స్కై ముస్లిం సమాజంలోని వ్యక్తిగా చేసిన అంతర్గత పోరాటంలో ఒక భాగం. 

రెండో రకం కవితల విషయానికి వస్తే - దళితులతో స్కై మమేకమవుతూ లేదా వారితో ఐక్యతను చాటుకోవడం కనిపించే కవితలు. 'డప్పు కొట్టడమే న్యాయం', 'మర్ఫా', 'ముస్లింవాడలు', 'జల్‌జలా' ఇందుకు కొన్ని ఉదాహరణలు. ఈ దేశంలోని మెజారిటీ ముస్లింల స్థానీయతను, తమ వారసత్వాన్ని చాటే కవితలు ఇవి. నిజాం పాలనలో దళితులు తమ చెంతకు వచ్చిన అవకాశాన్ని వాడుకుని ఇస్లాంలో చేరి తమ కుల వివక్షను, అణచివేతను అధిగమించే ప్రయత్నం చేశారు. ముస్లింల్లో చాలా మంది విదేశీయులు కారనే ఒక ఎరుకతోనే కాకుండా ఆ విషయాన్ని బలంగా చెప్పడానికి స్కై ఈ కవితలను ఉపయోగించుకున్నాడని అనిపిస్తుంది. 
ఇక, అసలు విషయానికి వస్తే, స్కైని ఒక వివాదాస్పదుడైన కవిగా, కాలకంఠుడిగా చూపించే మూడో రకం కవితలు. ఇక్కడ స్కై ముస్లింగా, తెలంగాణవాడిగా, వర్ధమాన దేశాల ప్రతినిధిగా గొంతు విప్పుతాడు. ఈ మూడు లక్షణాలు చాలా కవితల్లో విడదీయరానంతగా కలగలసిపోయి కనిపిస్తాయి. ఈ మూడు విషయాల్లోనూ స్కై వివక్షకు, అణచివేతకు, దోపిడీకి గురవుతున్నవాడే. తనపై, తన సమాజంపై జరుగుతున్న ముప్పేట దాడిని గ్రహించి, అర్థం చేసుకుని తీవ్ర ఆగ్రహానికి గురై ఏమీ చేయలేక నిస్సహాయతతో అర్థరాత్రి లోకాన్ని నిద్ర లేపి చెప్పే ప్రయత్నం నుంచి వెలువడిన కవితలు ఇవి. దాని వల్ల స్కై కవితలకు ఒక సంకీర్ణ లక్షణం అలవడింది. ఈ సంకీర్ణత వల్ల ఏ పంక్తికి ఆ పంక్తినో, ఒక కవితలోని ఒకటి రెండు పంక్తులనో విడగొట్టి వ్యాఖ్యానించడం కుదరదు. అలా వ్యాఖ్యానించడానికి పూనుకుంటే స్కై అరాచకుడిగా, అనామోదయోగ్యుడిగా కనిపిస్తాడు. 

నిజానికి, సభ్య సమాజం కళ్లు చెదిరే భావతీవ్రత స్కైది. గుండెను మెలి పెట్టి నెత్తురును సుడులు తిప్పే తీవ్రత అతని కవితలది. తీవ్రమైన ప్రభావం చూపడం వల్ల మనలోని స్థిరీకృత భావజాలం దారం తెగిన పతంగిలా కొట్టుకుంటుంది. అందుకే మనకు స్కై మీద తప్పకుండా కోపం వస్తుంది. మనది సభ్య సమాజపు అసహనమని తెలుసుకోవడానికి కొంత సహనంతో ఆలోచించాల్సి వుంటుంది. అలా సహనంతో, సానుభూతితో ఆలోచించినప్పుడు గానీ, ఇక్కడ జరుగుతున్న అనేకానేక హింసారూపాలు, దాష్టీకాలు, అణచివేతలు మనల్ని కలవరపెడుతున్నప్పుడు గానీ స్కై ధర్మాగ్రహం మనకు కొంత అర్థమవుతుంది. ఆ తర్వాత అతని కవితలను ముక్కలు ముక్కలుగా కాకుండా ఒక మొత్తాన్ని చదివినప్పుడు అది మరింతగా అర్థమైపోయి స్కై ప్రస్తుత సమాజానికి అవసరమైన కవిగా కనిపిస్తాడు. 

'సర్బకఫ్‌' కవితలో పదే పదే వచ్చే 'తలకు కఫన్‌ కట్టి కదులుతున్నాం' అనే పంక్తి, ఇదే కవితలోని 'ఇస్‌ దేశ్‌ మే/ జిత్‌నా ఖూన్‌ ముసల్మాన్‌ కా బహాయా గయా/ ఉస్‌కా అంజామ్‌/ బహుత్‌ మహెంగా పడేగా..' అనే చివరి పంక్తులు, 'ఆకుపచ్చతో మొదలవుతున్నా' పంక్తి స్కైని పచ్చి మతవాదిగా చూపించడానికి ఆస్కారం వుంది. అందుకే స్కై కవితలను ఎక్కడికక్కడ పోగులు పెట్టకుండా చదివితే తప్ప స్కై ఆశిస్తున్నదేమిటి, స్కై ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు అనేది అర్థం కాదు. 'సర్బకఫ్‌' కవితలోనే 'ఈ మట్టిని తొలుచుకుని మొలకెత్తినవాళ్లం', 'మా మాతృప్రేమను ఎవర్రా శంకించేది' వంటి పంక్తులు వుండడమే కాకుండా వాటికి ముందూ వెనుకా స్కై భావజాలం పరుచుకుని వుంది. దీనికి తోడు మిగతా కవితలు పాలకుల దుష్టనీతిని, అగ్రరాజ్య ఆధిపత్యాన్ని వ్యతిరేకించే బలమైన కవితలున్నాయి. తెలంగాణ అస్తిత్వ ఉద్యమాన్ని సొంతం చేసుకున్న భావజాలమూ వుంది. తన మత ప్రతీకలను వాడుకుంటూ ఈ నేల మీద తనకూ హక్కు వుందని ప్రకటించుకోవడం, స్థానిక దళితులు, తెలంగాణ ప్రజల ముఖాల్లో తన ముఖం వెతుక్కోవడం స్కై కవితల్లో చూస్తాం. హిందూ మత ప్రతీకలను కాకుండా ముస్లిం మత ప్రతీకలను స్కై వాడుకున్నాడు. హిందూ మతఛాందసులను ఎదుర్కోవడానికి స్కై ఇస్లాం మత ప్రతీకలు బాగా ఉపకరించాయి. యుద్ధం చేయడానికి కొత్త పనిముట్లను స్కై తయారు చేసుకున్నాడు. దళిత కవిత్వం ఆధిపత్యాలపై పోరుకు క్రైస్తవ మత ప్రతీకలను బలంగా వాడుకోవడం ఇలాంటిదే. 

అభ్యుదయ కవిత్వానికి జవసత్వాలిచ్చే సందర్భంలో శ్రీశ్రీ గొంతు కూడా ఈ రకంగానే పలికింది. శ్రీశ్రీ హిందూ మత ప్రతీకలనే కొత్త అర్థంలో వాడాడు. పాత పదాలకు కొత్త అర్థాలను నిర్దేశిస్తూ శ్రీశ్రీ అశ్వంలా కవిత్వాన్ని పరుగెత్తించడం చాలా మందికి దిమ్మ తిరిగేలా చేసే వుంటుంది. శ్రీశ్రీ 'అవతారం' కవిత మొత్తం ఈ పద్ధతిలోనే సాగుతుంది. 'హరోం! హరోం హరా!/ హర! హర! హర! హర!/ హరోం హరా అని కదలండి' అని ఆయన పిలుపునిస్తాడు. ఇక 'జగన్నాథుని రథ చక్రాలు' కవితలో శ్రీశ్రీ వాడిన ప్రతీకలు ఎక్కడివో మనందరికీ తెలిసిందే. శ్రీశ్రీ కవిత్వంలోని పంక్తులను ఎక్కడికక్కడ విడగొట్టి హిందూ మత ప్రతీకలను చూపుతూ మాట్లాడితే ఎలా వుంటుంది? శ్రీశ్రీ కవిత్వం మనకు అందిస్తున్న స్ఫూర్తిని అనుభవిస్తున్న మనం ఆ పని చేయగలమా? ఇక్కడ శ్రీశ్రీకి, స్కైకి పోలిక తేవడం, శ్రీశ్రీతో సమానంగా స్కైని చూపడం నా ఉద్దేశం కాదు. స్కై అస్తిత్వ వేదన బలంగా వ్యక్తం కావడానికి ఇస్లాం మత ప్రతీకలను ఎంత బలంగా వాడుకున్నాడనేది విమర్శకులు చూడాల్సి వుంటుంది. ఏ స్ఫూర్తి స్కైబాబ కవిత్వం మనకు అందిస్తున్నదనేది పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. స్కైకి ప్రజాస్వామిక స్ఫూర్తి లేకపోతే, మతఛాందసుడిగానే మాట్లాడితే ఇస్లాం మతాచారాలను అంత నిక్కచ్చిగా ఖండించి వుండేవాడు కాదనే విషయాన్ని మనం ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. స్కైని ఒక మూలవాసిగా, అభివృద్ధి అంచుల్లో లేని పీడితునిగా, తన స్థితిని తాను వ్యక్తీకరించుకుంటూ వివిధ ఆధిపత్యాలపై ఒకేమారు సమరం చేస్తున్న సైనికుడిగా చూడాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితులు కల్పిస్తున్నాయి. 

స్కైబాబ హిందూ, ముస్లిమ్‌ల మధ్య గల సామాజిక సంబంధాలను బాగా ఎరిగినవాడు. భారతీయ ముస్లిమ్‌ల సూఫీ తాత్వికతకు ఆధునిక కాలంలో అతను ప్రతినిధిగా నిలబడతాడు. అతని పలు కవితల్లో కనిపించే తాత్విక ప్రతీకలతో పాటు 'సూఫీ దేవుడు' అనే కవిత ఇందుకు తార్కాణంగా నిలుస్తుంది. పల్లెల్లో తెలుగువాళ్లు, ముస్లిమ్‌లు కలిసి జరుపుకునే పండుగల సంస్కృతి ఇక్కడ విలసిల్లాలని అతను ఆశిస్తాడు. సూఫీ తాత్వికత గురించి ఇక్కడ విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఏమి ఆశిస్తుందో, ఎటువంటి సామాజిక సంబంధాలను, ఎటువంటి సమాజాన్ని కాంక్షిస్తుందో అందరికీ తెలిసిందే. స్కైబాబ కవిత్వంలో ఇది అంతర్లీనంగా సాగుతూ వుంటుంది. 

హేతువాద ఉద్యమాలు ఫలితాలు సాధించని థను మనం అనుభవిస్తున్నాం. దాని ఫలితాలు ఎంత ఘోరంగా ఉన్నాయో కూడా చూస్తున్నాం. మన మెడల మీద కత్తులు వేలాడుతున్నాయి. ఆ కత్తులను ముస్లింల మీదికి ఎక్కుపెట్టే భావజాలం క్రమక్రమంగా ఊపందుకుంటున్నది. గుజరాత్‌ మారణహోమం 'కలియుగ ధర్మాన్ని' రుచి చూపించింది. ఇది హేతువాదుల, మార్క్సిస్టుల వైఫల్యానికి ఒక మచ్చుతునక. ఇటువంటి సందర్భంలో తుప్పు పట్టిన పనిముట్లనే సమర్థమైన ఆయుధాలుగా భావించడంలో అర్థం లేదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికీ ఈ నేల మీద స్వేచ్ఛగా బతికే హక్కు వుందని, ఈ దేశ పౌరులందరికీ బుక్కెడు బువ్వ, చిన్నపాటి గూడు ఉండాల్సిన అవసరం వుందని భావించి హిందూ ఆధిపత్య భావజాలాన్ని కొత్త పనిముట్లతో ఎదుర్కోకపోతే ఆత్మవంచన చేసుకున్నవాళ్లం అవుతాం. మతం, ఆచారాలు, సంప్రదాయాలను పూర్తిగా తృణీకరించాలనుకునే మనం వాటి నుంచి ప్రజలను కాస్తయినా దూరం చేయలేకపోయాం. దేశీయతను, ఆచార సంప్రదాయాలను శత్రువులకు ఆయుధాలుగా ఉపయోగపడే విధంగా వదిలేశాం. ఈ స్థితిలోనే దళిత వాదం, ముస్లిం వాదం, తెలంగాణ అస్తిత్వ వాదం కొత్త చూపుతో ముందుకు వచ్చాయి. భిన్నత్వాన్ని కాపాడుకుంటూనే ఏకత్వాన్ని సాధించి, ముందుకు సాగే సమాజం కోసం ఎదురు చూస్తున్నవాళ్లం స్కైబాబ కవిత్వాన్ని ఆహ్వానించక తప్పదు. ఈ దేశం పౌరుడిగా తనకు గల హక్కులను డిమాండ్‌ చేయడం స్కైకి పుట్టుకతోనే సంక్రమించిన అనివార్యతగా గుర్తించడం నేటి అవసరం. 

పాత విశ్వాసాలకు చేర్పులు, మార్పులు ఎంత అవసరమో తెలంగాణ కవి బలంగా గుర్తించాడు. తమ మూలాలను అన్వేషించుకుంటూ, గతాన్ని విశ్లేషించుకుంటూ, వర్తమానాన్ని పరిశీలిస్తూ కొత్త మార్గాన్ని వేశాడు. పైపైన చూస్తే ఆ కొత్త మార్గం పలు వైరుధ్యాలతో, కొన్నిసార్లు అతివాదంగా, మరికొన్ని సార్లు మితవాదంగా కనిపిస్తూ వుంటుంది. అందువల్ల ఈ కవిత్వాన్ని లోతుగా పరిశీలించాల్సి వుంటుంది. ఇదే లక్షణం స్కైబాబ కవిత్వానికి వర్తిస్తుంది. అలా చూసినప్పుడు స్కైబాబ ముస్లిమ్‌ తెలుగు కవిత్వంలోనే కాదు, తెలంగాణ కవిత్వంలో, తెలుగు కవిత్వంలో వేసిన ముందడుగు మనకు తెలిసి వస్తుంది. 

- కాసుల ప్రతాపరెడ్డి 

Read more at: http://telugu.oneindia.in/sahiti/essay/2013/skybaba-poetry-unique-expression-112238.html#cmntForm